ETV Bharat / international

ఇమ్రాన్​ ఖాన్​కు పాక్​ సుప్రీంకోర్టు షాక్​.. 'అవిశ్వాసం'పై ఓటింగ్​కు ఆదేశం

author img

By

Published : Apr 7, 2022, 9:10 PM IST

Updated : Apr 7, 2022, 9:32 PM IST

imran-khan
ఇమ్రాన్​ ఖాన్​కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్​

21:07 April 07

ఇమ్రాన్​ ఖాన్​కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్​

Imran khan news: ఇమ్రాన్​ ఖాన్​కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం వంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. పార్లమెంటును పునరుద్ధరిస్తున్నట్లు చెప్పింది. ఏప్రిల్​ 9న సభను నిర్వహించి ఇమ్రాన్ ఖాన్​పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్​ను ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించింది.

అంతకుముందు గురువారం మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్​పై అవిశ్వాస తీర్మానం కేసులో పాక్​​ సుప్రీంకోర్టులో వాదోపవాదనలు వాడీవేడిగా సాగాయి. ఈ సందర్భంగా విపక్షాలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. 'జాతీయ అసెంబ్లీని చట్టవిరుద్ధంగా రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానం ఇప్పటికీ ఉంది. ఉద్దేశపూర్వంగా చేసిన తప్పిదాలను విస్మరిస్తే.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని కోరుతున్నాం. దేశానికి సేవ చేసేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉంది. ఆ తేడా మీకు తెలుస్తుంది' అంటూ విపక్షాలు సుప్రీంకు వెల్లడించాయి. అలాగే దేశద్రోహానికి పాల్పడినట్లు ఏవైనా ఆధారాలుంటే.. తాను వెంటనే రాజకీయాలనుంచి తప్పుకుంటానని విపక్ష నేత షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. మరోపక్క అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి ఎన్నికల సంఘం వెల్లడించింది.. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును గురువారం రాత్రి 7.30 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తాజాగా తీర్పు వెలువరించింది.

ఏం జరిగిందంటే..: ఇమ్రాన్ ఖాన్​పై సొంత పార్టీ నేతల తిరుగుబాటులో మార్చి చివరి వారంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. అయితే తీర్మానం తిరస్కరణకు గురైంది. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ అప్పుడే ప్రకటించారు.

ఇమ్రాన్​పై పార్లమెంట్​లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. అయితే, పాకిస్థాన్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సభను వాయిదా వేశారు.

అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్ ఖాన్. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. 'నాకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్‌పై జరిగిన విదేశీ కుట్ర. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ(ఆ దేశ పార్లమెంట్)ని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాశా. తమను ఎవరు పరిపాలించాలో పాకిస్థాన్‌ ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి' అని ఇమ్రాన్ పేర్కొన్నారు. మరోవైపు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​కు అనుమతించకుండా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. విపక్ష పార్టీలు పార్లమెంట్​ను వీడేది లేదని అన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. తమ న్యాయవాదులు అత్యున్నత ధర్మాసనానికి వెళ్తున్నారని తెలిపారు.

సుప్రీం కోర్టులో వాయిదాల పర్వం: జాతీయ అసెంబ్లీ రద్దుతో పాకిస్థాన్​ రాజకీయ సంక్షోభం ముగిసినట్లు భావించినా, ఈ కేసును పాకిస్థాన్​ సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించడం వల్ల పరిణామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. పిటిషన్​పై ఆదివారమే విచారణ చేపట్టగా తుది నిర్ణయం వెలువడుతుందని అంతా ఎదురుచూశారు. కానీ ఎలాంటి తీర్పు చెప్పకుండానే విచారణను ఏప్రిల్​ 4కు వాయిదా వేసింది కోర్టు. రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఏప్రిల్​ 4, 5, 6 తేదీల్లో విచారణను వాయిదా వేస్తూ వచ్చింది సుప్రీంకోర్టు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు పార్లమెంటులో జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో రికార్డులను అడిగింది. అనంతరం ఏప్రిల్ 7న మళ్లీ విచారణ జరిపింది. వాదోపవాదనలు విని తీర్పును వెలువరించింది.

ఆ జాబితాలోకి ఇమ్రాన్​: పాకిస్థాన్‌ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ 2018 ఆగస్టులో పదవీ బాధ్యతలు చేపట్టగా, జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్‌ కూడా అదే జాబితాలో చేరనున్నారు. అయితే.. సుప్రీంకోర్టు ఏదైనా సంచలన తీర్పు ఇస్తే.. ఈ పరిణామాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరం.

ఎలాంటి సంబంధం లేదు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది ఆ దేశ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. సైన్యం ఉన్నతాధికారి ఒకరు ఈమేరకు టీవీ ఛానెల్​లో మాట్లాడారు.

Last Updated :Apr 7, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.