ETV Bharat / international

చైనా దొంగ లెక్కలు.. కొవిడ్‌కు బలైనా సాధారణ మరణాలేనని ప్రకటన

author img

By

Published : Jan 9, 2023, 1:06 PM IST

China is hiding covid deaths
కొవిడ్‌ మరణాలను సాధారణ మరణాలుగా చెబుతున్న చైనా

చైనాలో శ్మశాన వాటికలు కొవిడ్‌ మృతులతో కిక్కిరిపోతున్నప్పటికీ కొవిడ్‌ మరణాలను చైనా దాచిపెడుతోంది. తమ దేశంలో పరిస్థితి అంతా బాగుంది అన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ చివాట్లు పెట్టినా చైనా మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. కరోనా విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సోకి మరణించినప్పటికీ వాటిని కొవిడ్‌ మరణాలుగా నమోదు చేయవద్దని వైద్యులపై డ్రాగన్‌ ఒత్తిడి తెస్తోంది..

కొవిడ్‌కు పుట్టినిల్లైన చైనా ఈ మహమ్మారి ప్రారంభం అయిన దగ్గర నుంచి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తోంది. కొవిడ్‌ సమాచారాన్ని దాచిపెడుతోంది. సామాజిక మాధ్యమాలను కట్టడి చేస్తూ విమర్శకుల గొంతులు నొక్కుతూ కరోనాకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా నానా అవస్థలు పడుతుంది. తమ దేశంలో కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేశామని గొప్పలు చెబుతూ ప్రపంచం ముందు నవ్వులపాలవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనాతో మరణించిన వారి మృతదేహాలతో శ్మశానాల్లో క్యూలు దర్శనమిస్తున్నా చైనా మాత్రం కొవిడ్‌తో మరణించిన వారు 5 వేల మంది మాత్రమే అంటూ దొంగలెక్కలు చెబుతోంది.

తాజాగా చైనా కుట్రలకు ఆధారం చేకూర్చేలా ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో కొన్ని చాట్‌ సంభాషణలు చక్కర్లు కొడుతున్నాయి. కొవిడ్‌ సోకి మరణించినప్పటికీ వాటిని కొవిడ్‌ మరణాలుగా డెత్‌ సర్టిఫికెట్లలో పేర్కొనవద్దని డాక్టర్లకు అధికారులు సూచిస్తున్నట్లుగా ఆ సంభాషణల్లో ఉంది. కొవిడ్‌ రోగులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వారు కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యంపాలై మరణించినా వాటిని కొవిడ్‌ మరణాలుగా డ్రాగన్ నమోదు చేయడం లేదు. కరోనా సమాచారాన్ని చైనా గోప్యంగా ఉంచడం వల్ల కొత్త వేరియంట్లను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామని WHO డైరెక్టర్‌ అథనోమ్‌ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.