ETV Bharat / international

Afghan India News: 'వారి పరిస్థితిపై భారత్​ ఆందోళన- సాయానికి సిద్ధం'

author img

By

Published : Aug 24, 2021, 4:11 PM IST

Updated : Aug 24, 2021, 4:41 PM IST

unhrc afghan india
అఫ్గానిస్థాన్ ఐరాస భద్రతా మండలి చర్చ

అఫ్గాన్​లో తలెత్తిన పరిణామాలపై ఓ పొరుగుదేశంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఐరాస మానవ హక్కుల మండలిలో జరిగిన సమావేశంలో భారత్ పేర్కొంది. శాంతియుత, ప్రగతిశీల అఫ్గానిస్థాన్ కోసం భారత్ ఎల్లప్పుడూ అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేసింది. అఫ్గాన్​లోని మహిళలు, చిన్నారులు, మైనారిటీల హక్కులను గౌరవించాలని పిలుపునిచ్చింది.

అఫ్గానిస్థాన్​లో పౌరులపై హింస పెరిగిపోయిందని, గౌరవంగా జీవించే హక్కుకు రక్షణ ఉంటుందో లేదోనని అక్కడి పౌరులు భయపడుతున్నారని భారత్(India at UNHRC) ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్​కు సాయం అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలిలో అఫ్గాన్ అంశంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశం(UNHRC session on Afghanistan)లో మాట్లాడిన భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే(Indra Mani Pandey).. అఫ్గాన్​లోని మహిళలు, చిన్నారులు, మైనారిటీల హక్కులను గౌరవించాలని పేర్కొన్నారు. పొరుగుదేశంగా అఫ్గాన్​ పరిణామాలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందన్నారు.

అఫ్గాన్​లో పరిణామాలు పొరుగుదేశాలకు ముప్పుగా పరిణమించకూడదని పాండే పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఆ దేశంలో పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆకాంక్షించారు. శాంతి భద్రతలు నెలకొంటేనే.. అఫ్గాన్​లో సుస్థిరత సాధ్యమని అన్నారు.

"శాంతియుత, సుసంపన్న, ప్రగతిశీల అఫ్గానిస్థాన్ కోసం భారత్ ఎల్లప్పుడూ అండగా నిలబడింది. ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపైనే ఇరుదేశాల సహస్రాబ్దాల స్నేహబంధం ఆధారపడి ఉంది. అఫ్గానిస్థాన్​లోని మా మిత్రులకు సహాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే(India ready to assist Afghanistan) ఉంటుంది. శాంతి, సుస్థిరత సాధించేందుకు అఫ్గాన్ ప్రజలకు అంతర్జాతీయ సమాజం సంపూర్ణ మద్దతు అందించాలి."

-ఇంద్రమణి పాండే, ఐరాస మానవ హక్కుల మండలిలో భారత శాశ్వత ప్రతినిధి

అఫ్గాన్​లో అందరి ప్రాతినిధ్యంతో కూడిన సంఘటిత వ్యవస్థ ఏర్పాటు అవుతుందని భారత్ ఆశిస్తున్నట్లు పాండే పేర్కొన్నారు. విస్తృత ప్రాతినిధ్యం ఉన్న వ్యవస్థకు.. ఆమోదయోగ్యత, చట్టబద్ధత ఉంటుందని వ్యాఖ్యానించారు.

కఠిన చర్యలకు పిలుపు

ఈ సమావేశంలో మాట్లాడిన ఐరాస మానవహక్కుల మండలి చీఫ్ మిషెల్ బాచ్లెట్(UNHRC Chief Michelle Bachelet).. తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్​లో అనేక అకృత్యాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నివేదిక తమకు అందిందని తెలిపారు. పౌరులు, భద్రత బలగాల ఊచకోత సహా, మహిళలపై ఆంక్షలు విధించినట్లు తెలిసిందని చెప్పారు. అఫ్గాన్​లో హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలిలోని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. అఫ్గాన్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, లేదంటే నిజ నిర్ధరణ మిషన్ చేపట్టాలని అన్నారు.

ఇదీ చదవండి: 'తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే'

Last Updated :Aug 24, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.