Afghan jails: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్లో ముష్కరుల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వారి అరాచక పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోగా.. కనీసం తినేందుకు తిండిలేక చాలామంది తమ కన్న బిడ్డలను విక్రయించి పూటగడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ తాలిబన్ మూకలు.. ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆటవిక చట్టాలను అమలు చేస్తూ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్న నేరాలకు కూడా ప్రజలను జైళ్లలో పెట్టి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఆడ, మగ , చిన్నా, పెద్ద తేడా లేకుండా అక్రమ కేసులు పెట్టి కారాగారంలో నిర్బంధిస్తున్నారు. దీంతో.. అఫ్గాన్లోని జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. గరిష్ఠంగా 10 మందికి మించి ఉంచలేని ఇరుకు గదుల్లో 50మంది ఖైదీలను ఉంచుతున్నారు. తినేందుకు ఆహారం, కనీస అవసరాలు లేక వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అఫ్గానిస్థాన్లోనే అతిపెద్ద జైలు హెరాత్ ప్రాంతంలో ఉంది. ఈ జైలులో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులే ఖైదీలుగా ఉన్నట్లు అక్కడివారు తెలిపారు. గతంలో అమెరికా దళాలకు సహకరించిన వారిని, ఇతర ఉద్యోగులనే తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. షరియా చట్టాలను అమలు చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా శిక్షలను ఖరారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారులను సైతం ఖైదీలుగా మారుస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని దొంగిలించేందుకు యత్నించాననే కారణంగా తనను జైల్లో పెట్టారని శిక్ష అనుభవిస్తున్న ఓ బాలుడు తెలిపాడు. తనవైపు వాదనలు వినకుండానే శిక్ష ఖరారు చేసి జైలుకు తరలించారని అన్నాడు. ఇదే రీతిలో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలోనూ ఖైదీలు మగ్గిపోతున్నారని అఫ్గాన్ పౌరులు అంటున్నారు. దీంతో ఖైదీల సంఖ్య అధికం అవుతుండగా.. జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి గదిలో 50మందికి తగ్గకుండా ఉంచినప్పటికీ జైళ్లు సరిపోలేని పరిస్థితి నెలకొంది.
తాలిబన్లకు ఎదురుతిరిగిన వారిని జైల్లోనే హతమారుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హెరాత్ మహిళా జైలు గవర్నర్గా పనిచేసిన అలియా అజిజ్ను సైతం అలాగే హతమార్చినట్లు భయపడుతున్నారు. ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న తమవారంతా ఎప్పటికి తిరిగివస్తారో అని వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Ukraine Tension: 'ఉక్రెయిన్పై రష్యా ఏ రోజైనా దాడి చేయొచ్చు'