అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరోమారు కోరలు చాచింది. అమాయకులపై ఓ సాయుధుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు.. పది మంది మృతికి కారణమయ్యాయి. ఈ ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన ఓ పోలీసు అధికారి సైతం ప్రాణాలు కోల్పోయారు. కొలరాడో.. బౌల్డర్ నగరంలోని ఓ సూపర్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది.
కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతని పేర్లు, వివరాలు వెల్లడించలేదు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను పరిశీలించి, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కాల్పులకు కారణాలను ఇంకా కనుక్కోలేదు.
తొలుత వెళ్లిన పోలీసు మృతి
మృతి చెందిన పోలీసు అధికారిని ఎరిక్ ట్రాలీ(51)గా గుర్తించారు. స్టోర్లో కాల్పులు జరుగుతున్నాయని సమాచారం అందుకొని ముందుగా ట్రాలీనే అక్కడికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన తొమ్మిది మంది మృతుల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించినట్లు వెల్లడించారు.
రంగంలోకి హెలికాప్టర్లు
కాల్పులు జరిగిన సమయంలో స్థానికులంతా భయభ్రాంతులకు గురైనట్లు తెలుస్తోంది. స్టోర్లోని వినియోగదారులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే.. స్వాట్ బృందాలతో పాటు భారీ స్థాయిలో బలగాలు స్టోర్ వద్దకు చేరుకున్నాయి. కనీసం మూడు హెలికాప్టర్లు స్టోర్ పైకప్పు మీద దిగినట్లు తెలుస్తోంది. స్టోర్ కిటికీలను బద్దలు కొట్టిన భద్రతా దళాలు.. నిందితుడిని లొంగిపోవాలని లౌడ్ స్పీకర్ల ద్వారా ఆదేశించారు.
సహకారం ఉంటుంది
ఈ విషయంలో దర్యాప్తు కోసం ఫెడరల్ ఏజెన్సీలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాయని కొలరాడో తాత్కాలిక అటార్నీ మాథ్యూ కిర్ష్ స్పష్టం చేశారు. ఘటనా ప్రాంతంలో ఎఫ్బీఐ ఏజెంట్లతో పాటు ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ బ్యూరో అధికారులు సైతం ఉన్నారని తెలిపారు.
కొలరాడో గవర్నర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాల్పుల విషయాన్ని అధ్యక్షుడు బైడెన్కు వివరించినట్లు శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ట్వీట్ చేశారు.
ఏడో సామూహిక హత్య
అమెరికాలో ఈ ఏడాది జరిగిన సామూహిక హత్య(నలుగురి కంటే ఎక్కువ మరణాలు)ల్లో ఇది ఏడోది కావడం గమనార్హం. మార్చి 16నే అట్లాంటాలోని ఆసియా మసాజ్ పార్లర్లే లక్ష్యంగా ఓ కిరాతకుడు కాల్పులు చేసి 8 మందిని బలితీసుకున్నాడు. ఇందులో ఎక్కువ మంది ఆసియా సంతతి మహిళలే ఉన్నారు.
ఇదీ చదవండి: నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి