ETV Bharat / international

3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ

author img

By

Published : Mar 3, 2020, 7:20 AM IST

Updated : Mar 3, 2020, 8:48 AM IST

Nine times more new virus cases outside China than in: WHO
Nine times more new virus cases outside China than in: WHO

కొవిడ్​ 19 (కరోనా) వైరస్​తో ప్రపంచ దేశాలు బెంబేలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చైనాలో కంటే విదేశాల్లో దాదాపు 9 రెట్లు అధికంగా వైరస్​ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణాంతక వైరస్​ ధాటికి ఇప్పటి వరకు 3000 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ

చైనాలోని వుహాన్​ నగరంలో మొదలైన కొవిడ్​ 19 (కరోనా) వైరస్​ ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే సుమారు 60 దేశాలకు పైగా ఈ మహమ్మారి వ్యాపించింది. తాజాగా చైనాలో సోమవారం నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఇతర దేశాల్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతోంది.

గడిచిన 24 గంటల్లో చైనాలో కంటే విదేశాల్లో దాదాపు 9 రెట్లు అధికంగా వైరస్​ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు వైరస్​ కారణంగా 3000 మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 వేల మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 61 దేశాల్లో 127 మంది మరణించగా.. 8,739 కేసులను గుర్తించినట్లు డబ్ల్యుహెచ్​ఓ వివరించింది. అంతేకాకుండా దక్షిణ కొరియా, ఇరాన్​, ఇటలీ, జపాన్​ తదితర దేశాల్లో ఇటీవల నమోదైన కేసులు ఆందోళన కలిగిస్తున్నట్లు టెడ్రోస్​ వెల్లడించారు.

చైనా తర్వాత స్థానంలో ఇరాన్​

ఇరాన్​లో ఒక్క సోమవారమే 12 మంది మరణించారు. వైరస్​ కారణంగా ఆ దేశంలో ఇప్పటి వరకు 66 మంది బలికాగా.. చైనా తర్వాత అధిక మరణాలు సంభవించిన దేశంగా ఇరాన్​ నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్​కు సాయం అందించేందుకు డబ్ల్యూహెచ్​ఓ ముందడుగు వేసింది. సుమారు 15 వేలమంది వైద్య సిబ్బందితో కలిసి ఆ దేశానికి చేరుకుంది.

చైనాలో తగ్గుముఖం

చైనాలో ఆదివారం 206 కొత్త కేసులను గుర్తించినట్లు వివరించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వైరస్​ వ్యాప్తి తగ్గినట్లు పేర్కొన్నారు.

ఇటలీలో కరోనా భీతి

ఇటలీలో సోమవారం నాటికి కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 52కు పెరిగినట్లు అధికారులు తెపిపారు. ఇప్పటి వరకు దేశంలో 2వేలకుపైగా వైరస్ కేసులు నమోదైనట్లు వివరించారు.

కొత్తకేసులతో కలకలం

సౌదీ అరేబియాలో తొలి కరోనా కేసును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోర్చుగల్​లోనూ తొలి కేసు నమోదైంది. ఇటలీని సందర్శించి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో వ్యక్తికీ వైరస్​ లక్షణాలు కనిపించగా.. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Last Updated :Mar 3, 2020, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.