ETV Bharat / international

'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్​ది ప్రపంచ రికార్డు'

author img

By

Published : Jan 26, 2022, 9:50 AM IST

pak india un
pak india un

India Pakistan UNSC: ఐరాస వేదికగా పాకిస్థాన్​కు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. భద్రతా మండలిలో భారత్​పై విషప్రచారం చేసినందుకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్​కు దశాబ్దాల చరిత్ర ఉందని.. ముష్కరులకు ఆశ్రయం కల్పించడంలో ఆ దేశానికి ప్రపంచ రికార్డు ఉందని మండిపడింది.

India Pakistan UNSC: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని తెలిపింది. 'సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాల'నే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రసంగించిన భారత శాశ్వత ప్రతినిధి ఆర్ మధుసూదన్.. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్​కు దశాబ్దాల చరిత్ర ఉందని ఎండగట్టారు. ఇదే వేదికపై భారత్​ లక్ష్యంగా విషప్రచారం చేసిన పాకిస్థాన్​కు గట్టిగా బుద్ధి చెప్పారు.

India against pakistan UN

"ఐరాస వేదికను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్​కు ఇది మొదటిసారేం కాదు. ఉగ్రవాదులకు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తున్న పాకిస్థాన్​ స్థితిగతుల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు భారత్​కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతు అందించడంలో పాకిస్థాన్​కు దశాబ్దాల చరిత్ర ఉందని ఐరాస సభ్యదేశాలకు తెలుసు. ఉగ్రవాదుల స్పాన్సర్​గా ప్రపంచ దేశాల గుర్తింపు పొందింది. ఐరాస భద్రతా మండలి గుర్తింపు పొందిన ఉగ్రవాదులు పాకిస్థాన్​లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్​ది ప్రపంచ రికార్డు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఏదో ఓ రూపంలో పాకిస్థాన్ హస్తం ఉంటోంది. ఒసామా బిన్​లాడెన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మాట్లాడతారు. ఎలాంటి అధైర్యానికి లోనుకాకుండా అదే దారిలో వీరు పయనిస్తున్నారు. పౌరులకు రక్షణ కల్పించే విషయంపై మనం చర్చిస్తున్నాం. ప్రజలకు అతిపెద్ద ముప్పు ఉగ్రవాదుల నుంచే ఉంటోంది."

-ఆర్ మధుసూదన్, ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి

Jammu kashmir issue India pakistan

జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అంశంపై మాట్లాడిన మధుసూదన్.. ఈ ప్రాంతం పూర్తిగా భారత్​కు చెందినదేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రతినిధులు దీనిపై ఏ భావనతో ఉన్నారనే విషయం అనవసరమని చెప్పారు. జమ్ముకశ్మీర్​లో అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేశారు.

పొరుగుదేశాలన్నింటితో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు భారత ప్రతినిధి పేర్కొన్నారు. శిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ప్రకారం సమస్యల శాంతియుత పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఎలాంటి చర్చలైనా.. శాంతియుత, ఉగ్రవాద రహిత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. అలాంటి ఆమోదయోగ్య పరిస్థితులను నెలకొల్పే బాధ్యత పాకిస్థాన్​పైనే ఉందని స్పష్టం చేశారు. అప్పటివరకు సీమాంతర ఉగ్రవాదంపై పోరాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: Power outages: మధ్య ఆసియా దేశాల్లో కరెంటు కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.