ETV Bharat / crime

WhatsApp DP: వాట్సాప్​ డీపీలు పెడుతున్నారా.. అయితే బీ అలర్ట్​!

author img

By

Published : Jan 5, 2022, 7:08 AM IST

WhatsApp DP
WhatsApp DP

WhatsApp DP: వాట్సాప్​లో డీపీలు పెడుతున్నారా... అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే... ఇదే అదనుగా భావిస్తున్న సైబర్​ కేటుగాళ్లు... చిత్రాలు మార్ఫింగ్‌ చేస్తున్నారు. ఆపై బెదిరించి... రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

  • ఓ వివాహితుడి వాట్సాప్‌కి ‘కాల్‌ గర్ల్స్‌ కావాలా..?’ అనే శీర్షికతో లింక్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేయగానే అతడి చరవాణి నంబరు ఓ వాట్సాప్‌ గ్రూప్‌తో అనుసంధానమైంది. కొద్దిక్షణాల్లోనే నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల చిత్రాలు వచ్చాయి. ఏ అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోండని సందేశం వచ్చింది. వివాహితుడు తనకు అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇచ్చాడు. అంతే.. ఏదో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకోవాల్సిందే.. లేదంటే నీ అంతు తేలుస్తాం.. బతుకు బజారుకీడుస్తాం.. అంటూ అవతలి వ్యక్తులు బెదిరించడం మొదలుపెట్టారు. వివాహితుడు తన భార్యతో దిగిన చిత్రాన్ని వాట్సాప్‌ డీపీగా పెట్టుకోగా.. ఆ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి పంపించారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ చిత్రాలు వైరల్‌ చేస్తామని బెదిరించారు.
  • ఓ వ్యక్తి తన భార్యతో దిగిన చిత్రాన్ని వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నాడు. సైబర్‌ మోసగాళ్లు ఆ చిత్రాన్ని స్క్రీన్‌షాట్‌ తీసుకొని అందులోని భార్య చిత్రాన్ని మరో వ్యక్తితో ఉన్నట్లు మార్ఫింగ్‌ చేసి భర్తకు పంపించారు. ఈ చిత్రాలు వైరల్‌ అవ్వకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పరువు పోతుందని భయపడిన బాధితులు రూ.1.50 లక్షలు ఆ మోసగాళ్లకు బదిలీ చేశారు. అంతటితో ఆగకుండా మరిన్ని డబ్బులు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు.

WhatsApp DP: హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో రోజూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విటర్‌ వంటి మాధ్యమాల్లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపేవారు. స్నేహం పేరిట దగ్గరై, ఆయా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పెట్టే పోస్టులు, డీపీల్లోని చిత్రాలు తీసుకొని.. మోసగాళ్లు వారి ఖాతాలకు డీపీగా పెట్టుకునేవారు. ఎవరి చిత్రాలైతే తీసుకొని డీపీగా పెట్టుకున్నారో వారి స్నేహితులు, బంధువులకు చికిత్స నిమిత్తం డబ్బులు కావాలని సందేశాలు పంపేవారు. ఇలా డబ్బులు దండుకున్న కేసులు ఎన్నో నమోదయ్యాయి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్‌ డీపీలు తీసుకొని, వాటిని మార్ఫింగ్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడేవి. ఇప్పుడు పంథా మార్చినట్లుగా కనిపిస్తోందన్నారు.

స్పందిస్తే అంతే..

అపరిచిత వ్యక్తుల నుంచి ‘కాల్‌ గర్ల్స్‌ ప్రొవైడ్‌’ ఇతరత్రా పేర్లతో చరవాణికి ఏవైనా లింక్‌లు వస్తే, వాటిపై క్లిక్‌ చేయకుండా వెంటనే డిలీట్‌ చేయాలి. ఒకవేళ ఆ లింక్‌లపై క్లిక్‌ చేస్తే.. అవతలి వ్యక్తుల నుంచి బెదిరింపు తరహా సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ వచ్చినా స్పందించకుండా ఉంటే మంచిది. ఆ ఫోన్‌ నెంబర్లను బ్లాక్‌ చేసేయాలి. ఎప్పుడైతే మీరు స్పందించడం మానేస్తారో.. లేదా ఫోన్‌ నెంబరు బ్లాక్‌ చేస్తారో.. ఆ మోసగాళ్లు మరో ప్రయత్నంలోకి వెళ్లిపోతారు. స్పందిస్తే భయపడినట్లుగా గ్రహించి డబ్బులు డిమాండ్‌ చేయడం మొదలుపెడతారు. తస్మాత్‌ జాగ్రత్త.

కుటుంబ చిత్రాలు వద్దు..

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ

‘‘చాలా మంది వారి వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలకు భార్యాభర్తలు దిగిన చిత్రాలు డీపీలుగా పెట్టుకుంటారు. కొందరైతే రోజు రెండు, మూడు డీపీలు మారుస్తుంటారు. ఇదే సమస్యలు తెచ్చి పెడుతోంది. సామాజిక మాధ్యమ ఖాతాలను సైబర్‌ కేటుగాళ్లు హ్యాక్‌ చేసినప్పుడు అందులోని చిత్రాలు తీసుకొని, మార్ఫింగ్‌ చేస్తుంటారు. తెలియని లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు. సామాజిక మాధ్యమ ఖాతాలకు గుర్తు తెలియని అమ్మాయిలు, వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ను అంగీకరించవద్దు’’ అని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ సూచించారు.

ఇదీ చూడండి: వాట్సాప్​లో మూడు టిక్కుల ఫీచర్​.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.