ETV Bharat / crime

వీడిన మిస్టరీ: కరీంనగర్​ కోర్టు ఎదుట హత్య కేసులో మాజీ భర్తే హంతకుడు

author img

By

Published : Mar 26, 2021, 6:59 PM IST

karimnagar murder case update
కరీంనగర్​ మర్డర్​ కేసు ఛేదన

పెళ్లైన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. బంధువులు అంగీకరించకపోవడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తిని పెళ్లాడి, సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ముగ్గురు పిల్లలూ పుట్టారు. కట్​చేస్తే.. మొదట ప్రేమ పెళ్లి చేసుకున్న భర్తతో హైదరాబాద్​లో కాపురం పెట్టింది. అక్కడే మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి మురికి కాలువలో శవమై తేలింది. ఈ మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.

కరీంనగర్​లో ఈ నెల 23న జరిగిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్నవాడే మహిళను హత్య చేసినట్లు తెలిపారు. మృతురాలు దాసరి కవితగా గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుడు ఆసాది కమలాకర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ కమలాసన్​రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్పూరు గ్రామానికి చెందిన ఆసాది కమలాకర్​ తన మొదటి భార్యను వదిలేసి, దాసరి కవితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల తేడా ఉండటంతో కవిత బంధువులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. ఫలితంగా మూడు నెలలకే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.

అప్పటి నుంచి కమలాకర్ ఊరిని వదిలి, హైదరాబాద్​లో ఉంటున్నాడు. కవిత మరో వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. వీరి సంసారం సాఫీగా సాగుతుండగా.. కమలాకర్​ మళ్లీ కవితతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తన వద్దకు వస్తే బాగా చూసుకుంటానని నమ్మబలికి, హైదరాబాద్​కు రప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఉంటున్నారు.

మరో యువకుడితో వివాహేతర సంబంధం..

ఇంతలో నగరంలో మరో యువకుడితో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కమలాకర్​కు తెలిసింది. ఫలితంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కమలాకర్ కవితను లక్షెట్టిపేటలో దింపేందుకు హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరారు. కరీంనగర్​లోని కోర్టు సమీపంలో ఉన్న బస్టాండ్​లో దింపాడు.

అతనితోనే ఉంటా..

కానీ కవిత తాను తిరిగి హైదరాబాద్​ వెళ్తానని.. నగరంలోని యువకుడితోనే ఉంటానని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కమలాకర్​ కవిత మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసి చంపేశాడు. అనంతరం పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ మేరకు గుర్తుతెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. కటకటాల్లోకి పంపించారు.

ఇదీ చూడండి: గుర్తు తెలియని మహిళ హత్య.. డ్రైనేజీలో మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.