ETV Bharat / crime

ఆ నలుగురు నిందితులు మేజర్లే.. ఎమ్మెల్యే కొడుకు మాత్రం జువైనల్

author img

By

Published : Sep 30, 2022, 6:12 PM IST

Updated : Sep 30, 2022, 7:00 PM IST

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో కీలక పురోగతి
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో కీలక పురోగతి..

18:09 September 30

నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు

Jubilee Hills gang rape case updates: సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో కీలక పురోగతి లభించింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడ్ని జువైనల్​గా పరిగణించాలని న్యాయస్థానం పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం బోర్డు నలుగుర్ని మేజర్లుగా పరిగణించాలనే అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదికను వెలువరించారు.

ఈ ఘటనలో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు సాదుద్దీన్‌ మినహా మిగతా అయిదుగురిని మైనర్లుగా పేర్కొన్నారు. నేరం తీవ్రత దృష్ట్యా అయిదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేపట్టాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డును జూబ్లీహిల్స్‌ పోలీసులు కోరారు. ఈ మేరకు నెల రోజుల క్రితం నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నలుగురు మైనర్లను మేజర్లుగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు పరిగణిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈ కేసులో అయిదో మైనర్‌పై మాత్రం అభియోగాలు తీవ్రంగా లేనందున... బోర్డు అతన్ని మైనర్‌గానే పరిగణించింది. దీంతో ఈ కేసు విచారణ జువైనల్‌ జస్టీస్‌ బోర్డు పరిధి నుంచి నాంపల్లి కోర్టుకు మారనుంది. నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేపట్టనున్నారు.

అసలేం జరిగిదంటే: మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా... మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్​ పోలీసులు.. విడతలవారిగా సాదుద్దీన్​తో పాటు మరో ఐదుగురు మైనర్లను జూన్ 5న తేదీన అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. రాజకీయ రంగు పులుముకోవటంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా శ్రమించి తగిన ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం చేసినట్టు నిరూపించేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను పోలీసులు సేకరించగా.. అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు.

ఈ కేసులో కీలక ఆధారాల కోసం.. అత్యాచారం చేసిన వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్‌కిన్‌లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగమ్‌లను ఫొరెన్సిక్‌ అధికారులు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. బాలిక దుస్తులపై దొరికిన నమూనాలు, కారులో లభ్యమైన ఆధారాలతో నిందితుల డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఒక్క కీలక ఆధారంతో.. అత్యాచారం వాల్లే చేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యం దొరికినట్టైంది. ఫోరెన్సిక్​ అధికారుల ఇచ్చిన నివేదిక వివరాలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు.

ఇదొక్కటే కాకుండా.. బాధితురాలి నుంచి రెండు సార్లు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. జైలులో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అటు.. సీసీటీపీ దృశ్యాలతో పాటు మైనర్ బాలురు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చరవాణీలను కూడా పోలీసులు పరిశీలించారు. అత్యాచారం జరిగిన సమయంలో అదే లోకేషన్‌లో వీళ్లందరి చరవాణీలు ఉన్నట్లు సాంకేతికత ఆధారాల ద్వారా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. లైంగిక పటుత్వ పరీక్షల్లోనూ నిందితులందరికీ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పోలీసులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 30, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.