ETV Bharat / crime

Loan app : చైనా లోన్‌ యాప్స్‌ స్కామ్​లో నకిలీ ఎస్సై అరెస్ట్​

author img

By

Published : Jun 14, 2021, 8:26 PM IST

Fake si
నకిలీ ఎస్‌ఐ అరెస్టు

లోన్ యాప్స్ (Loan apps) కుంభకోణంలో బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించిన నకిలీ ఎస్సై పోలీసులకు దొరికాడు. నకిలీ ఎస్సై అవతారమెత్తిన ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

చైనా లోన్ యాప్స్ (Loan apps) కుంభకోణం కేసులో మరో అరెస్ట్ జరిగింది. కోల్​కతాలో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను పోలీస్ ఆఫీసర్​గా వెళ్లి మోసం చేసిన నకిలీ ఎస్సైని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్‌ యాప్స్‌ కేసులో అధికారులు బ్యాంకు ఖాతాలను నిలిపివేయగా... వాటిని తెరిపించేందుకు ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ ఎస్సై అవతారమెత్తాడు.

కొంత కాలం కిందట హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో నమోదైన ఓ కేసులో కోల్‌కతా, గుర్‌గావ్‌లలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న నిందితుల ఖాతాల లావాదేవీలను పోలీసులు స్తంభింపజేశారు. ఇటీవల ఓ వ్యక్తి కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి తనకు తాను కోల్‌కతా సైబర్‌ ఎస్సైనంటూ పరిచయం చేసుకొని, నకిలీ గుర్తింపు కార్డునిచ్చాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు స్తంభింపజేసిన ఖాతాను పునర్ధురించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు పంపించారంటూ ఓ ప్రతిని బ్యాంకు అధికారులకు అందజేశాడు. గుర్‌గావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లోనూ అదే సమయంలో ఇలాంటి నకిలీ పత్రాలనే సమర్పించారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాను మనుగడలోకి తెచ్చారు.

రూ.1.18 కోట్లు బదిలీ..

కొద్ది క్షణాల్లోనే రెండు ఖాతాల్లోని మొత్తం రూ.1.18 కోట్లు బదిలీ అయ్యాయి. ఇదంతా వెంటనే జరిగిపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు విచారణ చేస్తే.. ఉత్తర్వుల ప్రతులన్నీ నకిలీవని తేలింది. వెంటనే హైదరాబాద్‌లోని బ్యాంకు అధికారులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. ఆ మొత్తం అంటే కోటి 18 లక్షల రూపాయలు హైదరాబాద్​ బేగంపేటకు చెందిన ఆనంద్​ గన్నోజు అనే వ్యక్తి ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. అతని ఖాతాను స్తంభింపచేశారు.

అయితే అప్పటికే ఆ నగదు అంతా చైనాకు బదిలీ అయినట్లు సైబర్​ క్రైం పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నకిలీ ఎస్సై అనిల్ కుమార్​ను అరెస్టు చేశారు. ఫ్రీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో లేటర్‌ ప్యాడ్‌లు, స్టాంపులు తయారు చేసి దిల్లీ, గురుగ్రామ్‌లలోని ఆయా బ్యాంకులకు నేరగాళ్లు పంపించినట్లు గుర్తించారు. మరికొంత మంది పరారీలో ఉండగా వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్​లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.