ETV Bharat / crime

సన్నిహితుల డీపీతో సందేశం.. డబ్బు పంపాలంటూ మోసం

author img

By

Published : Jun 29, 2021, 10:36 AM IST

Cyber ​​fraud, cyber crime, cyber crime in Hyderabad with WhatsApp DP
వాట్సాప్​ డీపీతో సైబర్ మోసం, సైబర్ నేరాలు, హైదరాబాద్​లో సైబర్ నేరాలు

రోజుకో పంథాలో మోసాలకు తెరతీస్తూ సైబర్ కేటుగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా.. అమెరికాలో ఉంటున్న వారి ప్రొఫైల్ ఫొటోలతో సరికొత్తగా చీటింగ్ చేస్తున్నారు. యూఎస్​లో ఉంటున్న వారి ప్రొఫైల్ ఫోటోలు సేకరించి.. వారి సన్నిహితులకు సందేశాలు పంపుతున్నారు. తమకు సంబంధించిన వ్యక్తికి అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని.. తాము పంపడానికి సమయం పడుతున్నందున వారి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు. అది నమ్మి డబ్బు జమ చేసిన వారు.. తిరిగి ఆ నంబర్​కు ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడుతోంది.

హైదరాబాద్‌ బోయిన్‌పల్లికి చెందిన దిలీప్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి న్యూయార్క్‌లో ఉంటున్న స్నేహితుడు రమేశ్‌ ప్రొఫైల్‌ ఫొటో ఉన్న వాట్సాప్‌ నంబర్‌ నుంచి నాలుగు రోజుల క్రితం ‘హాయ్‌’ అంటూ సందేశం వచ్చింది. కొద్దిసేపటికే.. ‘మా చిన్నాన్న కొవిడ్‌తో ఆసుపత్రిలో ఉన్నాడు. రూ.2 లక్షలు అత్యవసరం. డబ్బు పంపితే మరుసటి రోజు జమ చేస్తా’ అంటూ మెసేజ్‌ వచ్చింది. అందుకు దిలీప్‌ అంగీకరించడంతో నగదు జమ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించాడు. అందులోకి దిలీప్‌ రూ.1.98 లక్షలు పంపించాడు. కొద్దిగంటల తర్వాత రమేశ్‌కు ఫోన్‌ చేయగా.. తాను ఎలాంటి మెసేజ్‌ పంపించలేదని, ఆ వాట్సాప్‌ నంబర్‌ తనది కాదని చెప్పాడు. మోసపోయానని గుర్తించిన దిలీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమెరికాలో ఉంటున్న మీ స్నేహితులు, సన్నిహితుల ప్రొఫైల్‌ ఫొటో(డీపీ) ఉన్న నంబర్‌ నుంచి వాట్సాప్‌లో అత్యవసరంగా డబ్బు కావాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయా? తాము చెప్పిన ఖాతాలో నగదు జమ చేయాలంటూ కోరుతున్నారా? అమెరికా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు పాల్పడుతున్న సరికొత్త మోసమిది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సాప్‌ నంబర్లకు ఇలాంటి అభ్యర్థనలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని, మరో ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని మోసం చేసి రూ.3.8 లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ మోసాల నేపథ్యంలో డబ్బులు కావాలంటూ వాట్సాప్‌ ద్వారా ఎవరు అభ్యర్థించినా.. నేరుగా ఫోన్‌ చేసి ధ్రువీకరించుకోవాలని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తున్నారు..

అమెరికాలో ఉంటున్న వ్యక్తుల వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను సైబర్‌ నేరస్థులు సంపాదిస్తున్నారు. వారి కాంటాక్టు జాబితాలో ఉన్న 40-50 మందికి వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. తన స్నేహితుడు లేదా బంధువు ఆసుపత్రిలో ఉన్నాడని, తనకు డబ్బు పంపాలంటే సమయం సరిపోదని.. బ్యాంక్‌ ఖాతాకు సొమ్ము బదిలీ చేసి సాయం చేయాలని కోరుతున్నారు. సందేశాలు అందుకున్నవారు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు. కేవలం చాటింగ్‌ మాత్రమే చేస్తున్నారు. తాను అత్యవసర పనుల్లో ఉన్నానని, తర్వాత మాట్లాడతానని దాటవేస్తున్నారు. అది నిజమేననుకుని నమ్మినవారు సైబర్‌ నేరస్థులు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఆ డబ్బు ఎప్పుడు తిరిగిస్తారో తెలుసుకునేందుకు ఒకటి, రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసినప్పుడు అసలు విషయం బయటపడుతోంది.

ఇలా చేస్తే సురక్షితం

వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోల ద్వారా సైబర్‌ నేరస్థులు ఎలా మోసం చేస్తున్నారన్నది పోలీసులకూ అంతుచిక్కడం లేదు. ఫొటోలను ఎలాగోలా సేకరించినా... ఆ వ్యక్తి స్నేహితులు, సన్నిహితుల వివరాలు ఎలా తెలుసుకుంటున్నారన్నదానిపై స్పష్టత లేదు. మోసాలను తప్పించుకునేందుకు వాట్సాప్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్‌లోని సెట్టింగ్‌ మెనూలో ‘అకౌంట్‌’ అన్న ఐచ్ఛికం ఉంటుంది. దాన్ని తెరవగానే.. ‘ప్రైవసీ’ అన్న మరో ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. అందులో ‘ప్రొఫైల్‌ ఫొటో’ ఉన్నచోట క్లిక్‌ చేయాలి. అందులో ప్రతి ఒక్కరికీ, కేవలం నా కాంటాక్ట్‌ నంబర్లకే, ఎవరికీ వద్దు అని మూడు ఐచ్ఛికాలు ఉంటాయి. ‘ఎవరికీ వద్దు’ను ఎంచుకుంటే మీ ఫొటో వాట్సాప్‌లో ఎవరికీ కనిపించదు. ‘కాంటాక్ట్‌ నంబర్లకే’ను ఎంచుకుంటే ఫోన్లో నంబర్లు ఉన్నవారికే కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ పరిజ్ఞానం ఉన్న సెల్‌ఫోన్లలో వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే.. ప్రొఫైల్‌ ఫొటో ‘ప్రతి ఒక్కరికీ’ అన్నది డీఫాల్ట్‌గా ఉంటుంది. సైబర్‌ నేరస్థులు దీని ఆధారంగానే మోసాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.

అన్నీ అమెరికా నంబర్లే..

వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను ఉపయోగించి మోసం చేసిన సైబర్‌ నేరస్థుల ప్రాథమిక వివరాలు సేకరించాం. ఇవన్నీ అమెరికా (+1 కోడ్‌) నంబర్లే. ఫోన్‌లో మాట్లాడితే గొంతు గుర్తుపడతారన్న ఉద్దేశంతో నేరస్థులు చాటింగ్‌ మాత్రమే చేస్తున్నారు. నగదు బదిలీ చేయాలంటూ నిందితులు పంపుతున్న బ్యాంక్‌ ఖాతాలు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోవి ఉంటున్నాయి. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నాం.

-కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.