ETV Bharat / crime

డ్రమ్ములో మృతదేహం కేసులో వీడిన చిక్కుముడి.. విచారణలో విస్తుపోయే విషయాలు

author img

By

Published : Dec 6, 2022, 6:22 PM IST

MURDER
MURDER

MURDER IN VISAKHA: ఏపీలోని విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో చిక్కు ముడి వీడింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా భావిస్తున్నారు. విశాఖ సీపీ శ్రీకాంత్​ ఈ హత్యకు సంబంధించిన విషయాలు మీడియాకు వెల్లడించారు.

MURDER IN VISAKHA : ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసులో చిక్కుముడి వీడింది. విశాఖ సీపీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కేసు విచారణ కోసం పోలీసు బృందాలు శ్రీకాకుళం జిల్లాలో విచారించాయి. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగి సుమారుగా సంవత్సరంన్నర గడిచింది. ఇంతకాలం మృతదేహం ఇంట్లోనే ఉండడంతో విశాఖ వాసులు భయాందోళనకు గురయ్యారు.

నిందితుడు మధురవాడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సంవత్సరంన్నర కాలంగా యజమానికి అద్దె బకాయి పడ్డాడు. ఎన్ని సార్లు అద్దె చెల్లించాలని యజమాని కోరినా తాత్సారం చేస్తూ వచ్చారు. విసిగిపోయిన ఇంటి యజమాని గదిని స్వాధీనం చేసుకునే క్రమంలో సామాన్లు బయటకు తరలించేటప్పుడు డ్రమ్ములో శవం ఉన్నట్లు తెలిసింది. ఆందోళనకు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆ ఇంట్లో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటకు చెందిన రుషిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తొలుత అతను అద్దెకు ఉన్న ఇంట్లో లభించిన మృతదేహం ఎవరిదన్న విషయాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచారు. నిందితుడికి సహకరించిన వ్యక్తులెవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను రాబడుతున్నారు. ప్లాస్టిక్‌ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్లిన స్థితికి చేరిన శరీర భాగాలను శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. ఆ నివేదికను విశ్లేషిస్తున్నారు.

మృతురాలు శ్రీకాకుళం జిల్లా వాసి..?

మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మిగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె చాలా కాలం క్రితం ఇల్లు వదిలి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఎవరితోను టచ్​లో లేనట్లు తెలిసింది. రుషి భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో స్థానిక బస్టాప్​లో నిందితుడికి పరిచయం అయింది. ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెతో జరిగిన వాగ్వాదంలో హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.

మృతదేహాన్ని ముక్కలు చేయలేదు..: సీపీ

దిల్లీలో శ్రద్దావాకర్​ తరహాలో మృతదేహాన్ని ముక్కలు చేసి నరికినట్లు గత రెండు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, కానీ అటువంటిదేమీ లేదని సీపీ తెలిపారు.

వేలిముద్రల సేకరణ.. హత్య జరిగిన నివాసంలో క్లూస్‌ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు అయిదు బృందాలుగా నగరంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. అతని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. రుషి తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో కొన్ని నెలలుగా ఉండడం లేదు. దీంతో ఆయన ప్రస్తుత నివాసానికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టారు. మృతదేహం లభ్యమైన ఇంటి యజమాని చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వేర్వేరు కోణాల్లో పోలీసుల ఆరా: మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో.. మహిళ ఎవరన్నది గుర్తించడానికి పోలీసులు ఇబ్బందిపడ్డారు. తలభాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. మృతదేహం అంతగా కుళ్లిపోయినా పరిసర ప్రాంతాల వారికి ఏమాత్రం వాసన రాలేదు. ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కినా.. కొద్దిరోజులకు ఎంతో కొంత వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం వాసన రాకుండా నిందితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయా అంశాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇటీవల వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కోణంలోనూ ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.