ETV Bharat / city

ERRABELLI: 'కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి'

author img

By

Published : Aug 21, 2021, 6:34 PM IST

minister ERRABELLI fires on kishan reddy
minister ERRABELLI fires on kishan reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెరాస డిమాండ్ చేసింది. కిషన్ రెడ్డిది విఫలయాత్ర అని.. ప్రజల నుంచి స్పందనే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విమర్శించారు. కిషన్​రెడ్డి కేంద్ర మంత్రిగా హుందాగా వ్యవహరించాలన్నారు. దిల్లీ నాయకుల ఎదుట తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కిషన్​రెడ్డికి తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని ప్రభుత్వ విప్ ​బాల్కసుమన్ ధ్వజమెత్తారు. హుజూరాబాద్​లో గెల్లు శ్రీనివాసయాదవ్ చేతిలో ఈటలకు ఓటమి తప్పదన్నారు.

ERRABELLI: 'కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి'

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు తిప్పికొట్టారు. బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. ఏడేళ్లలో భాజపా ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు డిమాండ్ చేశారు. కిషన్​రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక వరంగల్ జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. భాజపా అంటేనే మోసాలు చేసి.. మభ్యపెట్టి.. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే పార్టీ అని ప్రజల్లో తేలిపోయిందని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

పేదలపై భారం నిజంకాదా..?

అన్ని పథకాల నిధుల్లో కేంద్ర భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడం పద్ధతి కాదని ఎర్రబెల్లి సూచించారు. చెల్లించిన పన్నుల్లో వాటా రాష్ట్రాల హక్కని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా హుందాగా ప్రవర్తించాలని ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. ప్రజలపై భారం మోపలేదని.. కేంద్రం మాత్రం.. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్​పై ధరలు పెంచి పేదలపై భారం వేసింది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య విధానాల వల్లే కరోనాతో అనేక మంది మరణించారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

తెలంగాణకు ఏం చేస్తారో చెప్పండి..

పదవుల కోసం పెదవులు మూసుకొని.. దిల్లీ నాయకుల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కిషన్ రెడ్డికి తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందా.. అని​ నిలదీశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో దిల్లీలో రైతులపై లాఠీ ఛార్జీ చేయించిన కిషన్​రెడ్డి.. ఇక్కడకొచ్చి రైతు బిడ్డగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏం చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

'భాజపా అంటే అమ్మకం.. తెరాస అంటే నమ్మకం'

బండి సంజయ్, రేవంత్​ రెడ్డి భాష మాట్లాడి.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆయన స్థాయిని తగ్గించుకున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. భాజపా అంటే అమ్మకం.. తెరాస అంటే నమ్మకమని బాల్క సుమన్ అభివర్ణించారు. కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతుంటే.. మోదీ మాత్రం పేదల ఆస్తులు కరిగించి.. అంబానీ, అదానీ ఆస్తులు పెంచుతున్నారంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని అభివృద్ధి వరసలో నిలబెడుతారని మోదీని గెలిపిస్తే.. నోట్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్​ కోసం వరసల్లో నిలబెట్టారని ఎద్దేవా చేశారు. మోదీకి ఫొటోల తిప్పలు తప్ప.. ప్రజల తిప్పలు పట్టవని విమర్శించారు. ప్యాకేజీల పేరిట క్యాబేజీలు పెడుతున్నారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.