- ఫైనల్లో పాక్ ఓటమి.. ఆరోసారి ఆసియా కప్ విజేతగా శ్రీలంక
Asia Cup 2022 : ఓ వైపు భారత్.. మరో వైపు పాకిస్థాన్! కళ్లన్నీ ఈ జట్లపైనే. శ్రీలంకను కనీసం గట్టి పోటీదారుగా ఎవరూ పరిగణించలేదు. కానీ అనూహ్యం! ప్రతికూల పరిస్థితుల్లో, అసాధారణ పట్టుదలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లంక ఆసియాకప్ను ఎగరేసుకుపోయింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించింది. సూపర్ బ్యాటింగ్తో రాజపక్స, ఆల్రౌండ్ ప్రదర్శనతో హసరంగ, మెరుపు బౌలింగ్తో మదుషాన్ లంకను గెలిపించారు.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై రాష్ట్ర ఉభయసభల్లో నేడు చర్చ జరగనుంది. శాసనసభ, మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు, అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటు సహా ఆరు బిల్లులను ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సభాపతిని ఉద్దేశించి భాజపా సభ్యుడు ఈటల చేసిన వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు రానుంది.
- నేటి నుంచి బండి సంజయ్ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభించనున్నారు. రాంలీలా మైదానంలో.. పాదయాత్ర ప్రారంభ సభను నిర్వహించనున్నారు.
- రాష్ట్రంలో లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డ్.. ధర రూ.60.80లక్షలు
గణేశ్ లడ్డూ వేలంపాట అనగానే అందరూ ఎక్కువగా బాలాపూర్ లడ్డూ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది కాబట్టి. అయితే ఈసారి మాత్రం బాలాపూర్ లడ్డూ ధరను శనివారం అల్వాల్ లడ్డూ దాటేయగా.. ఇవాళ బండ్లగూడలో వేసిన వేలం రాష్ట్రంలోని కొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా బాలాపూర్, అల్వాల్ లడ్డూను దాటేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న జలాశయాలు..
TS PROJECTS: రాష్ట్రవ్యాప్తంగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని జలాశయాలు అన్నీ నిండుకుండలుగా మారాయి. ప్రాజెక్టులు అన్నీ నిండడంతో వరద ప్రవాహాన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆజ్ఞలు జారీ చేశారు.
- అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0కు నేడే శ్రీకారం
ఏపీ రాజధాని అమరావతికి మరణశాసనం లిఖించేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమన నీతిపై రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి సరిగ్గా వెయ్యి రోజులు. 2019 డిసెంబర్ 17న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా.. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతలను, నిర్బంధాల్ని, అవమానాల్ని, అక్రమ కేసుల్ని తట్టుకుని విరామం లేకుండా రాజధాని రైతులు ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు.
- ఒకే వేదికపైకి మోదీ, జిన్పింగ్, పుతిన్.. యావత్ ప్రపంచం దృష్టి వీరిపైనే..
SCO Summit 2022 : రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు ఒకే వేదికను పంచుకోనున్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్లో జరగనున్న ఎస్సీఓ సదస్సుకు ఈ నేతలంతా హాజరు కానున్నారు.
- 'కశ్మీర్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్ కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.
- ఉక్రెయిన్ ఎదురుదాడులు.. పారిపోతున్న రష్యా సేనలు
ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఉక్రెయిన్ సేనలు దాడులు ఉద్ధృతం చేస్తుండగా.. పుతిన్ దళాలు పారిపోతున్నాయి. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా అంగీకరించింది.
- సినిమాల్లో అవకాశం కోసం వెతుకుతున్నారా.. అయితే ఇది చదివేయండి..
సినిమా.. ఇదో తళుకుబెళుకుల మాయా ప్రపంచం. అందులో 'ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్' అంటూ సినిమా స్టూడియోల చుట్టూ ఆశగా తిరుగుతుంటారు కొందరు. చిన్నపాత్రలోనైనా వెండితెరపై కనిపించాలని కలలుకంటుంటారు ఇంకొందరు. కానీ చాలామంది విషయంలో ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. ఈ పరిస్థితితో మార్పు తేవాలనుకున్నారు కొందరు సినీ ప్రముఖులు. 24 ఫ్రేమ్స్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలున్నవారికి రకరకాల మార్గాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.