ETV Bharat / city

సకల జనుల హితంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

author img

By

Published : Mar 18, 2021, 8:36 PM IST

సంక్షేమమే ధ్యేయంగా, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌
సంక్షేమమే ధ్యేయంగా, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ... ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిస్తామంటూ 2 లక్షల 30వేల 825.96 కోట్ల రూపాయలతో పద్దును ప్రతిపాదించింది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునేలా... తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించామన్న హరీశ్‌రావు... గతంతో పోలిస్తే 26.19 శాతం వృద్ధితో బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

సంక్షేమమే ధ్యేయంగా, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌

సమాజంలోని ఆఖరి వ్యక్తిదాకా ప్రగతి ఫలాలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ప్రజలే కేంద్రంగా తెలంగాణ ప్రస్థానం కొనసాగుతుందని శాసససభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... 2 లక్షల 30వేల 825.96 కోట్ల రూపాయలతో పద్దును ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి కారణంగా యావత్‌ ప్రపంచం ఆర్థికంగా ఛిన్నాభిన్నమైందని గుర్తుచేసిన మంత్రి.., ఆ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలను... లక్షా 82వేల 702 కోట్ల నుంచి లక్షా 66వేల 742 కోట్లకు సవరించినట్లు వెల్లడించారు.అయితే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందన్న మంత్రి....వచ్చే ఆర్థిక సంవత్సరం జీఎస్​డీపీలో వృద్ధి ఉంటుందనే అంచనాతో పద్దును రూపొందించినట్లు తెలిపారు.

రెవెన్యూ రాబడి@లక్షా 76వేల 126.94కోట్లు

2021-22 మొత్తం ఆదాయంలో రెవెన్యూ రాబడి లక్షా 76వేల 126.94 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన సర్కారు... మూలధన రాబడి 53వేల 850 కోట్ల రూపాయలుగా పేర్కొంది. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 92వేల 910 కోట్లు, పన్నేతర ఆదాయం 30వేల 557.35కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 13వేల 990.13 కోట్లు , కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా 38వేల 669.46 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రజా రుణాల ద్వారా 49వేల 300కోట్లు, రుణ వసూళ్ల ద్వారా 50కోట్లు వస్తాయని పేర్కొంది. ఈ ఆదాయంలో రెవెన్యూ వ్యయం లక్షా 69వేల 383.44 కోట్లు ఉంటుందన్న సర్కారు... మూలధన వ్యయం 29వేల 46.77కోట్లని ప్రకటించింది. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు 23వేల 256.33 కోట్లు, మూలధన పంపిణీకి 9వేల 139.42కోట్ల రూపాయలుగా ప్రతిపాదించింది.

జీఎస్​డీపీలో వృద్ధే లక్ష్యంగా..

ఖర్చులు పోనూ బడ్జెట్‌ అంచనాల్లో 6వేల 743.50కోట్లు మిగులు తేలుతుందని అంచనా వేసిన సర్కారు... ఆర్థిక లోటు 45వేల 509.60కోట్లని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సర ముగిసే నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 2 లక్షల 86వేల 804.64 కోట్లని తెలిపిన ప్రభుత్వం...ఇది జీఎస్​డీపీలో 24.84శాతమని తెలిపింది. తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 99,399 రూపాయలు అధికంగా ఉందన్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో మంచి వృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రకటించారు.

కరోనా ప్రభావం చూపినా..

కరోనా సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపినా... నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునేలా పద్దును ప్రతిపాదించామన్న హరీశ్‌రావు... వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు. షెడ్యూలు కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కొత్తగా సీఎం దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన సర్కారు... ఇందు కోసం వెయ్యి కోట్లు ప్రతిపాదించారు.

పక్కా ఆర్థిక ప్రణాళికలతో..

కొత్త సచివాలయం నిర్మాణానికి 610కోట్లు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణకు 750కోట్ల రూపాయల్ని బడ్జెట్​లో ప్రతిపాదించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్‌ విధానంలో సమగ్ర భూ సర్వేను జరపాలని నిర్ణయించిన సర్కారు.. ఇందుకోసం 400కోట్ల రూపాయల్ని కేటాయించింది. పక్కా ఆర్థిక ప్రణాళికలతో ఏడేళ్ల వయస్సున్న తెలంగాణ... ఏడు దశాబ్దాల వయస్సున్న రాష్ట్రాలతో పోటీపడుతోందన్న హరీశ్‌రావు...నిర్దేశిత లక్ష్యాలతో తలపెట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ బడ్జెట్​ రూ.2,30,825 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.