ETV Bharat / city

LOAN APP: రూ.1.18 కోట్ల బదిలీలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందా...?

author img

By

Published : Jun 7, 2021, 7:15 PM IST

loan apps case
deep investigation on loan app case

రుణయాప్​ల కేసులో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల అన్​ఫ్రీజ్​, ఆయా అకౌంట్ల నుంచి నగదు బదిలీ వ్యవహారంపై సైబర్​క్రైం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కోటి 18 లక్షల రూపాయల నగదు చైనాకు బదిలీ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్​ఫ్రీజ్​ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్ర ఏమైనా ఉందా.. అనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు.. ఈ వ్యవహారాన్ని ఐసీఐసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రుణయాప్​ల కేసుల్లో నిర్వాహకుల ఖాతాల్లోంచి అక్రమంగా నగదు బదిలీ అయిన వ్యవహారంపై సైబర్​క్రైం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆనంద్ అనే వ్యక్తిని హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు.

మే 13న కోల్​కతాలోని న్యూ అలీపూర్ ఐసీఐసీఐ శాఖకు వెళ్లిన ఓ వ్యక్తి.. సైబర్ క్రైం ఎస్సైనంటూ బ్యాంకు అధికారులను నమ్మించాడు. 12 ఖాతాల నంబర్లు ఇచ్చి వాటిని అన్​ ప్రీజ్​ చేయాలని కోరాడు. అందులో ఆరు ఖాతాలను అధికారులు అన్​ఫ్రీజ్​ చేశారు. వాటిలో రెండు అలీపూర్ శాఖకు చెందినవి కాగా... మిగిలిన నాలుగు దిల్లీ, హరియాణాలోని ఐసీఐసీఐ ఖాతాలు. అన్​ఫ్రీజ్​ అయిన వెంటనే అలీపూర్ శాఖ నుంచి రూ.90 లక్షలు... మిగతా బ్యాంకుల నుంచి 28 లక్షలు.. ఇతర ఖాతాకు బదిలీ అయ్యాయి.

చైనాకు బదిలీ?

అప్రమత్తమైన పోలీసులు.. ఆ మొత్తం అంటే కోటి 18 లక్షల రూపాయలు హైదరాబాద్​ బేగంపేటకు చెందిన ఆనంద్​ గన్నోజు అనే వ్యక్తి ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. అతని ఖాతాను స్తంభింపచేశారు. అయితే అప్పటికే ఆ నగదు అంతా చైనాకు బదిలీ అయినట్లు సైబర్​ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు.

అధికారుల హస్తం ఉందా?

కోల్​కతాలోని అలీపూర్​ ఐసీఐసీఐ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను అన్​ఫ్రీజ్​ చేసినట్లు సైబర్​ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల హస్తం ఏమైనా ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

అమాయకుల నుంచి అధిక వడ్డీ వసూలు చేయడం సహా మానసికంగా కుంగదీసిన ఘటనలో రుణయాప్​ల నిర్వాహకులపై సైబర్​ క్రైం పోలీసులు కేసు నమోదుచేశారు. సుమారు 1100 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. వాటిలో ఉన్న రూ.200 కోట్ల నగదును నిలుపుదల చేశారు. ఈ కేసులో 28 మంది అరెస్టవ్వగా.. 25 మంది బెయిల్​పై బయటకు వచ్చారు.

ఇదీచూడండి: LOAN APPS: సైబర్‌ పోలీసునంటూ రూ.1.18 కోట్లు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.