ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పకడ్బందీగా కొనసాగుతున్న కర్ఫ్యూ

author img

By

Published : May 23, 2021, 7:40 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా పరిస్థితులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. పోలీసులు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా రోగుల కోసం దాతలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు కోసం రాష్ట్రానికి మరో 4 లక్షల 44 వేల కొవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్‌ ఫంగస్‌ కేసులూ అధికంగానే నమోదవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కట్టడికి అధికారులు వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని తితిదే ఈవో, కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం ఛైర్మన్‌ జవహర్‌రెడ్డి అధికారులను సూచించారు. తితిదే ఉద్యోగులకు త్వరగా టీకాలు వేయాలని ఆదేశించారు. చిందేపల్లి వద్ద శ్రీకాళహస్తి పైప్స్‌ సమీపంలో వెయ్యి పడకల తాత్కాలిక కొవిడ్‌ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడేపల్లిలో కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకులను పోలీసులు అంబులెన్సులో క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. నరసరావుపేటలో అక్రమంగా కరోనా టీకాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కృష్ణా జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న రోగులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఫోన్లో పరామర్శించి, అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచకారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 150 పడకలతో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ ఆసుపత్రిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్‌ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో శనివారం ఒక్కరోజే ఏడుగురు, స్విమ్స్‌లో ఐదుగురు బ్లాక్‌ ఫంగస్‌ బాధితులను వైద్యులు గుర్తించారు. రుయాలో ప్రస్తుతానికి 15 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.

దాతల పెద్దమనసు..

కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు విరాళాలు అందజేస్తున్నారు. అనంతపురంలో సీపీఎం నేతలు మరో 20 పడకల ఐసోలేష‌న్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కరోనా రోగుల కోసం 50 లక్షల విలువైన 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఎంటర్‌ పెన్యూర్‌ ఆర్గనైజేషన్ సంస్థ కలెక్టర్‌ గంధం చంద్రుడికి అందజేసింది.

కడప జిల్లాలో ఆర్తీ హోం సంస్థ 81 లక్షల విలువైన 107 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 300 పల్స్‌ ఆక్సీమీటర్లను కలెక్టర్‌ హరికిరణ్‌కు అందజేసింది.తూర్పుగోదావరి జిల్లా మోరిపోడులో సుబ్బమ్మ ఆసుపత్రిని కొవిడ్ కేర్‌ సెంటర్‌గా మార్చారు. ఆసుపత్రిని మంత్రి వేణుగోపాల కృష్ణ ప్రారంభించగా..120 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 20 ఈసీజీ యంత్రాలు, ఇతర వైద్య పరికరాలనుసాల్మన్‌ డార్విన్‌ అనే వ్యక్తి అందజేశాడు. కాకినాడ గ్రామీణ మండలం కొవ్వాడకు చెందిన సురేశ్‌ అనే వ్యక్తి.. హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న పేద కరోనా రోగులకు ఆహారం అందిస్తున్నారు. రోజుకు 250 మందికి ఇంటింటికీ వెళ్లి భోజనాలు సప్లై చేస్తున్నారు.

మరిన్ని టీకాలు..

ఆంధ్రప్రదేశ్​కు మరో 4 లక్షల 44 వేల కొవిడ్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కొవిషీల్డ్ టీకాలను గన్నవరంలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి 50 వెంటిలేటర్లు, మరో 50 ప్రాణవాయువు సాంద్రత పరికరాలు వచ్చాయి.

ఇవీ చదవండి: అంబులెన్స్​ సైరన్​ వినిపిస్తే... అమ్మానాన్నలేమోననే ఆశగా చూస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.