ETV Bharat / city

TS Corona Vaccination: 2 కోట్లు మార్క్​ దాటిన వ్యాక్సినేషన్​... 2 వారాల్లో మరో కోటి మందికి!

author img

By

Published : Sep 16, 2021, 7:33 AM IST

Corona Vaccination
తెలంగాణలో 2 కోట్లు దాటిన టీకా పంపిణీ... 2 వారాల్లో మరో కోటి మందికి!

జీహెచ్‌ఎంసీ (ghmc) పరిధిలో దాదాపు 100 శాతం తొలి డోసు టీకా (first dose vaccine) పంపిణీ పూర్తి కావడంతో.. ఇక గ్రామీణ ప్రాంతాలు, పురపాలికలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే సాధకబాధకాలను దృష్టిలో పెట్టుకొని.. పల్లె ప్రజల ముంగిటికి టీకాలను తీసుకెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో వైద్య బృందాలు రోజుకొక పల్లెలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ.. అర్హులను గుర్తించి వారికి టీకాలు ఇస్తారు. 2 వారాల్లో ఈ కార్యక్రమం పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారు 2.80 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1.45 కోట్ల మంది ఒక్క డోసును, 55 లక్షల మంది రెండు డోసులనూ స్వీకరించారు. అంటే ఇప్పటివరకూ కనీసం ఒక్క డోసు కూడా పొందనివారు 80 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి వచ్చే 15 రోజుల్లో టీకా అందజేయాలని, మొత్తంగా సెప్టెంబరు నెలాఖరులోగా మరో కోటి డోసులను పంపిణీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం రోజుకు 2- 2.4 లక్షల వరకూ టీకా డోసులను పంపిణీ చేస్తుండగా.. ఆ సంఖ్యను 3-5 లక్షలకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యశాఖను ఆదేశించింది. టీకాలపై గ్రామీణుల్లో అపోహలుంటే.. వాటిని తొలగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది. ఇంట్లో అర్హులైన లబ్ధిదారులంతా టీకాలను పొందిన తర్వాత ఆ ఇంటిపై ‘ఫుల్లీ వ్యాక్సినేటెడ్‌ హోం’ అని ముద్ర వేయాలంది. పురపాలికల్లోనూ ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, దుకాణాలున్న ప్రాంతాలకు సంచార వాహనాన్ని తీసుకెళ్లి, అక్కడ టీకా వేస్తారు. రాష్ట్రంలో బుధవారానికి 2 కోట్ల డోసులు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 16న టీకాల పంపిణీ ప్రారంభం కాగా.. జూన్‌ 25 నాటికి కోటి డోసులు ఇచ్చారు. కోటి డోసులకు 165 రోజులు పట్టగా.. ఆ తర్వాత 78 రోజుల వ్యవధిలోనే మరో కోటి డోసులు పంపిణీ చేశారు.

.

త్వరలో 12-18 ఏళ్ల పైబడిన వారికి

రాష్ట్రంలో 12-18 ఏళ్ల పైబడిన వారికి కూడా త్వరలోనే టీకా అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ కేటగిరీకి చెందిన వారు సుమారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. బీఆర్‌కే భవన్‌లో బుధవారం టీకాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ఎక్సైజ్‌ శాఖ సంచాలకులు సర్ఫరాజ్‌ అహ్మద్‌, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌ పాల్గొన్నారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, పంచాయతీ, పురపాలక శాఖ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. రెండు కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సందర్భంగా సీఎస్‌ కేకు కోసి, వైద్య శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 52 శాతం మంది అర్హులైన లబ్ధిదారులకు మొదటి డోసు పంపిణీ పూర్తయిందని, జీహెచ్‌ఎంసీలో దాదాపు అందరికీ ఒక డోసు ఇచ్చామని తెలిపారు.

కుర్రకారు.. టీకా జోరు

18 - 44 ఏళ్ల వారే కోటి మంది

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి టీకాల పంపిణీ 2 కోట్ల డోసుల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసున్న యువతరమే కోటి మంది ఉన్నారు.

జిల్లాలవారీగా ..

హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 42.26 లక్షల మంది.. ఆసిఫాబాద్‌ కుమురంభీం జిల్లాలో అతి తక్కువగా 1.07 లక్షల మంది టీకా తీసుకున్నారు. రంగారెడ్డి (27.36 లక్షలు), మేడ్చల్‌ (26.59 లక్షలు) హనుమకొండ (6.91లక్షలు), ఖమ్మం (6.86లక్షలు), కరీంనగర్‌ (6.70లక్షలు), నిజామాబాద్‌ (6.05లక్షలు) జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

...

ఇదీ చూడండి: Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.