ETV Bharat / city

KCR Meet Tikait: 'ఫ్రంట్​ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '

author img

By

Published : Mar 3, 2022, 3:24 PM IST

Updated : Mar 3, 2022, 5:46 PM IST

CM KCR meets Subramanyaswamy and Rakesh Tikait at delhi
CM KCR meets Subramanyaswamy and Rakesh Tikait at delhi

KCR Meet Tikait: సీఎం కేసీఆర్​ దిల్లీ పర్యటనపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారని ప్రచారం సాగినా.. రెండు రోజులు అలాంటి కదలికలేవి కన్పించలేదు. ఈ పర్యటన సీఎం వ్యక్తిగతమని ఆ పార్టీ నేతలు చెప్పగా.. మూడోరోజైన నేడు సుబ్రహ్మణ్యస్వామి, రాకేష్​ టీకాయత్​తో భేటీ కావటం ఆసక్తిగా మారింది.

KCR Meet Tikait: రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ టికాయత్ తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ టికాయత్​తో భేటీ అయ్యారు. దిల్లీలోని తన నివాసానికి ఇద్దరు నేతలను సీఎం కేసీఆర్​.. లంచ్​కు ఆహ్వానించారు. వారి​తో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్.. టికాయత్​తో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

CM KCR meets Subramanyaswamy and Rakesh Tikait at delhi
సుబ్రహ్మణ్య స్వామికి స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్​

ఫ్రంట్​ గురించి చర్చించలేదు..

Rakesh tikait Comments: తెలంగాణలో సాగు అనుకూల విధానాలు అమలవుతున్నాయని టికాయత్​ తెలిపారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలు చేస్తూ.. కేసీఆర్​ ప్రభుత్వం రైతులకు భరోసాగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ప్రత్యామ్యాయ విధానాలు తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగానే సీఎం కేసీఆర్​ను కలిశానన్నారు. తమది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని పేర్కొన్న టికాయత్​.. ఫ్రంట్​ గురించి చర్చించలేదన్నారు.

ఫ్రంట్​ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే..

"ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రైతుల కోసం నూతన విధానం రావాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే కేసీఆర్‌ను కలిశా. రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా సీఎంలందరినీ కలుస్తా. ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలు త్వరలో కేసీఆర్‌కు ఇస్తాం. అమరులైన రైతుల కుటుంబాలకు కేసీఆర్‌ పరిహారం అందిస్తారు. వ్యవసాయ రంగం, రైతాంగం కోసం హైదరాబాద్ గాని మరో చోట కానీ ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం. కేసీఆర్ ఫ్రంట్ గురించి ఆయనతో చర్చించలేదు.. మేము రైతు ఉద్యమ నేతలం. మాది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ." - రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి

వ్యక్తిగత పర్యటన అని.. ఇప్పుడు..

ఫిబ్రవరి 28న దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​.. మంగళవారం(మార్చి 1న) దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. చికిత్సలో భాగంగా బుధవారం మరోసారి వైద్యురాలిని కలిశారు. సీఎం సతీమణి శోభ బుధవారం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలోనూ ఆమె అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్​.. పలువురు విపక్ష నేతలను కలవనున్నారని ప్రచారం సాగినా.. మొదటి రెండు రోజులు అలాంటి కదలికలేమీ కనిపించలేదు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, రాజకీయపరమైనది కాదని తెరాసకు చెందిన ఓ సీనియర్‌ నేత తెలిపారు. కాగా.. పర్యటనలో మూడోరోజైన నేడు.. సుబ్రహ్మణ్యస్వామి, రాకేష్​ తికాయత్​ను లంచ్​కు ఆహ్వానించి.. భేటీ కావటం గమనార్హం.​

CM KCR meets Subramanyaswamy and Rakesh Tikait at delhi
రాకేష్​ తికాయత్​తో కేసీఆర్​ భేటీ

దిల్లీ యాత్రపై సర్వత్రా ఆసక్తి..

జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్​.. దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. సినీనటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్‌ను కలిసి భాజపాకు వ్యతిరేకంగా ఆయన మద్దతు కూడా కూడగట్టారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పడంతో.. ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ పర్యటనను ముందు చెప్పినట్టుగానే మూడు రోజులకే పరిమితం చేస్తారా..? లేక మరికొందరు నేతలతో భేటీ అవుతారా..? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

Last Updated :Mar 3, 2022, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.