ETV Bharat / business

ఢమాల్​ స్ట్రీట్​: సెన్సెక్స్​ 3,935 పాయింట్లు పతనం

author img

By

Published : Mar 23, 2020, 3:43 PM IST

stock
స్టాక్ మార్కెట్లు

కరోనా సంక్షోభంతో మార్కెట్లలో మళ్లీ అదే ఫలితం పునరావృతమయింది. సెన్సెక్స్​, నిఫ్టీ పతనాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్​ 3,935, నిఫ్టీ 1,135 పాయింట్లు పడిపోయాయి.

కరోనా భూతం... మరోమారు దలాల్​ స్ట్రీట్​ను వణికించింది. ఆర్థిక మాంద్యం తప్పదన్న ఆందోళన మదుపర్లను వెంటాడింది. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు మరోమారు రికార్డు స్థాయి నష్టాలు చవిచూశాయి. తొలుత 10 శాతం నష్టపోయిన కారణంగా 45 నిమిషాల పాటు ట్రేడింగ్​ను నిలిపేశాయి ఎక్స్ఛేంజీలు. పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితులు ఏమీ మారలేదు. అంతకంతకూ నష్టాలు పెరిగి 13 శాతం మేర మార్కెట్లు పతనమయ్యాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్​ 3,935 పాయింట్లు క్షీణించి 25,981 పాయింట్లకు చేరుకుంది. 1,135 పాయింట్లు దిగజారిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 7,610 పాయింట్ల వద్ద స్థిరపడింది.

అన్నీ నష్టాల్లోనే..

యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​ 20 శాతానికిపైగా నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, ఎల్​ అండ్​ టీ, టెక్​ మహీంద్ర షేర్లు 15 శాతానికిపైగా పడిపోయాయి.

భారత్​లో లాక్​డౌన్​..

దేశంలో ఏపీ, తెలంగాణ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌, చండీగఢ్‌ మార్చి 31వరకు పూర్తిగా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. వైరస్​ ప్రభావిత 80 జిల్లాలలో కేంద్రం లాక్​డౌన్​ విధించింది. మారుతీ సుజుకీ, మహీంద్రా, హీరోమోటోకార్ప్​ ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేశాయి. ఎల్‌జీ కూడా భారత్‌లోని రెండు ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్​లో కరోనా వైరస్​ నిర్ధరిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి కరోనా కేసులు 415కు చేరుకున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా ధాటికి దేశంలో ఏడుగురు మృతి చెందారు.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..

జపాన్‌ మార్కెట్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై పడింది. న్యూజిలాండ్​ 9 శాతానికి పైగా నష్టపోగా.. ఆస్ట్రేలియా సూచీలు 6 శాతం పతనమయ్యాయి.

అమెరికా బెయిల్​ అవుట్​ ప్యాకేజీపై సందిగ్ధత..

అమెరికాకు 1.7 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొనటం ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టింది. అక్కడ వైద్యసేవలకు నిధులు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలనే డిమాండ్లు నెలకొన్నాయి. కీలకమైన ఓట్లను ఇది ఇంకా సాధించలేదనే ప్రచారంతో అక్కడ ఆందోళన నెలకొంది.

సెబీ నిబంధనల ప్రభావం..

సెబీ ఆదేశాల వల్ల ఎఫ్‌ఐఐలు, డీఐఐలకు ప్రస్తుతం షార్ట్‌సెల్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతోందే కానీ.. మార్కెట్‌ ట్రెండ్‌ను మార్చలేకపోయింది. ఇప్పటి వరకు సెబీ ఆశించినట్లుగా హెచ్చుతగ్గులైతే పరిమితంగానే ఉన్నాయి. విక్రయించే ట్రెండింగ్‌లో మార్పులేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.