ETV Bharat / business

'కరోనా ప్రభావం ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది'

author img

By

Published : Jul 2, 2021, 5:36 AM IST

Updated : Jul 2, 2021, 5:43 AM IST

RBI Governor Shaktikant Das
శక్తికాంతదాస్‌

కొవిడ్​ రెండో దశ అధిక ప్రభావం ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ మే ఆఖరు నుంచి కోలుకుంటోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. రోజువారీ కొత్త కేసులు బాగా తక్కువగా నమోదవుతుండటం వల్ల మే ఆఖరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పునరుత్తేజితం అవుతున్నాయని వివరించారు.

కొవిడ్‌ రెండోదశ ప్రభావం ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై అధికంగా ఉన్నా, ఆర్థిక వ్యవస్థ మే ఆఖరు నుంచి కోలుకుంటోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ఆర్థిక సంస్థల నుంచి డేటా లీకేజీలు, సైబర్‌దాడులతో పాటు అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు పెరగడం ఆందోళనకర పరిణామంగా పేర్కొన్నారు. రోజువారీ కొత్త కేసులు బాగా తక్కువగా నమోదవుతుండటంతో, మే ఆఖరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పునరుత్తేజితం అవుతున్నాయని వివరించారు. బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2021 మార్చి ఆఖరుకు 7.5 శాతంగా ఉన్నాయి.

రుణ ఆస్తుల ప్రస్తుత నాణ్యత ప్రకారం చూస్తే, 2022 మార్చి ఆఖరుకు జీఎన్‌పీఏలు 9.8 శాతానికి చేరతాయనే అంచనాను గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) లో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యక్తం చేశారు. ఒకవేళ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారితే జీఎన్‌పీఏలు 11.22 శాతానికి చేరొచ్చని పేర్కొన్నారు. వచ్చే సెప్టెంబరుకు జీఎన్‌పీఏలు 13.5 శాతానికి చేరొచ్చని జనవరి ఎఫ్‌ఎస్‌ఆర్‌లో అంచనా వేయడం గమనార్హం. ఆర్థిక సంస్థల బ్యాలెన్స్‌ షీట్లపై కొవిడ్‌ ప్రభావం అనుకున్నదానికంటే తక్కువగా ఉందని చెబుతూనే.. నియంత్రణ పరమైన ఉపశమనాల ప్రభావం ఎలా ఉందో పూర్తిగా పరిశీలించాకే ఈ విషయమై స్పష్టత వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకునేలా బ్యాంకుల వద్ద మూలధనం ఉందని వెల్లడించారు. రిటైల్‌తో పాటు చిన్న వ్యాపార సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు ఇచ్చిన రుణాలను గమనిస్తుండాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. కొవిడ్‌ వల్ల ఈ విభాగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది.

భారీ మొండిబకాయిలే 77.9 శాతం

ఈనాడు, దిల్లీ: షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులకు పేరుకుపోయిన మొత్తం మొండిబకాయిల్లో భారీ రుణ ఖాతాలవే 77.9% ఉన్నట్లు ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్‌లో వెల్లడైంది. ఈ వర్గానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల వాటా 52.7%తో పోలిస్తే, మొండిబకాయిల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. పారిశ్రామిక రుణాల్లో 11.3%, వ్యవసాయ రుణాల్లో 9.8%, సేవారంగం రుణాల్లో 7.5%, వ్యక్తిగత రుణాల్లో 2.1% మొండిబకాయిలుగా మారాయి. పెద్ద రుణగ్రహీతలకు ఇచ్చిన అప్పుల్లో టాప్‌-100లో ఉన్న వారికి 34.3% దక్కాయి. మొత్తం బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో ఈ వందమందికి 18.1% రుణాలు అందాయి. మొండిబకాయిల విషయంలో ఈ 100 మంది వాటా పెద్ద రుణగ్రహీతల్లో 11%, మొత్తం బకాయిల్లో 8.6% మేర ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడైంది.

22,205 మరణాలకు బీమా క్లెయిములొచ్చాయ్‌

2020-21లో భారత బీమా కంపెనీలకు రూ.1644 కోట్ల విలువైన 22,205 కొవిడ్‌ మరణ క్లెయిములు వచ్చాయని ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది. ఇందులో 21,854 క్లెయిములను రూ.1492.02 కోట్లతో కంపెనీలు సెటిల్‌ చేసినట్లు తెలిపింది. క్లెయిముల చెల్లింపుల నిష్పత్తి వ్యక్తిగత విభాగంలో 98.1 శాతంగా; గ్రూప్‌ విభాగంలో 98.6 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది మరణ క్లెయిమ్‌ల పరిష్కారం 96.8%, 97.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కరోనా కారణంగా బీమా రంగ ఆర్థిక పరిస్థితులపై గణనీయ ప్రభావం పడలేదని ఆ నివేదిక తెలిపింది.

RBI
విభాగాల వారీ ఎన్​పీఏలు

ఇదీ చూడండి: భారత్​కు కోట్ల రూపాయలు పంపిన నీరవ్ సోదరి

Last Updated :Jul 2, 2021, 5:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.