ETV Bharat / business

'ఆ సంస్థలో రూ.880 కోట్ల బ్లాక్ మనీ!'

author img

By

Published : Jul 14, 2021, 6:03 PM IST

SURVEY-BLACKMONEY
ఆ సంస్థలో రూ.880 కోట్ల బ్లాక్ మనీ!

తప్పుడు క్లెయిమ్​లతో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ పన్ను మినహాయింపులు కోరిందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సంస్థకు చెందిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు... రూ.880 కోట్ల లెక్కలోకి రాని ధనాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఐటీ శాఖ వాదనను ఆ సంస్థ ఖండించింది.

బెంగళూరుకు చెందిన క్యూస్ కార్ప్ లిమిటెడ్ అనే సంస్థపై దాడి చేసిన ఆదాయ పన్ను శాఖ లెక్కలోకి రాని రూ.880 కోట్లు ధనాన్ని గుర్తించింది. జులై 8న సంస్థకు చెందిన రెండు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. మానవ వనరులకు సంబంధించిన సేవలు అందించే ఆ సంస్థ... ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. భారీ మినహాయింపులను క్లెయిమ్ చేసిందని తెలిపింది.

"ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించే సెక్షన్ 80జేజేఏఏ ప్రకారం పన్నుచెల్లింపుదారుడు(సంస్థ) మినహాయింపులు క్లెయిమ్ చేశారు. నిబంధనల ప్రకారం నెలకు రూ.25 వేల లోపు ఆదాయం లభించే ఉద్యోగాలకు మాత్రమే వర్తించే ఈ మినహాయింపులను సంస్థ తప్పుగా క్లెయిమ్ చేసింది. కొందరు ఉద్యోగులు పేరోల్​లో లేకున్నా.. ఈ సెక్షన్​ను ఉపయోగించుకుంది. మా సర్వే ప్రకారం.. వివిధ సంవత్సరాలలో కలిపి రూ.880 కోట్ల ఆదాయాన్ని సంస్థ దాచినట్లు తేలింది."

-కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు

మరోవైపు, సీబీడీటీ వాదనను క్యూస్ కార్ప్ ఖండించింది. ఐటీ శాఖకు పూర్తిగా సహకరించినట్లు తెలిపింది. బాధ్యతాయుతమైన సంస్థగా.. అన్ని రకాల ఆడిటింగ్, అకౌంటింగ్​ ప్రక్రియలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 100 శాతం నిజాయతీ కలిగిన పన్నుచెల్లింపుదారుగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. చట్టబద్ధంగానే ఐటీ చట్టం కింద మినహాయింపులు కోరినట్లు వివరించింది. ఆదాయాన్ని దాస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు డీఏ పెంపు- జులై నుంచే అమలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.