ETV Bharat / business

రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా 500 మంది.. ఎలాగంటే?

author img

By

Published : Sep 24, 2021, 5:48 AM IST

freshworks
ఫ్రెష్‌వర్క్స్‌

బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌లో పని చేస్తున్న 500 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఫ్రెష్‌వర్క్స్‌ను అమెరికా మార్కెట్‌ నాస్‌డాక్‌లో నమోదు చేసిన తొలిరోజే ఈ కంపెనీ షేరు అదరగొట్టింది. దీంతో ఇందులో తొలి దశలో పెట్టుబడులు పెట్టిన యాక్సెల్‌, సిఖోయా వంటి వెంచర్‌ పెట్టుబడిదార్లతో (వీసీలు) పాటు వందల సంఖ్యలో ఉద్యోగులు కూడా కోటీశ్వరులుగా అవతరించారు.

సాంకేతిక (టెక్‌) ప్రతిభ ఉన్నవాళ్లను నియమించుకునేందుకు కొన్ని నెలల క్రితం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో ఒక ఫిన్‌టెక్‌ సంస్థ ఏకంగా బీఎండబ్ల్యూ బైక్‌లను ఆఫర్‌ చేసింది. ఇదే సమయంలో బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ గిరీశ్‌ మాతృబూతాన్ని ఒక విలేకరి 'మీరు కూడా ఇంజినీర్ల నియామకం కోసం బైక్‌లను ఆఫర్‌ చేస్తారా?' అని అడిగితే 'మా ఇంజినీర్లకు సొంతంగా ఆ బైక్‌లను కొనుగోలు చేసే శక్తిని మేము అందిస్తామ'ని తెలిపారు. ఇప్పుడు అదే నిజమైంది!

ఆ కంపెనీలో పని చేస్తున్న 500 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఒక సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) అంకుర సంస్థ ఇంత ఘనత సాధించడం ఇదే తొలిసారి. ఫ్రెష్‌వర్క్స్‌ను అమెరికా మార్కెట్‌ నాస్‌డాక్‌లో నమోదు చేసింది. తొలిరోజే ఈ కంపెనీ షేరు అదరగొట్టింది. దీంతో ఇందులో తొలి దశలో పెట్టుబడులు పెట్టిన యాక్సెల్‌, సిఖోయా వంటి వెంచర్‌ పెట్టుబడిదార్లతో (వీసీలు) పాటు వందల సంఖ్యలో ఉద్యోగులు కూడా కోటీశ్వరులుగా అవతరించారు.

'ఉద్యోగులే వాటాదార్లు'

'మా ఉద్యోగులే మా సంస్థలో అధిక భాగం వాటాదార్లు. ఈ ఐపీఓ సీఈఓగా నా బాధ్యతను నెరవేర్చడానికి మంచి అవకాశం కల్పించింది. కంపెనీ తొలినాళ్ల నుంచి మాపై ఎంతో నమ్మకం ఉంచిన ప్రారంభ పెట్టుబడిదార్లతో పాటు ఉద్యోగులు కూడా లబ్ధి పొందారు. ఇక ఇప్పుడు కొత్తగా ఐపీఓ ద్వారా పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు భవిష్యత్‌లో లాభాలు అందించేందుకు నా ప్రయత్నం కొనసాగిస్తాన'ని గిరీశ్‌ వెల్లడించారు.

ఉద్యోగం చేరిన కొన్నేళ్లకే..

76 శాతం మంది ఉద్యోగులు కంపెనీలో షేర్లు కలిగి ఉన్నారు. మామూలుగా అయితే 90 శాతానికి పైగానే ఉండేవారు. ఇటీవల ఎక్కువ మంది ఉద్యోగుల్ని కంపెనీ చేర్చుకోవడంతో వాటాలు కలిగిన ఉద్యోగుల శాతం తగ్గింది. భారత్‌లోని సంస్థ ఉద్యోగుల్లో 500 మందికి పైగా కోటీశ్వరులయ్యారు. ఇందులో 30 ఏళ్లలోపు వారు 70 మంది వరకూ ఉన్నారు. కొన్నేళ్ల కిందటే కళాశాల నుంచి ఉత్తీర్ణులై (పాస్డ్‌ఔట్‌) బయటకు వచ్చిన వారే ఇందులో ఉన్నారు.

నాలుగు రెట్లయిన కంపెనీ విలువ..

యూఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన తొలి భారతీయ సాస్‌ అంకుర సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌ కావడం విశేషం. 2019 నవంబరులో సిఖోయా క్యాపిటల్‌, క్యాపిటల్‌జి, యాక్సెల్‌ వంటి పెట్టుబడిదార్ల నుంచి 15 కోట్ల డాలర్లను సమీకరించినపుడు కంపెనీ విలువను 350 కోట్ల డాలర్లుగా లెక్కించారు. నాస్‌డాక్‌లో నమోదైన రోజు (బుధవారం) ఈ సంస్థ విలువ 1,230 కోట్ల డాలర్లకు చేరింది. తొలిరోజే కంపెనీ షేరు విలువ 21 శాతం పెరిగింది. 2010లో మాతృబూతం, షాన్‌ కృష్ణస్వామి కలిసి ఫ్రెష్‌డెస్క్‌ను స్థాపించారు. 2017లో దీన్ని ‘ఫ్రెష్‌వర్క్స్‌’గా రీబ్రాండ్‌ చేశారు. ఆగస్టు 31 నాటికి ఈ సంస్థకు 52,500 మందికి పైగా ఖాతాదార్లున్నారు.

ఇదీ చూడండి: Trai data: ఎయిర్‌టెల్‌కు పెరిగిన చందాదారులు.. వీఐకి మళ్లీ నిరాశే!

ఇదీ చూడండి: విద్యాసంస్థలకు గుడ్​ న్యూస్​- పేటెంట్ ఫీజుపై 80% రాయితీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.