ETV Bharat / business

'ఆరోగ్య సంరక్షణ.. కుటుంబానికి అండ'

author img

By

Published : Jul 4, 2021, 7:36 AM IST

kamalesh rao
కమలేశ్‌ రావు

కరోనా(Corona) కాలంలో ఆన్​లైన్​ వేదికగా బీమా పాలసీలు(Insurance policies) తీసుకోవడం గణనీయంగా పెరుగుతోందని ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ ఎండీ కమలేశ్​​ తెలిపారు. మహమ్మారి సమయాల్లో ఎవరి ఉనికి ఎలా ఉంటుందో తెలియదని చెప్పిన ఆయన ఇందుకుగాను తమ కుటుంబానికి అండగా ఉండేలా పాలసీల కొనుగోళ్లు ఎక్కువ అవుతున్నాయని వివరించారు.

'కరోనా మహమ్మారి ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఊహించినదానికన్నా ఎక్కువ కాలం కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్నందున, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అందరూ ప్రాధాన్య మిస్తున్నారు. అదే సమయంలో తమపై ఆధారపడిన వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు, రక్షణకే పరిమితమయ్యే పాలసీలతో పాటు, హామీతో కూడిన రాబడినిచ్చే వాటినీ ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో పాలసీలు(Insurance policies) తీసుకోవడం గణనీయంగా పెరుగుతోంద'ని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ-సీఈఓ కమలేశ్‌ రావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లు, పరిశ్రమ తీరుతెన్నులను 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలివీ..

కొవిడ్‌-19 రెండో దశ నేపథ్యంలో బీమా సంస్థలకు ఎదురైన సవాళ్లేమిటి? ఇదే సమయంలో ఎలాంటి అవకాశాలు లభించాయి?

ఆరోగ్య సంరక్షణ, టర్మ్‌ పాలసీలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బీమా సంస్థలు ఆన్‌లైన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కొంత సిద్ధంగా ఉన్నందున పెద్దగా ఇబ్బంది పడలేదు. అందుకే, ఆర్థిక వ్యవస్థ మందగించినా, బీమా సంస్థలు వృద్ధి నమోదు చేశాయి. డిజిటలైజేషన్‌ బీమా సంస్థలకు మంచి అవకాశంగా మారిందని చెప్పొచ్చు. కొన్ని రకాల పాలసీల జారీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం లాంటివి కష్టమయ్యాయి. టెలి-మెడికల్స్‌ లాంటి వినూత్న ప్రయోగాలు దీనికి పరిష్కారాన్ని చూపాయి.

బీమా రంగం స్థూలంగా ఎలా ప్రభావితమైంది?

2020-21 తొలి త్రైమాసికంలో బీమా వృద్ధిలో కొంత స్తబ్దత కనిపించింది. వ్యక్తులను కలిసి పాలసీలు ఇవ్వడానికి బదులు డిజిటల్‌కు మారాల్సి వచ్చింది. మార్కెట్లో కొంత అనిశ్చితి, వడ్డీ రేట్ల తగ్గుదలతో ప్రజలు ఆర్థిక భరోసా, డబ్బు వృద్ధికి దోహదపడే పథకాలపై ఎక్కువ ఆసక్తి చూపించారు. అందువల్ల బీమా రంగంలో నెలవారీగా చూస్తే కొంత క్షీణత నమోదైనా, 2020-21 మొత్తంమీద చూస్తే కొత్త బీమా ప్రీమియం వసూళ్లలో 8 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.94,000 కోట్ల వరకు ఉన్నాయి.

భవిష్యత్తులో ఈ రంగ వృద్ధి ఎలా ఉండబోతోంది?

కుటుంబ ఆర్థిక రక్షణకు తగిన ఏర్పాట్లు ఉండాలన్న విషయాన్ని కరోనా మహమ్మారి గుర్తు చేసింది. దీనికోసమే బీమా పాలసీలను తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇది మున్ముందూ కొనసాగుతుంది. భయం, అనిశ్చితి, అంతర్జాతీయ పరిణామాలతో.. భద్రతకు సంబంధించిన పథకాలకు మరింత గిరాకీ పెరుగుతుంది. వ్యక్తులు తమ పెట్టుబడి మొత్తానికి కనీస రాబడి ఆశిస్తున్నారు. దీంతో పిల్లల పథకాలు, పదవీ విరమణ పాలసీలకూ ఆదరణ కనిపిస్తోంది. మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ అనుసంధానత వల్ల పాలసీదారులకు పారదర్శకంగా పాలసీలను అందించేందుకు వీలవుతోంది. అవసరం ఏమిటి అనేది చూసి.. అందుకు అనుగుణంగా పాలసీలను అందించేందుకూ ఇది బాటలు వేస్తుంది. ఇదంతా బీమా రంగం వృద్ధికి తోడ్పడే అంశాలే.

ఇటీవల నూతన పాలసీలపై ప్రీమియం బాగా పెరిగింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో కొత్త పాలసీదారులను ఆకర్షించేందుకు ఇది అడ్డంకి కాదా?

అనివార్య పరిస్థితుల్లో బీమా ప్రీమియం పెరిగినా, పాలసీ ఆవశ్యకతపై పెరిగిన అవగాహన, కరోనా రెండో దశ చూపించిన ప్రభావం నేపథ్యంలో చాలామంది టర్మ్‌ పాలసీలు తీసుకుంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల రాబడి హామీతో కూడిన పాలసీల వైపు చూస్తున్నారు. దీంతో బీమా సంస్థలు కొంత మేరకు ప్రీమియం సవరించినప్పటికీ.. టర్మ్‌ పాలసీలకూ.. పొదుపు పాలసీలకు ఆదరణ తగ్గలేదు.

కొత్త ప్రీమియం వసూలు, పాత పాలసీల కొనసాగింపులో మీ సంస్థ ఎలాంటి పనితీరు చూపిస్తోంది?

జీవిత బీమా రంగ పరిశ్రమలో నూతన బీమా ప్రీమియం వసూళ్లు గత ఆర్థిక సంవత్సరం 8 శాతం పెరిగాయి. మా సంస్థ తొలి వార్షిక ప్రీమియంలో 14% వృద్ధి నమోదు చేసింది. పాలసీల పునరుద్ధరణ విషయంలోనూ 27.8% వార్షిక వృద్ధి సాధించాం. క్రమంగా వృద్ధి సాధించే దిశగా మా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేశంలో జీవిత బీమా రంగ విస్తృతి తక్కువగానే ఉంది. ఇది మరింత మందికి చేరువ కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, వ్యక్తుల అవసరాలను తీర్చే పాలసీల రూపకల్పనకు మేము కృషి చేస్తున్నాం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి లక్ష్యాలు విధించుకున్నారు? కొత్త పాలసీలేమైనా తీసుకొస్తున్నారా?

పాలసీదారులు డిజిటల్‌కు మారేలా ప్రోత్సహించడంతో పాటు, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా పాలసీలను అందించాలన్నది మా ప్రయత్నం. ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం కష్టమే. బీమా పాలసీలను తీసుకోవడం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం కన్నా.. ఈసారి ఎక్కువ వృద్ధి సాధించాలనేది లక్ష్యం. కనీసం 16-17శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పాలసీదారుల అవసరాలు, అందుతున్న పాలసీలు.. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసే వ్యూహంతోనే ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పని చేస్తుంటుంది. అవసరమైనప్పుడు కొత్త పాలసీలను విడుదల చేస్తూనే ఉంటాం. కొత్త కొత్త నష్టభయాలు కనిపిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఈ ఏడాది కొన్ని పాలసీలను తీసుకొస్తాం.

ఇదీ చూడండి: Covid: మూడో దశను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.