ETV Bharat / bharat

'మాది అభివృద్ధి మంత్రం.. ఎస్పీది మాఫియావాదం'

author img

By

Published : Feb 22, 2022, 1:32 PM IST

Yogi Adityanath ETV Bharat interview
యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath ETV Bharat interview: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. యూపీలో భాజపా విజయావకాశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష సమాజ్​వాదీపై విరుచుకుపడ్డారు. ఎస్పీ హయాంలో రాష్ట్రంలో నేరస్థులకు భయమనేదే లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్థులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. వివిధ అంశాలపై ఆయన ఇంకేం మాట్లాడారంటే...

Yogi Adityanath ETV Bharat interview: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మూడు విడతలు పూర్తయ్యాయి. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భాజపా ఎలాంటి అవకాశాలను విడిచిపెట్టడం లేదు. కేంద్ర అధినాయకత్వంతో పాటు, ప్రధానమంత్రి, సీనియర్ నేతలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తిరిగి భాజపాను అధికారంలోకి తెచ్చే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. రాత్రింబవళ్లు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్​లో ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు యోగి. ఎన్నికల్లో భాజపా సాధించనున్న సీట్లు, సమాజ్​వాదీ ప్రభావం, హిజాబ్ వివాదంపై మాట్లాడారు. ఆ వివరాలు ఇలా...

ఈటీవీ భారత్​తో యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూ

Yogi Adityanath UP Election:

మూడు దశల ఎన్నికల తర్వాత భాజపా ఏ స్థితిలో ఉంది?

UP assembly election 2022: జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన అనేది భాజపా అజెండా. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాల కోసం భాజపా పనిచేస్తుందని ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికలను పరిశీలిస్తే ప్రజలు భాజపా పక్షానే ఉన్నారని స్పష్టమవుతోంది.

అహ్మదాబాద్ పేలుళ్ల ఘటన నిందితుడి తండ్రి సమాజ్​వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​తో కలిసి ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి?

సమాజ్​వాదీ పార్టీ చరిత్ర చాలా దుర్భరంగా ఉంది. 2013లో ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు కాపాడటం కోసమే సమాజ్​వాదీ పార్టీ ప్రభుత్వం పనిచేసిందని చరిత్రే చెబుతుంది. రాష్ట్రంలో గూండాలు, మాఫియాకు సురక్షిత ఆశ్రయం కల్పించింది. ఎస్పీ చరిత్ర అందరికి తెలుసు.

మూడు రోజుల క్రితం గుజరాత్ కోర్టు వరుస పేలుళ్ల ఘటనపై తీర్పు వెలువరించింది. 38 మంది దోషులకు ఉరి శిక్ష, 11మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అందులో 9మంది ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవారు ఉన్నారు. ఉగ్రవాదుల్లో చాలా మంది ఆజంగఢ్​లోని సంజార్పుర్ గ్రామానికి చుట్టుపక్కలే ఉంటున్నారు.

సంజార్పుర్​కు చెందిన ఓ ఉగ్రవాది సిరియాకు పారిపోయాడు. దిల్లీ బాట్లాహౌస్ ఘటనలో అతడి సోదరుడికి ప్రమేయం ఉంది. సిరియా పారిపోయిన ఉగ్రవాది తండ్రి ఎస్పీకి క్రియాశీల కార్యకర్త. ఆ పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నాడు. చిన్నాపెద్దా ఘటనలన్నింటికీ స్పందించే అఖిలేశ్ యాదవ్.. 2013 ఘటన(ముజఫర్​నగర్ అల్లర్లు)పై ఎందుకు మౌనంగా ఉన్నారు?

మాఫియాపై తీసుకున్న చర్యలను విమర్శిస్తూ మిమ్మల్ని 'బుల్డోజర్ బాబా' అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. దీనిపై మీరేమంటారు?

రాష్ట్రంలో సమాజ్​వాదీ నాలుగు సార్లు అధికారంలో ఉంది. పేద ప్రజలు, యువత, రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలిగేలా వారు ఎలాంటి పని చేయలేదు. ఇది దురదృష్టకరం. కానీ, ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరితో ఉండటం ఆశ్చర్యం.

ఎస్పీ పాలనలో నేరస్థులు, మాఫియాకు భయమే లేకుండా పోయింది. మేం అధికారంలోకి వచ్చాక చెప్పింది చేశాం. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకున్నాం. అభివృద్ధి, భద్రత అంశాలపై ఎలాంటి రాజీ లేకుండా భాజపా ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది.

ఆందోళనకారుల విధ్వంసంలో జరిగిన నష్టానికి పరిహారం వసూలు చేయాలని గతంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు జోక్యంతో రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఏం చేస్తారు?

సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో.. అది మేం ఇదివరకే చేశాం. అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా కాకుండా ట్రైబ్యునళ్ల ద్వారా నష్టపరిహారాన్ని వసూలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ఆందోళనకారుల నుంచి పరిహారం వసూలు చేయాలని మేం గతంలో ఉత్తర్వులు జారీ చేశాం. ఆ తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చాం. మూడు ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశాం.

హిజాబ్ వివాదాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు?

రాజ్యాంగం ప్రకారమే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయి. వ్యక్తిగత, షరియా చట్టాల ప్రకారం కాదు. ఇంట్లో ఉంటే నచ్చిన దుస్తులు ధరించుకోవచ్చు. ఏదైనా సంస్థల్లో డ్రెస్​కోడ్ ఉంటే తప్పనిసరిగా పాటించాల్సిందే.

కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో మీ ప్రభుత్వం వైఫల్యాలు చవిచూసిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఏం చెప్తారు?

కరోనా సమయంలో కాంగ్రెస్, బీఎస్​పీ, ఎస్పీ నేతలంతా ఎక్కడికి వెళ్లారు. అప్పుడు వీరంతా హోమ్ ఐసోలేషన్​ ఉండిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే క్రియాశీలంగా పనిచేశాయి. మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా నిర్వహణలో మా పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.

మీ అభివృద్ధి కార్యక్రామాల జాబితా చాలా పెద్దదే. కానీ, జిన్నా, ఉగ్రవాదం వంటివి ఎన్నికల్లో ఎందుకు ప్రాధాన్యాంశాలుగా మారాయి?

నేను అభివృద్ధి గురించే మాట్లాడాలనుకున్నా. కానీ, సర్దార్ పటేల్ జయంతి రోజు దేశమంతా సంబరాలు చేసుకుంటే.. సమాజ్​వాదీ పార్టీ జిన్నాను కీర్తిస్తూ మాట్లాడింది. రాష్ట్రంలోని యువతకు స్మార్ట్​ఫోన్లు అందిస్తున్న రోజు.. ఎస్పీ పాకిస్థాన్​ను పొగిడింది. ఈ అంశాలన్నింటినీ లేవనెత్తింది సమాజ్​వాదీ పార్టీనే. మేము కాదు. 'సబ్​కా సాత్ సబ్​కా వికాస్' నినాదంతోనే మేము ఎన్నికల బరిలో ఉన్నాం.

ఈసారి యూపీలో భాజపా ఎన్ని సీట్లు గెలుస్తుంది?

రాష్ట్రంలో '80- 20' నమూనాతో మేము ముందుకెళ్తున్నాం. మెజారిటీ సీట్లు మావే.

ఇదీ చదవండి: యూపీలో ఎస్పీ, భాజపా హోరాహోరీ.. 4, 5వ విడతల్లో ఇవే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.