ETV Bharat / bharat

పది ప్రశ్నపత్రం లీకేజీ.. బండి సంజయ్ ఫోన్ ఇస్తే కీలక సమాచారం సేకరణ!

author img

By

Published : Apr 5, 2023, 7:37 PM IST

CP Ranganath
CP Ranganath

CP Ranganath on Bandi Sanjay Arrest : కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. పక్కా పథకం ప్రకారమే బండి సంజయ్‌ కుట్రకు పాల్పడినట్లు ఆయన తేల్చిచెప్పారు. బండి సంజయ్‌ ఫోన్ ఇస్తే మరింత సమాచారం సేకరిస్తామన్నారు. కక్షపూరితంగా సంజయ్‌ను అరెస్ట్‌ చేశారనేది పూర్తి అవాస్తవమని రంగనాథ్‌ కొట్టిపారేశారు.

CP Ranganath on Bandi Sanjay Arrest : రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ పలు ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించారు. కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగనాథ్.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో బండి సంజయ్‌ ఏ1, బూరా ప్రశాంత్‌ (మాజీ జర్నలిస్టు) ఏ2, గుండబోయిన మహేశ్‌ ఏ3 (కేఎంసీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌), మైనర్‌ బాలుడు ఏ4, శివగణేశ్‌ ఏ5ని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని రంగనాథ్ వెల్లడించారు. బూర ప్రశాంత్‌ను మంగళవారమే అరెస్టు చేశామన్నారు. కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచే ప్రశ్నపత్రం బయటకు తెచ్చినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అదే విధంగా బండి సంజయ్‌పై 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రానికి బాధ్యులపైన శాఖపరమైన చర్యలు తీసుకున్నారని సీపీ రంగనాథ్​ వివరించారు.

ప్రశాంత్‌ జర్నలిస్టు కాదు : ఒక జర్నలిస్టు తన విధుల్లో భాగంగా అప్పటికే వివిధ గ్రూపుల్లో వచ్చిన ప్రశ్న పత్రాన్ని హైదరాబాద్‌లో ఉన్న మీడియా హెడ్స్‌కి 11.18 నిమిషాలకు ఫార్వర్డ్‌ చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. 11.20 నిమిషాలకు బూర ప్రశాంత్‌ బండి సంజయ్‌కు వాట్సప్‌లో పంపారన్న ఆయన... ప్రశాంత్‌ ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేయడం లేదన్నారు. చాలా మందికి ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ ఫార్వర్డ్‌ చేశాడని రంగనాథ్ పేర్కొన్నారు. ఇతనితో పాటు మహేశ్‌ కూడా చాలా మందికి పంపాడన్న సీపీ.. బండి సంజయ్‌కు ప్రశాంత్‌తో పాటు మహేశ్‌ కూడా పంపించాడని దర్యాప్తులో తేలిందన్నారు. బండి సంజయ్​కే కాదు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఆయన పీఏ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలకు కూడా ప్రశ్నపత్రం పంపారని సీపీ రంగనాథ్ వెల్లడించారు.

'పిల్లల సహాయంతో ప్రశ్నపత్రం బయటకు తెప్పించుకున్నారు. కొన్ని మొబైల్స్​లో మెసేజ్​లు డిలీట్ చేశారు. వాటిని రిట్రీట్ చేయాలి. కాల్ డేటా సేకరించాల్సి ఉంది. కమలాపూర్‌ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు ఎందుకు వస్తున్నాయి. మొత్తం ప్రశ్నపత్రాల లీక్ జరుగుతోందనే ప్రచారం జరిగేలా కుట్ర కనిపిస్తోంది. సెక్షన్‌ 41 ప్రకారం వారంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు. కక్ష పూరితంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారనేది అవాస్తవం. ఎంపీ సంజయ్‌ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చాం. మైనర్లను జువైనల్‌ కోర్టుకు పంపించాం.'-రంగనాథ్, వరంగల్‌ సీపీ

ప్రశాంత్‌ చెప్పిన విషయాలే బండి సంజయ్‌ చెప్పారు : హిందీ ప్రశ్నపత్రం ఫార్వర్డ్‌ అయిన అందరిని అరెస్టు చేయలేదు, విచారించట్లేదు... కానీ, అంతకు ముందు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ సీపీ తెలిపారు. 3వ తేదీ సోమవారం సాయంత్రం ప్రశాంత్‌కు.. బండి సంజయ్‌కు మధ్య వాట్సప్‌ చాటింగ్‌ జరిగిందన్న సీపీ... అందులో ప్రశాంత్‌ చెప్పిన విషయాలే బండి సంజయ్‌ మీడియా సమావేశంలో చెప్పారని పేర్కొన్నారు. వాట్సప్‌ కాల్‌ చేసి బండి సంజయ్‌తో ప్రశాంత్‌ పలుమార్లు మాట్లాడారని సీపీ రంగనాథ్ అన్నారు.

'బండి సంజయ్‌ను ఫోన్ అడిగితే లేదన్నారు, మాకు ఇవ్వలేదు. ఎక్కడుందంటే తెలియదంటున్నారు. బండి సంజయ్‌ మొబైల్ ఇస్తే మాకు కీలక సమాచారం లభిస్తుంది. అందుకే ఆయన ఫోన్ ఇవ్వట్లేదు. అయినా.. బండి సంజయ్ ఫోన్​కాల్​ డేటా సేకరిస్తాం. పేపర్‌ షేర్‌ అయిన అందరికి ప్రశాంత్‌ ఫోన్‌ చేయలేదు. బండి సంజయ్‌కు మాత్రమే ఎక్కువసార్లు ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. పేపర్‌ షేర్‌ జరగటానికి ముందు జరిగిన చాటింగ్‌ ఆధారంగానే సంజయ్ అరెస్టు. బండి సంజయ్‌ ఫోన్ మాకు ఇస్తే మరింత సమాచారం సేకరిస్తాం.'-రంగనాథ్, వరంగల్ సీపీ

బండి మొబైల్ ఇస్తే కీలక సమాచారం : ప్రశ్నపత్రం షేర్‌ చేశారని ఎవరిపై కేసు నమోదు చేయలేదన్న సీపీ రంగనాథ్.. బీజేపీ నాయకులకు చాలా మందికి ఆ ప్రశ్నపత్రం షేర్‌ చేశారని పేర్కొన్నారు. వారందరిపై కేసులు నమోదు చేయడంలేదన్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ప్రశాంత్‌ గతంలో ఒక టీవీ ఛానెల్‌ పనిచేశారన్న సీపీ.. ప్రస్తుతం నేషన్‌ విత్‌ నమో టీమ్‌లో కీలక సభ్యుడిగా వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్నారని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే కమలాపూర్‌ నుంచి ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారని ఆయన వెల్లడించారు. కక్ష రాజకీయాలు అయితే మిగతా బీజేపీ నేతలపై కూడా కేసులు పెట్టాలి కదా అని అన్నారు. ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్‌ ఫోన్‌ ఇవ్వొచ్చు కదా అని వరంగల్ సీపీ రంగనాథ్‌ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.