ETV Bharat / bharat

యోగి కోసం రంగంలోకి 'మానసపుత్రిక'.. అప్పుడు భాజపాకు ఝలక్.. ఇప్పుడు..

author img

By

Published : Jan 30, 2022, 5:01 PM IST

UP HINDU YUVA VAHINI YOGI ADITYANATH
UP HINDU YUVA VAHINI YOGI ADITYANATH

UP election Hindu Yuva Vahini: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి, గోరఖ్​నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. విజయం నల్లేరుపై నడకే అయినా.. యోగి ఎన్నికల ప్రచార బాధ్యతల్ని ఆయన మానస పుత్రిక తన భుజానకెత్తుకుంది. గతంలో భాజపాకు షాక్ ఇచ్చిన హిందూ యువ వాహిని.. ఇప్పుడు క్రియాశీలంగా మారి కమలదళ విజయం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది.

UP election Hindu Yuva Vahini: హిందూ యువ వాహిని.. యువతలో జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్​పుర్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన సంస్థ. గత కొన్నేళ్లుగా ఇది నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా క్రియాశీలంగా మారింది. ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలపై దృష్టిసారించింది. వ్యవస్థాపకుడు యోగి తరఫున ప్రచారం చేస్తోంది.

Yogi Adityanath Hindu Yuva Vahini

గోరఖ్​పుర్ పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరును భాజపా ప్రకటించగానే ఈ యువ వాహిని సభ్యులంతా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో యోగికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక భాజపా నేతలతో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యోగికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు.

UP assembly election 2022

2002లో యోగి ఆదిత్యనాథ్ ఈ సంస్థను ప్రారంభించారు. భాజపాతో విభేదించి దీన్ని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా గోరఖ్​పుర్​లోని యువతపై ఇది ఎక్కువగా ప్రభావం చూపింది. పెద్ద సంఖ్యలో యువత ఇందులో భాగమయ్యారు.

యోగి నేతృత్వంలో హిందూ యువ వాహిని అత్యంత శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లను యోగికి అనుకూలంగా మార్చడంలో విశేషంగా తోడ్పడింది. భాజపాపై పోటీ చేసిన తన అనుచరులను గెలిపించుకోవడానికి హిందూ వాహిని అసమానంగా ఉపయోగపడింది.

భాజపాను ఢీకొట్టి...

Yogi adityanath vs BJP 2002:

2002లో భాజపాతో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు తన సత్తాను హిందూ వాహిని ద్వారా నిరూపించుకున్నారు యోగి ఆదిత్యనాథ్. గోరఖ్​పుర్ సిటీ, పిప్రాయిచ్, ముండేరా నియోజకవర్గాల నుంచి అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున అభ్యర్థులను దించారు. గోరఖ్​పుర్ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన అప్పటి కేబినెట్ మంత్రి, భాజపా నేత శివ్ ప్రతాప్ శుక్లాను ఎన్నికల్లో గట్టిదెబ్బ కొట్టారు. మహాసభ నుంచి పోటీ చేసిన రాధామోహన్ దాస్ అగర్వాల్.. ఘన విజయం సాధించారు. యోగి హవాకు.. శివ్ ప్రతాప్ శుక్లా ఓట్ల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. యోగి వ్యూహాలు, హిందూ వాహిని క్షేత్రస్థాయి పనితీరు ఇందుకు ప్రధాన కారణం.

పిప్రాయిచ్​లో మహాసభ అభ్యర్థి దీపక్ అగర్వాల్.. భాజపా మద్దతిచ్చిన అభ్యర్థి జితేంద్ర జైస్వాల్​కు గట్టిపోటీ ఇచ్చారు. అయితే, రెండో స్థానానికి పరిమితమయ్యారు. ముండేరాలో మాత్రం మహాసభ అభ్యర్థి బేచన్ రామ్ ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా గోరఖ్​పుర్​లో భాజపాపై యోగి ప్రభావం గట్టిగానే పడింది. ఈ సంస్థ క్రమంగా బలపడింది. 1998 నుంచి గోరఖ్​పుర్ నియోజకవర్గం ఎంపీగా గెలుస్తూ వస్తున్న యోగి.. 2002 తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లో అగ్రశ్రేణి హిందుత్వ నేతగా ఎదిగారు.

సీఎం అయిన తర్వాత...

అయితే, 2017 తర్వాత హిందూ వాహిని.. మెతక వైఖరే అవలంబించిందన్నది విశ్లేషకుల మాట. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఈ సంస్థ రాజకీయాల కంటే సామాజిక కార్యక్రమాలపైనే దృష్టిపెట్టిందని చెబుతారు. అంటరానితనాన్ని రూపుమాపి, హిందువుల మధ్య వివక్ష లేకుండా చూసేందుకు ప్రయత్నించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ వీరు స్థానిక పౌరులకు తమ సేవలు అందించారు.

"హిందూ యువ వాహిని ఓ సామాజిక సంస్థ. గోరఖ్​పుర్​లో సామాజిక సమస్యలతో పాటు మహరాజ్(యోగి) ఎన్నికల ప్రచారంపైనా సంస్థ పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా భాజపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తోంది."

-ఇంజినీర్ పీకే మాల్, హిందూ యువ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గత ఎన్నికల్లో యోగికి మద్దతుగా పనిచేసిన వారి జాబితాను సిద్ధం చేసినట్లు హిందూ వాహిని గోరఖ్​పుర్ కన్వీనర్ రిషి మోహన్ వర్మ తెలిపారు. వీరందరికీ మరోసారి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రకారం బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

వివాదాలు..

హిందుత్వం, జాతీయవాదానికి అంకితమైన సామాజిక, సాంస్కృతిక సంస్థగా హిందూ యువ వాహిని తనను తాను అభివర్ణించుకుంటుంది. గోసంరక్షణ, అంటరానితనాన్ని నిర్మూలించడం, సమాజంలో వివిధ వర్గాల మధ్య అసమానతలు తొలగించడం, సామరస్య అభివృద్ధికి తోడ్పడటం తమ విధిగా చెప్పుకుంటుంది ఈ సంస్థ.

ఇవన్నీ ఎలా ఉన్నా.. హిందూ వాహిని చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. సంస్థకు చెందిన కొందరు సభ్యులు అత్యాచార ఆరోపణలపై 2017 జూన్​లో అరెస్టయ్యారు. నిందితులు బరేలీలో పోలీసు అధికారిపైనా దాడి చేశారు. అదే ఏడాది ఏప్రిల్​లో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ హిందూ యువతికి సహకరించిన ముస్లిం వ్యక్తిపై మూకదాడి చేశారు. 2018లో లవ్ జిహాద్ ఆరోపణలతో ముస్లిం జంటపై దాడి చేశారు.

అయితే గతంలో గోరఖ్​పుర్​లో నేరాలు తగ్గడంలో హిందూ వాహిని కృషి చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 'ఆ సమయంలో గోరఖ్​పుర్​లో మాఫియా ప్రభావం ఎక్కువగా ఉండేది. నేరాలు ఎక్కువగా జరిగేవి. కానీ యోగి ఆధ్వర్యంలోని హిందూ యువ వాహిని రాకతో పరిస్థితులు చక్కబడ్డాయి. రాజకీయ సమీకరణాలూ మారిపోయాయి' అని స్థానిక సామాజిక కార్యకర్త రామ్ శంకర్ సింగ్ చెప్పుకొచ్చారు.

కొందరు మాత్రం ఈ వ్యాఖ్యలను విభేదిస్తున్నారు. హిందూ యువ వాహిని తీవ్రమైన ప్రకటనలు చేసేదని స్థానికుడు మహేంద్ర మిశ్రా పేర్కొన్నారు. 'గోరఖ్​పుర్​లో జీవించాలంటే యోగి నామం జపించాలి' అని నినాదాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవి నియంతృత్వ ధోరణికి అద్దం పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మళ్లీ క్రియాశీలంగా...

2002 ఘటనల తర్వాత.. కమలం పార్టీకి, యోగికి మధ్య చాలాసార్లు గిల్లిగజ్జాలు కొనసాగినప్పటికీ.. తర్వాత భాజపా గూటికే చేరారు యోగి ఆదిత్యనాథ్. అప్పటి నుంచి హిందూ వాహిని రాజకీయంగా నెమ్మదించింది. ఇప్పుడు తమ వ్యవస్థాపకుడే అసెంబ్లీ ఎన్నికల్లో దిగుతున్నందున మరోసారి క్రియాశీలంగా మారింది. ఎలాగూ ఇక్కడ యోగి హవానే కొనసాగుతూ వస్తోందని, ఎన్నికల్లో ఎంత మెజారిటీతో ఆయన గెలుపొందుతారనే విషయమే తేలాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గోరఖ్​పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఎక్కువ కాలం ఈ ప్రాంతంలోనే గడిపారు. గోరఖ్​నాథ్ మందిరానికి ఆయన మఠాధిపతిగా కొనసాగుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలపై ప్రత్యేక కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.