ETV Bharat / bharat

ప్రియుడి మోజులో భర్తకు విడాకులు.. పిల్లల్నీ వదిలేసి పారిపోయిన మహిళ!

author img

By

Published : Jul 2, 2022, 5:51 PM IST

Ujjain woman ran away from home
Ujjain Mother Ran with Lover

ప్రియుడి మోజులో అప్పటికే భర్తను వదిలేసిన ఆ మహిళ.. తన ఇద్దరు చిన్నారులను కూడా భారంగా భావించింది. ఒకరోజు ఆస్పత్రికి వెళ్తున్నా అని చెప్పి.. వారిని కూడా విడిచి పెట్టి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో జరిగింది.

మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు చిన్నారులను ఇంట్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ మహిళ. ఇదివరకే భర్తతో విడిపోయిన ఆమె.. అభం శుభం తెలియని పసివాళ్లను విడిచిపెట్టి పోవడం తల్లి ప్రేమకే మాయని మచ్చగా నిలుస్తోంది.

ఇదీ జరిగింది: దేశాయ్ నగర్​లో ఓ మహిళ తన ప్రియుడు అభిషేక్​ మౌర్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాలుగు నెలలుగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే జూన్ 26న ఒక్కసారిగా అనారోగ్యం బారినపడింది ఆ మహిళ. "ఆస్పత్రికిలో చేరడానికి వెళ్తున్నా.. పెదనాన్న మిమ్మల్ని చూడటానికి వస్తారు" అని పిల్లలకు చెప్పి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాలేదు.

దీంతో ఆ రోజు సాయంత్రం పిల్లలు.. తల్లి కోసం వీధుల్లో తిరగడాన్ని గుర్తించిన స్థానికులు వారిని చేరదీశారు. ఈ విషయాన్ని వారి తండ్రి అనిల్ గుప్తాకు తెలియజేయగా.. పిల్లలను తనతో ఉంచుకునేందుకు ఆయన సుముఖంగా లేరని స్థానికులు చెప్పారు. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా.. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండి ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదని తెలుస్తోంది. దీంతో చిన్నారులను ఏదైనా స్వచ్ఛంద సంస్థకు లేదా సంరక్షణ గృహానికి ఇచ్చేయాలని భావిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా మౌర్యతో సదరు మహిళకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు భర్త అనిల్ గుప్తా. అనంతరం ఆమె.. పిల్లలు (ఐదేళ్ల బాబు లక్షిత్, రెండేళ్ల పాప రియా), ప్రియుడితో కలిసి నివసించేది. అయినప్పటికీ అప్పుడప్పుడూ వచ్చి ఆ పిల్లలను తండ్రి చూసిపోతుండేవాడని సమాచారం.

ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య.. అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.