ETV Bharat / bharat

దర్యాప్తులో సంచలన విషయాలు- భారీ కుట్రకు ఉగ్రముఠా ప్లాన్​

author img

By

Published : Sep 16, 2021, 5:00 PM IST

terrorists plans attacks
ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర

దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల(Mumbai Bomb Blast) తరహా దాడులకు(Terrorist Attack) ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు చెప్పాయి.

దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే పండగల సీజన్‌లో భీకర దాడులకు(Terrorist Attack) పాల్పడేందుకు వీరు కుట్రలు చేశారు. కాగా.. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల(Mumbai Bomb Blast) తరహా దాడులకు(Terrorist Attack) ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి.

నిఘా సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో గత మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో అనూహ్య దాడులు నిర్వహించిన దిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు.. ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురిని, దిల్లీలో ఇద్దరిని, రాజస్థాన్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారిని జాన్‌ మొహమూద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్‌, ఒసామా, మూల్‌చాంద్‌, జీషన్‌ ఖమార్‌, మొహమూద్‌ అబు బకర్‌, మహమ్మద్‌ ఆమిర్‌ జావేద్‌లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా వీరిని అనేక కోణాల్లో ప్రశ్నించగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం.

ఆ పేలుళ్ల తరహాలో..

ఈ ఉగ్రవాదులకు రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జ్‌లు పేల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసిందని దిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహాలో దాడులకు(Terrorist Attack) ప్లాన్‌ చేసినట్లు విచారణలో తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను ఎంచుకున్న ముష్కరులు అక్కడ రెక్కీ నిర్వహించేందుకు వెళ్లారు. రెక్కీ అనంతరం వీరంతా ఒక చోట చేరి ఆపరేషన్‌ చేపట్టాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సమూహాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

పాక్​కు వెళ్లి వచ్చారని...

అరెస్టయిన వారిలో ఇద్దరు ముష్కరులు సముద్రమార్గం ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చారని తెలిసింది. విచారణలో కొందరు స్లీపర్ సెల్స్‌ పేర్లను ముష్కరులు చెప్పినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వారి కోసం గాలిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలిపాయి. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి 1.5కిలోల ఆర్డీఎక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

1993 మార్చి 12న దేశ వాణిజ్య రాజధాని ముంబయి వ్యాప్తంగా 12 వరుస బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. స్మగ్లింగ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహిం నేతృత్వంలో జరిగిన ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణశిక్ష పడిన ప్రధాన పాత్రదారు యాకుబ్‌ మేనన్‌ను 2015లో ఉరితీశారు.

ఇదీ చూడండి: రోడ్డుపై యువతి అదిరిపోయే డాన్స్​- షాకిచ్చిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.