ETV Bharat / bharat

'కేసులుంటే స్వీపర్​ కూడా కాలేడు.. కానీ మంత్రి కావచ్చు'.. అవినీతిపై సుప్రీం ఆందోళన

author img

By

Published : Feb 25, 2023, 7:39 AM IST

Supreme Court
Supreme Court

ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని.. అవినీతికి సామాన్యుడు బలవుతున్నాడని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్​ కేసుల్లో అభియోగాలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని.. దీనికి సామాన్య మానవుడు బలవుతున్నాడని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా సరే లంచం లేనిదే పని జరగడం లేదని సుప్రీం అభిప్రాయపడింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని స్థాయిల్లోనూ.. అవినీతిని రూపుమాపి జవాబుదారీతనాన్ని తీసురావల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. క్రిమినల్​ కేసుల్లో అభియోగాలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

నేర చరిత్ర ఉన్నవారు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ న్యాయవాది జస్టిస్ అశ్విన్​ ఉపాధ్యాయ్​ సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్​ను జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా కోర్టులో తన వాదనలు వినిపించిన న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్​.. 'హత్య, దొంగతనం, వేధింపులు, కిడ్నాప్​ వంటి పలు నేరాలకు పాల్పడిన వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ లేదా పోలీస్​ కానిస్టేబుల్​ కూడా కాలేడు. అయితే అవే నేరాలకు పాల్పడిన వ్యక్తి మాత్రం మంత్రి అవుతున్నాడు' అని పేర్కొన్నారు.

'భారతదేశంలో సామాన్యులు అవినీతిలో కూరుకుపోయారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం లేకుండా పని జరగడం లేదు. ప్రముఖ న్యాయనిపుణుడు నాని పాల్ఖివాలా తన 'వి ద పీపుల్‌' పుస్తకంలో దీని గురించి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నిజమైన భారతీయుడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు మనం మన ప్రధాన విలువలు, స్వభావాలను మరచిపోకూడదు. మనం మన విలువలను తిరిగి పొందినట్లయితే.. అనుకున్న విధంగా మార్పు చెందుతాం' అని జస్టిస్​ కే.ఎమ్​.జోసెఫ్​ అన్నారు. ప్రస్తుతం ఈ పిల్​పై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని తెలిపారు. ఈ అంశం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు.

రాజకీయాలను నేరపూరితం చేయడంపై పోల్ ప్యానెల్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిందని.. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించామని భారత ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అమిత్ శర్మ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని అన్నారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అవినీతిని అరికట్టేందుకు ఆస్తిని ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ తాను మరో పిల్ దాఖలు చేసినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.