ETV Bharat / bharat

'స్వచ్ఛ భారత్ 2.0'తో ప్లాస్టిక్ భూతానికి చెక్​

author img

By

Published : Apr 4, 2021, 1:24 PM IST

Swachh Bharat Mission 2.0, స్వచ్ఛ భారత్​ మిషన్​ 2.0
స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్​ మిషన్​ అర్బన్​ రెండో విడతను కేంద్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై నిషేధం కొనసాగిస్తూనే దీనిని మరింత కట్టడి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని భావిస్తోంది.

దేశంలో పరిశుభత్రపై కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు 'స్వచ్ఛ​ భారత్​ మిషన్'​. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండో విడతకు 'స్వచ్ఛభారత్​ అర్బన్​ 2.0' పేరుతో ఏప్రిల్​​ 1న కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజలకు పర్యావరణ హిత వస్తువుల వాడకం మీద అవగాహన పెంచేందుకు ప్రణాళికను రచించింది. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై నిషేధం కొనసాగిస్తూనే ఆ స్థానంలో జూట్​ బ్యాగ్​ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ.1,41,678 కోట్లను బడ్జెట్​లో కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బర్తన్​ బ్యాంక్​ పేరుతో వంటింటి పరికరాలకు సంబంధించి రాగి, స్టీల్​ సామాగ్రిని అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా ప్లాస్టిక్​ వినియోగం కొంత మేరకు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.

వేడుకల్లో ప్లాస్టిక్​ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో ఈ బర్తన్​ బ్యాంక్​ల నుంచి స్టీల్​, రాగి సామగ్రిని అద్దెకు తెచ్చుకుని వినియోగించుకోవచ్చు.

సిమెంట్​ ఉత్పత్తిదారుల సమాఖ్య, జాతీయ రహదారుల సంస్థలతో కేంద్రం ఒప్పందం చేసుకోనుంది. వేరుచేసిన ప్లాస్టిక్​​ను రోడ్ల నిర్మాణం, సిమెంట్​ బట్టీల్లో వినియోగించాలన్నది ప్రభుత్వం ప్రతిపాదన.

అర్బన్​ ఏరియాల్లో..

స్వచ్ఛ భారత్​ మిషన్​ అర్బన్​ (2.0)లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో మురుగునీటి శుద్ధిపై కూడా దృష్టి సారిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యర్థాల నిర్వహణ, బయో రెమిడియేషన్​ ద్వారా మహా నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపింది.

"అన్ని పట్టణాలను త్వరలో ఓడీఎఫ్​ (ఓపెన్​ డిఫెక్షన్​ ఫ్రీ)గా చేయడం సహా త్రీ స్టార్​ రేటింగ్​తో స్వచ్ఛత ఉన్న ప్రాంతాలుగా మారుస్తాము. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాలను వాటర్​ ప్లస్​ ధ్రవీకరణ ఉన్న ప్రాంతాలుగా మార్చేందుకు కృషి చేస్తాము."

-కేంద్రం

రాష్ట్రాల అభ్యర్థన..

చెత్త సేకరణపై ప్రజల వద్ద నుంచి కొంత రుసుమును వసూలు చేయాలని.. దీని వల్ల మెరుగైన సేవలకు అవకాశం ఉంటుందని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీనిపై జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే ఎంత మొత్తంలో వసూలు చేయాలనేది రాష్ట్రాలకే వదిలేస్తున్నామని పేర్కొంది. వీటిని పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేసినప్పుడు మున్సిపల్​ చట్టాల్లో భాగం చేయాలని స్పష్టం చేసింది.

తగ్గిన కేటాయింపులు..

స్వచ్ఛ భారత్​ కార్యక్రమం కోసం కేటాయింపులను కేంద్రం గత రెండేళ్లలో గణనీయంగా తగ్గించింది. బడ్జెట్​ అంచనాలతో పోలిస్తే సవరించిన అంచనాల్లో భారీ తేడా ఉంది. 2019-20 మధ్య స్వచ్ఛ భారత్​ మిషన్​ అర్బన్​కు బడ్జెట్​ అంచనా రూ.2,650 కోట్లు అయితే సవరించిన అంచనాలో రూ.1,300 కోట్లుగా ఉంది. 2020-21 సంవత్సరానికి బడ్జెట్​ అంచనా రూ.2,300 కోట్లు ఉండగా, సవరించిన అంచనా రూ.1,000 కోట్లుగా ఉంది. అయితే వీటి వాస్తవ వ్యయం ఇంకా తక్కువ ఉండటం గమనార్హం. 2019-20 ఏడాదికి రూ.1,298.57 కోట్లు ఖర్చు కాగా.. 2020-21 సంవత్సరానికి ఇప్పటివరకు రూ.988.09 కోట్లు ఖర్చు అయ్యాయి.

2016-17, 2017-18, 2018-19 సంవత్సరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రాలకు భారీగా నిధులు అందాయని.. సాలిడ్ వేస్ట్ గెస్టేషన్ పీరియడ్ 2-3 సంవత్సరాలు ఉండటం వల్ల రాష్ట్రాల నుంచి నిధులకు డిమాండ్​ తగ్గిందని కేంద్రం వివరణ ఇచ్చింది. అందుకే బడ్జెట్​ అంచనాకు, సవరించిన అంచనాకు మధ్య తేడా ఉందని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :

బుద్ధదేవ్ 'గళం'.. వామపక్షాలకు బలమవుతుందా?

'బంగాల్ ప్రజలను కించపరుస్తున్న దీదీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.