ETV Bharat / bharat

ఇవాళ్టి నుంచి శబరిమల ఆలయం మూసివేస్తున్నారు! కారణం తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 10:18 AM IST

Sabarimala Ayyappa Temple Closing
Sabarimala Ayyappa Temple Closing on December 27

Sabarimala Ayyappa Temple Closing on December 27 : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇవాళ (డిసెంబర్ 27) మూసివేస్తున్నారు! కారణం ఏంటి? మళ్లీ ఎప్పుడు తెరుస్తారు? మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Ayyappa Temple Closing on December 27 : హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం ఈ ఏడాది భక్తులు ఏ స్థాయిలో పోటెత్తారో తెలిసిందే. ఓ దశలో భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు సైతం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు! మొత్తానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో స్వామి సన్నిధానం కళకళలాడింది. ఎంతగా అంటే.. 5 వారాల్లోనే ఏకంగా 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే.. అయ్యప్ప స్వామి ఆలయాన్ని డిసెంబర్ 27 నుంచి మూసివేస్తున్నారు! మరి.. ఎందుకు? తిరిగి ఎప్పుడు తెరుస్తారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ముగుస్తున్న మండల పూజ..

అయ్యప్ప మాల వేసిన భక్తులు మండలం (41) రోజులు స్వామి సేవలో తరిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి కేరళ బయలుదేరుతారు. అయితే.. శబరిమల ఆలయంలోనూ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నేటి(డిసెంబర్ 27)తో ముగియబోతున్నాయి. రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం 11 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌ అధికారులు తెలియజేశారు.

కిక్కిరిసిన ప్రాంగణం..

ఈ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శబరిమల ఆలయం భారీస్థాయిలో పోటెత్తిందనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి మాలధారులు భారీగా అయ్యప్పస్వామి సేవలో పాల్గొన్నారు. ఫలితంగా.. 41 రోజులపాటు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఎటు చూసినా భక్తజన సందోహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.

ఎందుకు ఆలయం మూస్తారు?

మండల పూజలు ముగిసిన తర్వాత శబరిమల ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారంటే.. మకరవిళక్కు ఉత్సవం కోసం! అవును.. మకరవిళక్కు ఉత్సవం అంటే.. మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామి దీక్షలో జ్యోతి దర్శనానికి ఎంతటి ప్రాముఖ్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప సన్నిధానం తలుపులు మూసివేస్తారు. తిరిగి డిసెంబర్​ 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు గుడి తలుపులు తెరుస్తారు.

జ్యోతి దర్శనం ఎప్పుడు?

అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం.. జనవరి 15వ తేదీన సాయంత్రం 6.36 గంటలకు ఉంటుంది. అయ్యప్ప సన్నిధానంలో మండల పూజలు ముగించిన తర్వాత మకరజ్యోతి దర్శనం కల్పించండం అనవాయితీ. ఈ జ్యోతి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. మకర జ్యోతిని దర్శించుకుంటే.. జీవితంలో సకల దోషాలూ తొలగిపోతాయని.. జీవితంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని భక్తులు విశ్వసిస్తారు.

జనవరి 20 తర్వాత...

మకర జ్యోతి దర్శనం ఉత్సవాలు ముగిసిన తర్వాత.. జనవరి 20న ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ రోజు అయ్యప్ప సన్నిధానం తలుపులు మూసివేయడంతో.. శబరిమల వార్షిక యాత్ర ముగుస్తుంది. ఇందుకోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.