ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటింగ్ ఎలా జరగనుందంటే..

author img

By

Published : Jul 16, 2022, 7:54 AM IST

president polls india
రాష్ట్రపతి ఎన్నికలు

Presidential election 2022: దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలు, సాధారణ ఎన్నికలతో పోలిస్తే కాస్త భిన్నం. రాష్ట్ర అసెంబ్లీలే పోలింగ్‌ కేంద్రాలుగా మారనుండగా రాష్ట్రపతిని బ్యాలెట్‌ పద్దతిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. అయితే ఈ ఓటింగ్‌ ప్రక్రియ ఎలా జరగనుంది?. ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువ ఎంత? వారి ఓటును ఎలా గుర్తిస్తారో ఈ కథనంలో చూద్దాం.

Presidential election 2022: దేశాధినేత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన రాష్ట్రపతి ఎన్నికకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. జులై 18న జరిగే ఈ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు. ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు విభిన్న ఓటు విలువ కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా వారు రెండు రకాల బ్యాలెట్‌ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆకుపచ్చ, పింక్‌ రంగులతో కూడిన బ్యాలెట్‌ పేపర్లు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చేరుకున్నాయి. ఆకుపచ్చ బ్యాలెట్‌ పేపర్‌లో ఎంపీలు, పింక్‌ పేపర్‌లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ రంగు ద్వారా అది ఏ ప్రజాప్రతినిధిదో గుర్తించి వారికి ఉన్న ఓటు విలువ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా నిర్థారిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా ఝార్ఖండ్‌-తమిళనాడు రాష్ట్రాలకు అది 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. ప్రస్తుతం సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ మొత్తంగా 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.

ఇవీ చదవండి: యువకులను చితకబాది.. మూత్రం తాగించిన దుండగులు.. వీడియో తీసి​!

'పిల్లలు ఏడింటికే స్కూల్​కు వెళ్తుంటే.. మనమెందుకు రాలేం?': సుప్రీం జడ్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.