ETV Bharat / bharat

మత్తుమందు ఇచ్చి యువతి కిడ్నాప్.. కారులో రేప్.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం

author img

By

Published : Oct 8, 2022, 5:00 PM IST

jaipur-girl-gang-raped
jaipur-girl-gang-raped

యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు కామాంధులు. కారులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. హరియాణా గురుగ్రామ్​లో జరిగిన మరో ఘటనలో 15ఏళ్ల బాలుడు.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.

20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి కారులో అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. యువతికి మత్తుమందులు ఇచ్చి రేప్ చేశారు కామాంధులు. జైపుర్ సమీపంలోని ప్రాగ్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం 4గంటల సమయంలో తనను కిడ్నాప్ చేశారని బాధితురాలు వెల్లడించింది. మత్తుమందు ఇచ్చి కారులో తీసుకెళ్లారని తెలిపింది. యువతిని నిందితులు కిడ్నాప్ చేసి జైపుర్ నుంచి ప్రాగ్​పురాకు తీసుకొచ్చారు.

నారాయణ్ సర్కిల్ వద్దకు చేరుకున్న తర్వాత.. యువతికి స్పృహ వచ్చింది. వెంటనే కారులో నుంచి బయటకు దూకేసింది. ఎలాగోలా స్థానిక ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి గార్డుకు జరిగిన విషయం చెప్పగా.. అతడు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న జైపుర్ పోలీసులు.. ఈ కేసును ప్రాగ్​పురా పోలీసులకు బదిలీ చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ప్రాగ్​పురా పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఆమె స్టేట్​మెంట్​ను నమోదు చేసుకున్నామన్నారు.

వైద్యుడి నిర్వాకం..
'వైద్యో నారాయణో హరి' అన్న నానుడికి మచ్చతెచ్చేలా వ్యవహరించాడు ఓ డాక్టర్. చికిత్స పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. చికిత్స కోసం తన బామ్మతో కలిసి వచ్చిన 19ఏళ్ల బాలికను వేధించాడు బెంగళూరుకు చెందిన వైద్యుడు ఉబెదుల్లా. వృద్ధురాలిని బయటే ఉండమని చెప్పి.. యువతి చేతులు, శరీరభాగాలను తాకాడు.

.
వైద్యుడు

యువతికి సెలైన్ పెట్టి.. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించి ఇంటికి పంపించాడు. వైద్యుడికి భయపడి యువతి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, తర్వాత ఆమెకు జ్వరం వచ్చింది. మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తారన్న భయంతో.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేసింది. ఆగ్రహం చెందిన యువతి సోదరులు.. వైద్యుడి క్లినిక్​ను ధ్వంసం చేశారు. వైద్యుడు ఉబెదుల్లా పారిపోయాడు. అతడిపై చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

గర్ల్​ఫ్రెండ్​ను కలిసేందుకు వెళ్లి యువకుడు మృతి!
బంగాల్ కోల్​కతాలోని బగువైటీలో బుధవారం కనిపించకుండా పోయిన ఓ యువకుడు.. శవంగా తేలాడు. తమ కుమారుడు హత్యకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి పేరు అయాన్ మోండల్. కోల్​కతాలోని హరిదేవ్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేవాడు. దసరారోజు తన గర్ల్​ఫ్రెండ్​ను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. శుక్రవారం మగ్రాహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెన కింద అయాన్ మృతదేహం కనిపించింది.

గర్ల్​ఫ్రెండ్ కుటుంబ సభ్యులే అయాన్​ను హత్య చేశారని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 'అయాన్ గర్ల్​ఫ్రెండ్ బుధవారం ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే అయాన్ ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఇంట్లోనే ఇద్దరూ కలుసుకున్నారు. సడెన్​గా ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. ఆందోళనకు గురైన యువతి.. అయాన్​ను ఇంట్లోని ఓ మూలన దాక్కోమని చెప్పింది. తర్వాత అయాన్.. ఇంటి పైకి వెళ్లాడు. ఆ తర్వాతే కనిపించకుండా పోయాడు' అని పోలీసు వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు అనంతరం యువకుడి ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్​లకు పంపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం కనిపించింది. ఈ శవం అయాన్​దేనని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని సమాచారం. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. పోస్టుమార్టం పరీక్ష నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

'నోట్లో మూత్రం పోసి..'
హరియాణా గురుగ్రామ్​లో 15ఏళ్ల బాలుడు.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సెక్టార్ 52 ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదు అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. మంగళవారం ఈ ఘటన జరిగిందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో తన కూతురు మాత్రమే ఇంట్లో ఉందని తెలిపారు. బయట ఆడుకుంటుండగా.. బాలుడు.. ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని చెప్పారు. 'నేను ఇంటికి వచ్చేసరికి చిన్నారి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లా. గుచ్చిగుచ్చి అడిగితే.. పక్కింటి బాలుడే చేశాడని చెప్పింది. నోట్లో మూత్రం పోశాడని కూడా చెప్పింది. దీంతో ఆమెకు ఇన్ఫెక్షన్ తలెత్తింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు.

నేరానికి శిక్ష...
14ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం పాల్పడ్డ నేరానికి దోషికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది మహారాష్ట్ర ఠాణెలోని కోర్టు. దీంతోపాటు రూ.30వేలు జరిమానా విధించింది. అక్టోబర్ 1నే ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం వీటిని అందుబాటులో ఉంచింది. నిందితుడు.. బాధితురాలి సోదరుడికి స్నేహితుడు. బాధితురాలి ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. 2015 జనవరి 15న రాత్రి బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. నెలరోజుల వ్యవధిలో పలుమార్లు అత్యాచారం చేశాడు.

బాధితురాలు గర్భం దాల్చిన తర్వాత ఈ విషయం ఆమె తల్లికి తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో గర్భాన్ని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విచారణ కొనసాగుతుండగానే చిన్నారి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అదనపు సెషన్స్ కోర్టు జడ్జి పీఆర్ అశ్తూర్కర్.. నిందితుడికి కఠిన శిక్ష విధించారు. 'ఈ ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 14ఏళ్లే. నిందితుడి వల్లే గర్భం వచ్చిందని కూడా ఆమెకు తెలియదు' అని జడ్జి వ్యాఖ్యానించారు.

రైల్వే స్టేషన్​లో..
మరోవైపు, ఝార్ఖండ్​లోని లాతేహార్​లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో నిర్వహించిన ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన బాలిక.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఈ దారుణం జరిగింది. స్టేషన్​లో ఓ యువకుడితో బాలిక కూర్చొని ఉండగా.. మద్యం మత్తులో ఉన్న 10 మంది వ్యక్తులు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. బాలికతో ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం మైనర్​పై రేప్ చేశారు. ఈ ఘటనపై ఘర్షణ చెలరేగగా.. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే విషయం పోలీసుల వద్దకు చేరింది. వెంటనే 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

కుమార్తెపై దారుణం..
బతికి ఉండగానే కన్నకూతురికి నిప్పంటించాడు ఓ వ్యక్తి. బాలికకు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లాలో జరిగింది. నిందితుడిని పప్పూ తూరిగా గుర్తించారు. శుక్రవారం తప్పతాగి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవ పెట్టుకున్న అతడు.. ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ కోపంతో నాలుగేళ్ల కూతురిని గదిలో బంధించి ఇంటికి నిప్పంటించాడు. స్థానికులు వెంటనే గమనించి.. బాలికను కాపాడారు. లోహర్దగా జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. చిన్నారిని రిమ్స్​కు తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.