ETV Bharat / bharat

'ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వైఫల్యం కారణం కాకపోవచ్చు'.. దర్యాప్తు అధికారి కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Jun 7, 2023, 1:55 PM IST

odisha-train-accident-probe-team-member-disagreement-signal-failure-in-train-crash-odisha
ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు

Odisha Train Accident Probe : ఒడిశా రైలు దుర్ఘటనకు సిగ్నలింగ్ వైఫల్యం కాకపోవచ్చని రైల్వేశాఖ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నలే ఇచ్చారని.. అయినా అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన రైల్వేశాఖ అధికారులు.. రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

Odisha Train Accident Investigation : యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటనకు కారణాలు ఇంకా తెలియడం లేదు. సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ సంయుక్త దర్యాప్తు నివేదిక విడుదల చేయగా.. ఈ దర్యాప్తు బృందంలో సీనియర్‌ రైల్వే ఇంజినీర్‌ ఒకరు.. ఈ నివేదికను వ్యతిరేకించినట్లు తెలిసింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. అయినప్పటికీ అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆ ఇంజినీర్‌ తెలిపారు. దీనికి సంబంధించి డేటాలాగర్‌ నివేదికను ఆయన ప్రస్తావించారు.

ప్రమాదం తర్వాత.. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వేశాఖ ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన అనంతరం.. వీరు ప్రాథమిక నివేదికను బయటపెట్టారు. మెయిన్‌లైన్‌ నుంచి లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు సిగ్నల్‌ ఇచ్చారని తెలిపింది. బహానగా బజార్‌ స్టేషన్‌కు చెందిన పాయింట్‌ నంబర్‌ 17A రివర్స్‌ కండీషన్‌లో ఉందని.. ఈ పాయింట్ రివర్స్‌లో ఉందంటే, దాని అర్థం లూప్‌లైన్‌లోకి వెళ్లాలని, అదే ఈ పాయింట్‌ నార్మల్‌లో ఉంటే.. రైలు మెయిన్‌లైన్‌ మీదుగానే వెళ్తుందని అర్థం. ఫలితంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొందని.. ఈ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులు నివేదికలో పేర్కొన్నారు.

అయితే.. ఈ ప్యానెల్‌లోని ఐదో వ్యక్తి అయిన సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఏకే మహంత మాత్రం మిగిలిన నలుగురి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. పాయింట్‌ నంబర్ 17A.. రివర్స్‌ కండీషన్‌లో సెట్‌ చేసి ఉందంటే తాను అంగీకరించనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. డేటాలాగర్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ పాయింట్‌ నార్మల్‌లోనే ఉందని తమ విభాగం పరిశీలనలో తేలిందని ఆయన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పిన తర్వాత ఈ పాయింట్‌ రివర్స్‌లోకి మారిపోయి ఉంటుందని మహంత నివేదికలో అభిప్రాయపడ్డారు.

రైల్వేల్లో డేటాలాగర్ అనేది మైక్రోప్రాసెసర్‌ ఆధారిత వ్యవస్థ. ఇది రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థను మానిటర్‌ చేసి, డేటాను భద్రపరుస్తుంది. అయితే తొలుత మహంత కూడా సిగ్నలింగ్‌ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ.. ప్యానెల్‌లోని మిగతా సభ్యుల వాదనను అంగీకరించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు.. రైల్వే వర్గాలు తెలిపాయి. ఫలితంగా ఈ నివేదికపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, మహంత వ్యాఖ్యలపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు.. ప్రాథమిక దర్యాప్తు సమయంలో విభిన్న విభాగాల ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని తెలిపారు. ఇది సాధారణమేనని.. రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటపడతాయని ఆ అధికారులు పేర్కొన్నారు.

బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, ఎందువల్లనో వెంటనే వెనక్కి తీసుకున్నారని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో తేలింది. ఆ రైలు లూప్‌లైన్లోకి వెళ్లి.. అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్సురైలును ఢీకొట్టింది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో.. ఆ మార్గంలో వెళుతున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఇదంతా.. క్షణాల్లో జరిగిపోగా, పెను విషాదం చోటుచేసుకుంది. అయితే ఈ సిగ్నల్‌ను వెనక్కు తీసుకోవడం వెనుక ఉద్దేశపూర్వక చర్య ఏదైనా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.