ETV Bharat / bharat

టీకా తర్వాత వైరస్‌ సోకినా.. ముప్పు తక్కువే!

author img

By

Published : Jun 5, 2021, 4:59 AM IST

Updated : Jun 5, 2021, 7:00 AM IST

No deaths among those re-infected with Covid-19
టీకా తర్వాత వైరస్‌ సోకినా

వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా.. తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లపై తొలిసారి జరిపిన జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని నిపుణులు ఇప్పటికే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇలాంటి వారి ప్రాణాలకు ముప్పు తక్కువేనని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌-మేలో దిల్లీ ఎయిమ్స్‌ జరిపిన అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. టీకా తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదని తెలిపింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లపై తొలిసారి జరిపిన జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా వ్యాక్సిన్‌ పూర్తి మోతాదులో తీసుకున్నా కూడా వైరస్‌ బారినపడితే దాన్ని బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌గా వ్యవహరిస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా, అతి తక్కువ సందర్భాల్లో వైరస్‌ కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతారని, చాలా అరుదుగా మరణం సంభవించే ముప్పు ఉంటుందని అమెరికాలో వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ ఇలాంటి కేసులు వెలుగుచూడడంతో ఎయిమ్స్‌ నిపుణులు తాజా అధ్యయనం చేపట్టారు.

63 మందిలో...

అందులో భాగంగా గడిచిన రెండు నెలల్లో దాదాపు 63 మందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసులను గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందే ఉన్నారు. 36మంది రెండు డోసులు తీసుకోగా, మరో 27మంది ఒక డోసు తీసుకున్నారు. మొత్తం 63మందిలో 10 మంది కొవిషీల్డ్‌ తీసుకోగా, 53మంది కొవాగ్జిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో మాదిరిగానే పూర్తి స్థాయిలో తీసుకున్న వారిలోనూ వైరల్‌ లోడు అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. వారిలో జ్వరం కూడా ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటున్నట్లు కనుగొన్నారు. అయితే, ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని ఎయిమ్స్‌ నిపుణులు పేర్కొన్నారు.

ప్రాణాపాయం లేదు..

సాధారణంగా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసులు చాలా అరుదుగానే చోటుచేసుకునే అవకాశం ఉందని.. కరోనా వైరస్‌ కొత్త రకాలు ఇందుకు కారణమవుతున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టమవుతోందన్నారు. ఇలా మొత్తం 63 బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం కలుగలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో బి.1.617 వేరియంట్‌ అధిక ప్రాబల్యం చూపిస్తున్నట్లు ఇప్పటికే నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అది బి.1.617.1, బి.1.617.2, బి.1.617.3లుగా రూపాంతరం చెందినట్లు తెలిపారు. వీటిలో బి.1.617.2 రకం అధికంగా వ్యాప్తిలో ఉందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, గతంలోనూ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసులను గుర్తించినప్పటికీ వారిలో లక్షణాలు తక్కువగా ఉన్నాయి. తాజాగా వెలుగుచూసిన ఇన్‌ఫెక్షన్‌ కేసుల్లో వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉండడానికి కొత్త రకాలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే, వ్యాక్సిన్‌ తీసున్న తర్వాత వారిలో యాంటిబాడీలు సమృద్ధిగా వృద్ధి కాకపోవడం లేదా తొందరగా అవి క్షీణించడం వల్లనో ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఆసుపత్రి చేరికలు, మరణాల ముప్పు తక్కువగానే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి : టీకా వృథాను అరికట్టాలి: మోదీ

Last Updated :Jun 5, 2021, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.