యూపీలో సమాజ్వాదీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పార్టీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుని కుమార్తె సంధ్యా యాదవ్.. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీకి దిగారు. సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా పేరొందిన మైన్పురీ నుంచి కమలదళం తరఫున బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
భర్త అడుగుజాడల్లోనే..
2017లో సమాజ్వాదీ పార్టీని వీడి శివపాల్ యాదవ్ కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలోనే సంధ్యా యాదవ్ భర్త అనుజేష్ యాదవ్.. శివపాల్కు సన్నిహితంగా మెలిగారు. జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సమాజ్వాదీ నాయకుడు విజయ్ ప్రతాప్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. దీంతో అనుజేష్ యాదవ్ను సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. అప్పటినుంచి సమాజ్వాదీకి అనుజేష్ దంపతులు దూరమయ్యారు.
సంధ్యాయాదవ్ భాజపా నుంచి పోటీ చేసి గెలుస్తారు. నా తల్లి ఊర్మిళా యాదవ్ ఘిరోర్ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ మాకు ప్రజల మద్దతు ఉంది.
--అనుజేష్ యాదవ్
సంధ్యా యాదవ్ను సమాజ్వాదీ పార్టీ రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. మా పార్టీకి సొంత అభ్యర్థి ఉన్నారు. ఆయన విజయం కోసం మేము పనిచేస్తాము.
--తేజ్ ప్రతాప్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ
ములాయం సింగ్ యాదవ్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్లో కొనియాడారు. సంధ్యా యాదవ్ మా పార్టీ తరఫున పోటీ చేసున్నారంటే.. మోదీ అభివృద్ధి ప్రణాళికలకు ఆమె మద్దతు ఇస్తున్నారని అర్థం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ప్రతిఒక్కరికీ తమ సొంత మార్గాన్ని ఎన్నుకునే హక్కు ఉంటుంది.
--ప్రదీప్ చౌహాన్, భాజపా నేత
ఇదీ చదవండి: 'చమురు ధరలపై ప్రధాని మాట్లాడరేం?'