ETV Bharat / bharat

తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్లు - మంచి నిర్ణయమే తీసుకుంటారు : మంత్రి కేటీఆర్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 6:47 AM IST

Minister KTR Interview With Etv Bharat
Minister KTR Interview With Etv Bharat

Minister KTR Interview With Etv Bharat : తమకు పోటీ కాంగ్రెస్ తోనేనని.. బీజేపీ ఖాతా కూడా తెరవదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారు. తమకు గతంలో వచ్చిన 88 కన్నా ఒకటి, రెండు సీట్లు ఎక్కువే వస్తాయని.. వెయ్యి శాతం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గెలవాలని అనుకుంటోందని.. బీఆర్ఎస్ తెలంగాణను గెలిపించాలని కోరుకుంటోందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సాధించింది చాలా ఉందని.. సాధించాల్సి ఇంకా ఉందని.. అందుకే కేసీఆర్ ను సీఎంను కొనసాగించాలని ఈటీవీ భారత్ ముఖాముఖిలో కేటీఆర్ కోరారు.

Minister KTR Interview With Etv Bharat : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మిగతా పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి.. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ఎందుకంత ధీమాగా ఉంది? కాంగ్రెస్‌ గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్‌ ఏమంటున్నారు? అవినీతి ఆరోపణలపై జవాబేంటి?

ప్రశ్న : ఆర్మూరులో ప్రచారం సందర్భంగా ప్రమాదం అందరిలో ఆందోళన కలిగించింది. అసలేం జరిగింది అక్కడ?

కేటీఆర్ : సిరిసిల్లలో నామినేషన్ వేసిన తర్వాత జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆర్మూరు వెళ్లాను. అక్కడి నుంచి కొడంగల్, ఆ తర్వాత హైదరాబాద్ లో కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నందున.. తొందరగా వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. చిన్న గల్లీ కావడం.. వేగంగా వెళ్తూ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల రెయిలింగ్ విరిగింది. నాకు పెద్దగా ఏమీ కాలేదు. ఎంపీ సురేష్ రెడ్డికి, జీవన్ రెడ్డికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇదంతా జీవితంలో భాగమే.

ప్రశ్న : 2014లో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు. 2018లో బంగారు తెలంగాణ నిర్మాణం కొనసాగాలంటే తమకు ఓటేయాలన్నారు. ఇప్పుడు కూడా మీకే ఎందుకు ఓటేయాలి?

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు కళ్లముందున్నాయి. అన్ని రంగాల్లోనూ దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. కొత్త రాష్ట్రాన్ని చంటి పాపను పెంచినట్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూఎన్నో అద్వితీయ విజయాలు సాధించాం. రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుందనేది.. ఈరోజు మనముందున్న ప్రశ్న. ఎవరి చేతిలో అభివృద్ధి, సంక్షేమం నిరాటంకంగా సాగుతుందో ఆలోచించాలి.

కాంగ్రెస్, బీజేపీ మమ్మల్ని దూషించడం, నిరాధార ఆరోపణలు చేయడం తప్ప.. తెలంగాణ ఎలా ఉండాలో చెప్పడం లేదు. పది, ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో దీర్ఘకాలిక వ్యూహం ఆ పార్టీలకు లేదు. రాష్ట్రానికి ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ మాత్రమే. తెలంగాణను అనుకున్న స్థాయికి నడపగల నాయకుడు కేసీఆర్. అక్కడక్కడ చిన్న చిన్న అలకలు, అసంతృప్తులు ఉండొచ్చు. కానీ ఎంత అలిగినా.. గులిగినా.. నారాజ్ అయినా మన వాళ్లపైనే కదా. సమర్థతకు, సుస్థిరతకు, దక్షత గల నాయకత్వానికి ఓటేయాలని కోరుతున్నాం.

ప్రశ్న : అవకాశం ఇస్తే అంతకంటే ఎక్కువే చేసి చూపిస్తామని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. వారిని ఎందుకు విశ్వసించకూడదు?

ఆ రెండు పార్టీలకు మాకంటే ఎక్కువే అవకాశాలిచ్చారు. పదకొండుసార్లు అవకాశం పొందిన కాంగ్రెస్ పనిచేసుంటే.. కేసీఆర్ సీఎం అయ్యే వరకు సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు. తాగునీటి అవసరాలు ఎందుకు తీర్చలేదు. పల్లెలు, పట్టణాలు ఎందుకు అభివృద్ధి చేయలేదు. సంక్షేమం కూడా సంతృప్తికరంగా ఎందుకు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త సరుకేమీ కాదు. కొత్త సీసాలో పాత సారానే. సీల్డు కవర్లో సీఎంలు, పదవుల కోసం కొట్లాటలు. ఇరవై నాలుగు గంటలు కూరగాయలు అమ్ముకునే ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అదేం ఉపాధి కల్పన విధానమో అర్థం కాలేదు. విజన్, ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహం లేని పార్టీకి అప్పగిస్తే ఏమవుతుందో.. కర్ణాటకలో కళ్లముందే కనబడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని నారాయణపేట, కొడంగల్ లో కన్నడ రైతులు వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారు. అయిదుగంటల కరెంటిస్తున్నారని, చెరువులు, బోర్డు ఎండిపోతున్నాయని కోరుతున్నారు. కాబట్టి ఇరవై నాలుగ్గంటల కరెంటు అందుకుంటున్న తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అయిదుగంటల విద్యత్ ఇస్తున్నామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా చెప్పారు. అన్నీ పంచి పెడుతున్నాం..అభివృద్ధికి డబ్బుల్లేవని బెంగళూరులో ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. సమతూకంతో కూడిన నమూనాను ఆవిష్కరించి.. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ముందుకు పోతోంది.

బీజేపీకు కూడా కేంద్రంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చారు. వారందరినీ చూసి అర్థం చేసుకున్న తర్వాతే మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. కష్టపడి నిర్మించుకున్న తెలంగాణను ఎవరిచేతిలో పెట్టాలో ఆలోచించవద్దా.. ఎవరి చేతిలో పడితే వారి చేతిలో పెట్టేద్దామా.. 55 ఏళ్లు వేధించి, ముంచి, చావులకు కారణమైన కాంగ్రెస్ చేతిలో పెట్టాలని ఆలోచిస్తామా.. కళ్లముందు కనిపించేవి నమ్మండి.. సోషల్ మీడియాలో ప్రచారం కాదు.

ప్రశ్న : కాంగ్రెస్ అనగానే.. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ అంటున్నారు. కానీ అక్కడా, ఇక్కడా పరిస్థితులు వేర్వేరు కదా..?

కర్ణాటక, ఛత్తీస్‌గఢే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంటి.. కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎండిన చెరువులు. వ్యవసాయాన్ని దండగ అనే పరిస్థితిని తెచ్చింది కాంగ్రెస్. తన్నల ఆత్మహత్యలు, గీతన్న అరెస్టులు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లు, 55 ఏళ్లల్లో జీవన విధ్వంసం చేసి.. కుప్ప చేసి పెట్టి పోయింది కాంగ్రెస్. కేసీఆర్ తెలంగాణను పునర్మిస్తూ.. భారతదేశంలో సమున్నత స్థాయిలో నిలబెట్టారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌తో పోల్చాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మమ్మల్ని ఆరోపిస్తున్నప్పుడు.. పక్కన ఉన్నది మీ ప్రభుత్వం ఏం చేస్తోందని అంటున్నాం. ఆరు గ్యారంటీలు అంటున్నారు.. పక్కన ఎక్కడైనా ఇస్తున్నారా అని చెబుతూ.. కర్ణాటక గురించి చెప్పాలి కదా..

ప్రశ్న : సిట్టింగు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. పలువురు పార్టీని వీడివెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి మీ ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించదా?

కేసీఆర్ చెప్పితే కట్టుబడి ఉంటారు. సిట్టింగులకు ఇస్తామంటే చాలా మంది నమ్మలేదు. ప్రకటించిన తర్వాత కూడా బీఫామ్ లు ఇస్తారా అన్నారు. అసంతృప్తి అక్కడక్కడ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా మా పార్టీలో రోజూ చేరుతున్నారు. మా పార్టీలో 105 మంది ఎమ్మెల్యేలు, బహుళ నాయకత్వం ఉంది. అయినప్పటికీ కేసీఆర్ ఏదో రకంగా గౌరవిస్తారని.. మళ్లీ ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసంతో మా పార్టీలో ఇంకా చేరుతున్నారు.

ప్రశ్న : కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కానీ గత మేనిఫెస్టోల్లోని నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి హామీని నిలబెట్టుకోలేదు. రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదు. ఇప్పుడు చెబుతున్న హామీలకు భరోసా ఏమిటి?

తొంభై శాతం హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రావిర్భావం తర్వాత సర్దుకోవడానికి ఆరు నెలలు, కరోనా రెండేళ్లు, గత ఆరు నెలలుగా ఎన్నికల పరిస్థితి పోగా.. నికరంగా మాకు లభించిన సమయం ఆరున్నరేళ్లు. కొన్ని హామీలు చేయలేదంటున్నారు కానీ.. చెప్పనివి వందలు చేశాం. రైతు రుణ మాఫీ కింద రూ.19, 445 కోట్లలో రూ.14వేల కోట్లు ఖాతాల్లో పడ్డాయి. ఇంకా రూ.5,400 కోట్లు మాత్రమే పడాలి. భూమి లేక దళితులకు మూడెకరాలు అమలు చేయనందుకే.. దళితబంధు వచ్చింది. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండే హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోలేదు. 90 శాతం హామీలు అమలు చేసిన వారిని నమ్మాలా.. 100శాతం చేయని వాళ్లను నమ్మాలా..

ప్రశ్న : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే రూ.3.50లక్షల కోట్లు బడ్జెట్ కావాలి. అది సాధ్యం కాదని మీరు చెబుతున్నారు. మీరిచ్చిన హామీలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి?

మేం అర్థరహితంగా హామీలు ఇవ్వలేదు. ఆలోచనతో, ప్రణాళికతో ఇచ్చాం. దశలవారీగా పెంచుతామన్నాం. కాంగ్రెస్ హామీలు కూడితే రూ.3.50లక్షల లక్షల కోట్లవుతుంది . కానీ మావి అమలు చేయడానికి ఏటా రూ. 30 వేల నుంచి రూ40 వేల కోట్ల భారం పడుతుంది. మేం ప్రభుత్వంలో ఉన్నాం..మళ్లీ వస్తాం కాబట్టి.. బాధ్యతాయతంగా ఇచ్చాం. కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ ఎవరు.రాహుల్ గాందీ ఏహోదాలో హామీలు ఇస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడా.. ఆ పార్టీ సీఎంఅభ్యర్థి ఎవరు. సీల్డు కవర్ లో ఎవరు వస్తారో.. ఎవరు పోతారో తెలియదు. కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదు.. గ్యారంటీలు ఎక్కడివి. కాంగ్రెస్ తెలంగాణను గెలవాలనుకుంటోంది. మేం తెలంగాణను గెలిపించాలనుకుంటున్నాం.

ప్రశ్న : ప్రస్తుతం త్రిముఖ పోరు.. ద్విముఖ పోరుగా మారిందా?

గతంలో బీజేపీ గెలిచిందే ఒక్క సీటు. ఈసారి గోషామహల్ పై పట్టుదలతో ఉన్నాం. తప్పకుండా గెలుస్తాం. బీజేపీ ఏదో ఊహించుకుంటోంది కానీ.. ఖాతా తెరుస్తుందని అనుకోవడం లేదు. కాంగ్రెస్‌తోనే మా పోటీ కానీ.. మాకు గతంలో వచ్చిన 88 సీట్ల కన్నా ఒకటో రెండో ఎక్కువే తప్ప.. తక్కువ రావు.

ప్రశ్న : బీజేపీ జనసేనతో వస్తోంది. కాంగ్రెస్‌తో సీపీఐ, వైఎస్సాఆర్‌టీపీ, టీజేఎస్ కలిశాయి. ఈ సర్దుబాట్ల ప్రభావం ఎలా ఉంటుంది?

సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది. మేం కమ్యూనిస్టులతో పోవాలనుకన్నాం కానీ లెక్క కుదరలేదు. ఒంటరిగానే వెళ్తున్నాం. తెలంగాణ కోసం దేవుడితోనైనా పోరాడే శక్తి ఉన్న కేసీఆర్‌ను ప్రజలే గెలిపించుకుంటారు. కేసీఆర్ ప్రజలకు, ప్రజలపై కేసీఆర్‌కు విశ్వాసం ఉంది.

ప్రశ్న : పదేళ్లయింది కదా.. మరొకరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది?

మార్పు మంచిదే కానీ ఏమార్పు మంచిది కాదు. కాంగ్రెస్ వాళ్లు ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తులు. ప్రభుత్వంలో ఉన్న వారెవరైనా శాశ్వతం కాదు. ఇంతకన్నా మెరుగైన పాలన మోడల్, విజన్ ఉందని చెబితే.. ప్రజలు విశ్వసిస్తే అవకాశం ఇస్తారు. కానీ కారు బాగా నడుస్తోంది. డ్రైవర్ బాగున్నాడు. మార్చే అవసరమేంటి. తెలంగాణను ఎవరు పరిపాలించాలి.. తెలంగాణ వాడా.. దిల్లీ వాళ్లా.

ప్రశ్న : తెలంగాణ వాదులు ఒకవైపు.. తెలంగాణ ద్రోహులు మరోవైపు అంటున్నారు. ప్రచారంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారా?

తెలంగాణ ప్రజలే మా కేంద్ర బిందువు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం అందుకే పార్టీ పేరు మార్చక తప్పలేదు. కానీ డీఎన్ఏ, జెండా, ఎజెండా, నాయకుడు, గుర్తు మారలేదు.

ప్రశ్న : కుటుంబ పాలన, అవినీతి, అహంకార వైఖరి అనే అంశాలను మీ ప్రత్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు?

చెప్పడానికి ప్రజా సమస్యలు లేక ఆ ప్రచారం చేస్తున్నారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వచ్చి కుటుంబపాలన అంటే ఎంత చండాలంగా ఉంటుంది. అవినీతిపై ఒక్క ఆధారం ఉంటే రుజువు చేయండి. జైళ్లో వేయండి వద్దంటున్నామా. ఒకవేళ చేస్తే మోదీనేనా వదిలిపెట్టేది. అహంకారం, నియంతృత్వం ఉంటే రేవంత్ రెడ్డి బయట ఉంటారా. తెలంగాణలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కవైపోయింది. వేరే రాష్ట్రాల్లో నోరు విప్పే పరిస్థితి ఉందా.. ప్రతిపక్షాల దూషణలు ఎక్కువయ్యాయి. దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.

ప్రశ్న : తమ గ్రాఫ్ పెరిగినందుకే ఐటీ దాడులు చేస్తున్నారని.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటే అనేందుకు ఇది నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది?

ఎవరో ఎవరిపైనో దాడి చేస్తే మాకు అంటకడతామంటే ఎలా. రాహుల్, సోనియాను నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్టు చేయలేదు కదా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎంత గట్టి సంబంధం ఉందంటే.. కరీంనగర్, కోరుట్ల, గోషామహల్‌లో.... బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్ కోసం కాంగ్రెస్ అత్యంత బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. ఆ ముగ్గురికీ డిపాజిట్లు గల్లంతవుతాయి.

ప్రశ్న : కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమేంటి? లోపమెక్కడ?

ఒక బ్యారేజీలో ఒకటో, రెండో పిల్లర్ల వద్ద సమస్య తలెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంట 22 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, వందల కిలోమీటర్ల టన్నెళ్లు, వేల కిలోమీటర్ల కెనాల్స్. గతంలో ప్రకాశం, ధవళేశ్వరం కడెం, నాగార్జునసాగర్‌లో ఈ సమస్య వచ్చింది. మేడిగడ్డ ఖర్చు రూ.1839 కోట్లు, కానీ రాహుల్ వచ్చి రూ.లక్ష కోట్లు వృథా అంటున్నారు. ప్రజలపై భారం పడకుండా పునర్మిస్తామని ఎల్అండ్ టీ ప్రకటన ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చే రూ. 80వేల కోట్లయితే లక్షల కోట్లు తినేశారంటున్నారు. రాహుల్ గాంధీని ముద్ద పప్పు అనకుండా ఇంకేం అనాలి.

ప్రశ్న : రాజకీయ ఆరోపణలు సరే. కానీ ఎన్డీఎస్ఏ కూడా రిపోర్టు ఇచ్చింది కదా..?

అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు. ఎన్డీయే రిపోర్టు. బీజేపీ కార్యాలయంలో వండి వార్చిన వంటకం అది. మార్చిలో బ్రిడ్జి కూలి 130 మంది చనిపోయినా రిపోర్టు ఉండదు. ఎవరూ బాధ్యత తీసుకోరు కానీ ఇక్కడ మాత్రం రెండు రోజుల్లో రిపోర్టు వస్తుందా..?

ప్రశ్న : ఈ ఎన్నికల్లో ధరణి ఒక ప్రచారాస్త్రంగా మారింది. పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అందులోని సమస్యలకు పరిష్కారమేంటో చెప్పడం లేదు ఎందుకు?

ఎలుకలు ఉన్నాయని ఇళ్లు తగలబెట్టుకోం కదా. భూ రికార్డుల్లో అవినీతిని, కుంభకోణాలను బద్దలు చేసిన విప్లవాత్మక పథకం తెచ్చింది కేసీఆర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు లంచం లేనిదే రిజిస్ట్రేషన్ కాలేదు. దళారులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, వివాదస్పద భూములను రాజకీయం చేసే రేవంత్ రెడ్డి వంటి వాళ్లకే ఇబ్బంది. మిగతావాళ్లకు లాభమే తప్ప నష్టమేం లేదు. లోపాలు ఉండొచ్చు. కొన్ని సరిదిద్దాం. ఇంకా సరి చేస్తాం. మొత్తమే ఎత్తేసి మళ్లీ దళారుల స్వైర విహారం కావాలని కాంగ్రెస్ కోరుకుంటోందా.. రైతులు నిర్ణయం తీసుకోవాలి

ప్రశ్న : పెద్దరైతులకు రైతుబంధుపై పునస్సమీక్షిస్తామన్నారు. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనకుంటున్నారు. కౌలు రైతుల విషయంలో మీ వైఖరిలో ఏదైనా మార్పు ఉందా?

రైతుబంధును సమీక్షిస్తామన్నాను. పెద్ద రైతులకు రైతుబంధుపై ఆరోపణలు వస్తున్నందున భవిష్యత్తులో ఆలోచిస్తామన్నాను అంతే. కౌలు రైతుల విషయంలో మా వైఖరిలో మార్పు లేదు. రైతుబంధు యజమానికి ఇస్తాం. యజమాని, కౌలుదారులు పంచుకుంటారు.

ప్రశ్న : అభివృద్ధి అంటే పెట్టుబడులు, ఐటీ చూపిస్తారు. కానీ అదే హైదరాబాద్‌లో వరదల్లో మునిగిపోతున్న బస్తీలు, కాలనీలు కూడా ఉన్నాయి కదా?

జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా ఉత్పన్నమయ్యే సవాల్ అది. మళ్లీ గెలిచాక రూ.15వేల కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్ భూతల స్వర్గం అయిందనడం లేదు. ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీ, మంచినీళ్లు, కరెంటు, డ్రైనేజి బాగు చేశాం. ఇంకా గ్యాప్ ఉంది. సాధించింది చాలా ఉంది సాధించాల్సింది కూడా చాలా ఉంది. అందుకే మళ్లీ కొనసాగించాలని కోరుతున్నాం.

ప్రశ్న : గ్రూప్స్ నిర్వహించలేకపోవడంతో నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని ఎలా అధిగమిస్తారు?

2.32లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. 1.60లక్షల నియామకాలు పూర్తయ్యాయి. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. ప్రశ్నపత్రం లీక్ చేసింది.. బండి సంజయ్ అనుచురుడు కోర్టుకెళ్లింది రేవంత్ రెడ్డి అనుచురుడు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాకన్నా ఎక్కువ నియామకాలు చేసిన ప్రభుత్వం ఏదయినా ఉందా.. నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి. టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన చేయాల్సి ఉంటే చేస్తాం. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. నేను బాధ్యత తీసుకుంటా.

ప్రశ్న : తెలంగాణ ధనిక రాష్ట్రం అంటారు. తలసరి ఆదాయంలో టాప్ అంటారు. అలాంటి అప్పులు ఎందుకు?

అప్పులు చేయడంలో తప్పేంటి. భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడి పెడుతున్నాం. విద్యుత్ మెరుగుపరుచుకోవడానికి.. మిషన్ భగీరథ కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం, మెడికల్ కాలేజీల కోసం అప్పు తెచ్చాం. అప్పులో దేశంలో కింది నుంచి అయిదో స్థానంలో ఉన్నాం. ఎఫ్ఆర్బీఎం పరిమితికి అనుగుణంగానే అప్పులు ఉంటాయి. పద్నాలుగు మంది ప్రధానులు రూ. 56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ రూ. 112 లక్షల కోట్లు అప్పు చేశారు.

ప్రశ్న : చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటి?

ఏపీలో రెండు పార్టీల మధ్యం వైరం అది. ఆ రాష్ట్ర రాజకీయానికే పరిమితమైన అంశం. ఆందోళనకు చేయడానికి ధర్నా చౌక్ ఉంది. మేం విజయవాడ, ఛత్తీస్‌గఢ్‌లో ధర్నాలు చేస్తే అక్కడ పోలీసులు ఊరుకుంటారా. అదే అన్నాను. నేను చంద్రబాబును కించపరిచినట్లు వక్రీకరించారు. కుమారుడిగా లోకేశ్‌ బాధను అర్థం చేసుకోగలనని కూడా చెప్పాను. దానిపై మాకు ఏ వైఖరి లేదు. ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. మేం ఒక వైపు ఎందుకు తీసుకెళ్లాలి.

ప్రశ్న : కేటీఆర్‌ను సీఎం చేస్తామంటూ కేసీఆర్ తన వద్దకు వచ్చారని మోదీ చెప్పారు. దానిపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు?

సినిమా కథలకు కేసీఆర్ ఎందుకు స్పందించాలి. స్పందించడం అనవసరం అనుకున్నారు. మా పార్టీలో నాయకత్వం ఎవరుండాలో మోదీని ఎందుకు అడుగుతాం. మా ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. కేసీఆర్ మా నాయకుడు. రెండేళ్ల తర్వాత మాట్లాడటం రాజకీయంగా బురద చల్లడం తప్ప మరేంటి.

ప్రశ్న : ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అని కేసీఆర్ అన్నారు. కానీ భవిష్యత్తులో మీరు జాతీయ పార్టీగా ఇతర రాష్ట్రాల్లో ఎలా వెళ్తారు?

మహారాష్ట్రలో జెండా పాతే వరకు.. మాది ప్రాంతీయ పార్టీ కిందే లెక్క. కాంగ్రెస్, బీజేపీ కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే.

ప్రశ్న : హంగ్ వస్తే ఎవరితో కలుస్తారు?

తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన నిర్ణయమే తీసుకుంటారు. వెయ్యి శాతం మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు

KTR Chit Chat : సీఎం పదవిపై నాకు ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేవు: కేటీఆర్‌

'కాంగ్రెస్​కు సీఎంలు దొరికారు - ఓటర్లే దొరకట్లేదు, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే హైదరాబాద్​ అభివృద్ధి ఆగిపోతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.