Militants Killed in Srinagar: జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో గత సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి, ఓ జవాను మృతికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు. ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.
'ఏప్రిల్ 4న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిపిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ముందస్తు సమాచారంతో బిషేంబర్ నగర్లో సోదాలు చేశాము. ఆ సమయంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి కారణంగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.' అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఆపరేషన్ను భద్రతా దళాల విజయంగా ఆయన పేర్కొన్నారు. అమాయక ప్రజలపై , జర్నలిస్టులపై దాడి చేస్తే తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినవారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
ఏప్రిల్ 4న ఘటన: శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఉగ్రవాదంతో విసిగిపోయారు.. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుతోందని అన్నారు ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే. 20-25 ఏళ్ల యువతను ఉగ్రవాదంలోకి దించడానికి 'వైట్ కాలర్ టెర్రరిస్టులు' తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హింసతో ఏం సాధించలేమని యువత అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ఉగ్రవాదంలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన చెప్పారు. ప్రజలు ఉగ్రవాదంతో విసిగిపోయారని, కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల పట్ల ఉన్న కాస్త మద్దతు కూడా అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్మీ కమాండర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై హిజ్రా అత్యాచారం