పరిస్థితి మరీ చేజారిపోకముందే భాజపాతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజీ పడటం మేలని శివసేన శాసనసభ్యుడు ప్రతాప్ సర్నాయక్ గట్టిగా అభిప్రాయపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై గతంలో దృష్టి సారించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను ఆయన ఈ మేరకు అభ్యర్థించారు. కేంద్ర సంస్థలు సృష్టిస్తున్న సమస్యల నుంచి తనలాంటి నేతల్ని రక్షించుకునేందుకు ఇలా చేయడం అనివార్యమని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 10న ఠాక్రేకు ఆయన లేఖ రాశారు.
ఇంకా దోస్తులమే..
శివసేన శ్రేణుల్లో విభేదాలు తెచ్చి, బలహీనపరిచేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నిస్తున్నాయని సర్నాయక్ ఆరోపించారు. భాజపాతో పొత్తు లేకపోయినా సేన-భాజపా నేతల మధ్య వ్యక్తిగత, సామరస్యపూర్వక సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు.
శాశ్వత పొత్తు కాదు..
ఈ లేఖ వ్యవహారం శివసేన అంతర్గత విషయమని, అలాంటివాటిపై తాము స్పందించబోమని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడింది ఐదేళ్ల కోసమేనని, అదేమీ శాశ్వత పొత్తు కాదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేవరకు ఠాక్రేకు అండగా నిలుస్తామని చెప్పారు.
సర్నాయక్ జైలుకే..
గత 18 నెలల నుంచి భాజపా చెబుతున్న విషయాన్నే సర్నాయక్ పునరుద్ఘాటించారని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్ర కాంత్ పాటిల్ స్పందించారు. సర్నాయక్ వంటి వారు జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా నేత కిరీట్ సోమయ్య చెప్పారు.
ఇదీ చూడండి: మోదీపై శివసేన స్వరం మారిందా?