ETV Bharat / bharat

'భాజపా ప్రభుత్వ ఆలోచనతో రైతులంతా ధనికులవుతారా?'

author img

By

Published : Oct 10, 2021, 7:42 AM IST

lakhimpur kheri news
లఖింపుర్​ ఖేరి సంఘటన

దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌. గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా భరోసా కల్పించాలని డిమాండ్‌ చేసిన మోదీ.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మరోవైపు లఖింపుర్‌ ఖేరి హింస ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే జరిగిందని.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రను పదవి నుంచి తొలగించాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు.

అన్నదాతల ఉద్యమంపై కుట్రలో భాగంగానే లఖింపుర్‌ ఖేరి ఘటన చోటుచేసుకుందని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆరోపించింది. దేశ రైతు ఉద్యమ చరిత్రలో ఈ మారణకాండ బాధాకర అధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొంది. ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ రైతు సంఘాల నేతలు రాకేశ్‌ టికాయిత్‌, హన్నన్‌ మొల్లా, దర్శన్‌ పాల్‌, యోగేంద్ర యాదవ్‌, జోగేంద్ర సింగ్‌ ఉగ్రహాన్‌, హర్‌పాల్‌ సింగ్‌ బిలారి, సురేష్‌ కౌత్‌, అభిమన్యు కోహార్‌ తదితరులు దిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అజయ్‌ మిశ్రను కేంద్ర సహాయమంత్రి పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. "లఖింపుర్‌ ఖేరి హింస ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రకు నేరచరిత్ర ఉంది. ఆయన తొలుత రైతులను బెదిరించారు. తర్వాత ఆయన కుమారుడు ఆశిష్‌ తన సహచరులతో కలిసి రైతులను వాహనాలతో తొక్కించి చంపేశారు. ఈ మేరకు స్పష్టమైన ఆధారాలున్నా, భాజపా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈనెల 11వ తేదీలోగా మా డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే దేశ వ్యాప్తంగా ఈనెల 12 నుంచి 26 వరకూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని వారు వెల్లడించారు.

అది చర్యకు ప్రతిచర్య మాత్రమే..

లఖింపుర్‌ ఘటనలో భాజపా కార్యకర్తలను చంపినవారిని దోషులుగా చూడొద్దని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు. నిరసనకారులపైకి వాహనాలు దూసుకెళ్లడం వల్లే.. ఆందోళనకారులు స్పందించారని, ఇది చర్యకు ప్రతిచర్య మాత్రమేనని పేర్కొన్నారు.

రైతు ఉద్యమంలో 750 మంది మృతి

నూతన వ్యవసాయ చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా నెలల తరబడి జరుతున్న పోరాటంలో ఇప్పటివరకూ సుమారు 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు. వీరి మృతి పట్ల ప్రధాని మోదీ పార్లమెంటులో కనీసం విచారమైనా వ్యక్తం చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని భాజపా సర్కారు చెబుతోందని, అది క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే తాము కోరుతున్నామన్నారు.

అయితే, అన్నదాతల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని యూపీకి చెందిన భాజపా ఎంపీ రాజేంద్ర అగర్వాల్‌ కొట్టిపారేశారు. ఇండియాటుడే కాన్‌క్లేవ్‌-2021లో పాల్గొన్న వారిద్దరి మధ్య ఈ మేరకు తీవ్ర సంవాదం నడిచింది. 'ఆగ్రహ బీజాలు: భయాలు-వాస్తవాలు: వ్యవసాయ సంక్షోభ పరిష్కారాలు అన్న అంశంపై వారిద్దరూ మాట్లాడారు.

'దేశాన్ని మోదీ మోసం చేస్తున్నారు'

"అన్నదాతల ఉద్యమం 11వ నెలలోకి ప్రవేశించింది. పోరాటంలో సుమారు 750 మంది రైతులు మరణించడం పై పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడాలి. 2011లో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా భరోసా కల్పించాలని నాటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదే విషయమై ఇప్పుడాయన దేశాన్ని మోసం చేస్తున్నారు. భాజపా ప్రభుత్వ ఆలోచనలతో రైతులంతా ఇప్పుడు ధనికులవుతారా? కనీస మద్దతు ధరకు భరోసా ఇవ్వని ప్రభుత్వాలు కూలిపోయాయి" అని టికాయిత్‌ పేర్కొన్నారు.

టికాయిత్​ అభిప్రాయాలను తిప్పికొట్టేందుకు రాజేంద్ర అగర్వాల్‌ ప్రయత్నించారు. "కొత్త సాగు చట్టాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రైతులకు అభ్యంతరకరమైన ఒక్క అంశమైనా ఈ చట్టాల్లో లేదు. అన్నదాతల ప్రయోజనాల కోసం కాకుండా, కొందరి రాజకీయ స్వార్థం కోసమే ఆందోళన జరుగుతోంది. కొన్ని రాజకీయ పార్టీలతో ఈ ఆందోళనకు సంబంధముంది. ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. రైతులు ఏ మండీలోనైనా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇవి మార్గం తెరిచాయి. కనీస మద్దతు ధర కల్పన చట్టబద్ధ హామీ కాదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Delhi power crisis: దిల్లీలో ఇక రెండు రోజులే.. ఆ తర్వాత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.