వితంతువులకు అండగా నిలిచేందుకు కేరళలోని కాసరగోడ్ జిల్లా అధికారులు కొత్త మొబైల్ అప్లికేషన్ను తీసుకొచ్చారు. 'కూటు' పేరిట రూపొందిన ఈ యాప్.. వితంతువులకు రక్షణ కల్పించడం సహా వారి పురోగతికి తోడ్పడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
జిల్లా పాలనాధికారి డాక్టర్ డీ. సజిత్ బాబు ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది 'కూటు'. వితంతువుల అభివృద్ధి, పునర్వివాహాలకు దోహదపడే ఈ యాప్.. సంబంధిత మహిళలు, వారి తల్లిదండ్రుల సమన్వయంతో అమలవుతూ, స్థానిక మహిళా రక్షణాధికారి పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీనితో.. జిల్లాలోని 50వేల మందికిపైగా వితంతువులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు ఈ యాప్లో సుమారు 5వేల మంది మహిళలు చేరారన్న అధికారులు.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు అనుగుణంగా వారికి వృత్తి, నైపుణ్య శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
పునర్వివాహంపై ఆసక్తి కలిగిన సుమారు 100 మంది వితంతువులు కూటులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సదరు మహిళలను పెళ్లిచేసుకునేందుకు పురుషుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. పరస్పర అంగీకారంతో వారికి వివాహం కుదుర్చుతారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులోనే 30 లక్షల టీకాలతో భారత్ రికార్డ్