ETV Bharat / bharat

JP Nadda Amit Shah Rajasthan Election : రాజస్థాన్​పై బీజేపీ హైకమాండ్​ ఫోకస్​.. రాత్రంతా షా, నడ్డా చర్చలు.. ఎన్నికల వ్యూహం రెడీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 12:02 PM IST

Updated : Sep 28, 2023, 1:01 PM IST

BJP Charts Strategy For Rajasthan Assembly Polls
JP Nadda Amit Shah Rajasthan Visit Today

JP Nadda Amit Shah Rajasthan Election Meet : త్వరలో రాజస్థాన్​లో జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో బుధవారం జయపుర్​లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పాల్గొంది. ఎన్నికలే అజెండాగా ఈ భేటీ జరగ్గా.. ఇందులో కీలక వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

JP Nadda Amit Shah Rajasthan Election Meet : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్‌ నాయకత్వంతో రాత్రంతా మంతనాలు జరిపారు. దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం ఈ తెల్లవారుజామున 2 గంటల వరకూ సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరు కేంద్ర మంత్రులను అధిష్ఠానం కోరవచ్చనే ఊహాగానాల నడుమ సుధీర్ఘంగా చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో బీఎల్ సంతోష్ సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.

ఈ ఎంపీలను బరిలోకి!
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్​, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ సహా కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జయపూర్ చేరుకున్న అమిత్ షా, నడ్డా విమానాశ్రయం సమీపంలోని ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించారు. తొలి 15 నిమిషాలు మాజీ సీఎం వసుంధరరాజేతో వారు చర్చించినట్లు సమాచారం. తర్వాత మిగిలిన నాయకులతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మెవాడ్‌, వాగడ్, సేఖావతి, హడౌతి, మార్‌వాడ్‌ ప్రాంతాల్లో మోహరించే అభ్యర్థులు, లోక్‌సభ ఎన్నికలపైనా చర్చించినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానమే సుప్రీం అని అంతా కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు అమిత్ షా, నడ్డా సందేశం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • VIDEO | Union Home minister Amit Shah and BJP president JP Nadda leave from Lalit Hotel in Jaipur after concluding their Rajasthan visit. pic.twitter.com/LqlKfwlR4u

    — Press Trust of India (@PTI_News) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం అభ్యర్థి లేకుండానే!
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కీలక నాయకులంతా కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ఐక్యతే ప్రధానమని చాటేలా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

మాజీ సీఎంకు నో ఛాన్స్​!
మరోవైపు రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పలువురు నేతల పేర్లను ఈ సమావేశంలో ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాజ్యసభ ఎంపీ డా.కిరోడి లాల్ మీనా, లోక్‌సభ ఎంపీలు దియా కుమార్, రాజ్యవర్ధన్ రాఠోడ్, సుఖ్‌వీర్ సింగ్ జౌన్‌పురియా తదితరులు సీఎం రేసులో ఉండనున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే పార్టీలో ప్రముఖ హోదాలో ఉన్నప్పటికీ సీఎం క్యాండిడేట్స్​ లిస్టులో ఆమె పేరు లేదని సమాచారం.

కర్యకర్తలు కృషి చేయాలి!
ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం గ్రామాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయాలని.. గణనీయమైన మెజారిటీని సాధించడానికి కార్యకర్తలు పలు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే అవినీతి, నిరుద్యోగం, మహిళల భద్రత సహా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించడంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ప్రచారం చేసేలా రాష్ట్ర పార్టీ నేతలు కూడా సమాయత్తం కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్దేశించింది.

తుది నిర్ణయం కమిటీదే!
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ఎంపీలు సైతం ఎన్నికల్లో పోటీ చేయించాలని పలువురు సూచించగా.. తుది నిర్ణయం మాత్రం కేంద్ర ఎన్నికల కమిటీదేనని అధినాయకత్వం తేల్చిచెప్పింది. కాగా, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అలాగే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ప్రమాణాలు, కార్యక్రమాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చించినట్లు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ప్రచారానికి మోదీ!
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం సహా పరివర్తన్ సంకల్ప్ యాత్ర వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఇటీవలి కాలంలో పార్టీలో వర్గపోరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అమిత్ షా.. పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Last Updated :Sep 28, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.