ETV Bharat / bharat

పెళ్లికి అంతా సిద్ధం.. ఇల్లు ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం.. బోరుమన్న యువతి

author img

By

Published : Jan 13, 2023, 4:18 PM IST

Updated : Jan 13, 2023, 5:58 PM IST

joshimath-shrunk-more-than-5-cm-in-12-days-young-woman-wedding-stopped-due-to-cracks-in-uttarakhand
జోషిమఠ్​లో పగుళ్ల కారణంగా ఆగిపోయిన యువతి పెళ్లి

Joshimath Sinking : ప్రముఖ పర్యటక క్షేత్రమైన ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మార్చిలో వివాహం చేసుకోనున్న ఓ యువతి ఇంటిని కూడా ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెళ్లి చేయాలని ఆ యువతి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లికి అంతా సిద్ధం.. ఇల్లు ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

Joshimath Sinking : ఉత్తరాఖండ్‌లో పర్యటక క్షేత్రమైన జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పట్టణం పురాతనమైన శిలలపై నిర్మితమై ఉండటం, భూగర్భంలో జలప్రవాహం, నేల పొరల్లోకి నీరు చేరి పటుత్వం కోల్పోవడమే ప్రధాన కారణాలుగా చెపుతున్నారు నిపుణులు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్కడ నివాసం ఉండే వారిని ఖాళీ చేయిస్తోంది. వారందరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇళ్లను విడిచివెళుతూ అక్కడి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. దెహ్రాదూన్​లో నివాసం ఉండే ఓ యువతి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

జ్యోతి అనే యువతి వివాహం జోషీమఠ్‌లో మార్చిలో జరగాల్సి ఉంది. అది వాళ్ల పూర్వీకుల సొంతూరు. అక్కడే.. జ్యోతి వివాహం చేయాలన్నది ఆమె కుటుంబ సభ్యుల కోరిక. పెళ్లి కోసమే వారంతా జోషీమఠ్‌కు వచ్చారు. అయితే అక్కడికి చేరుకున్న వారికి అధికారులు షాక్​ ఇచ్చారు. ఇల్లు ఖాళీ చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూతురి పెళ్లి ఎలా చేయాలని, జ్యోతి తల్లి కన్నీరు పెట్టుకుంటోంది. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఎదురైందని తన బాధను వెళ్లబోసుకుంటోంది.

joshimath-shrunk-more-than-5-cm-in-12-days-young-woman-wedding-stopped-due-to-cracks-in-uttarakhand
కన్నీరు పెట్టుకుంటున్న యువతి తల్లి
joshimath-shrunk-more-than-5-cm-in-12-days-young-woman-wedding-stopped-due-to-cracks-in-uttarakhand
జ్యోతి, పెళ్లి కూతురు

"నా పెళ్లి ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సి ఉంది. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కావల్సిన సామగ్రినంతా కొన్నాం. బంధువులందరికి పెళ్లి గురించి చెప్పాం. మేమంతా దెహ్రాదూన్​ నుంచి వచ్చే సరికి ఇంటికి రెడ్​ మార్క్​ వేసి ఉంది. సాయత్రం అధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. ఇప్పుడు మేం చేయాలి."

-జ్యోతి, పెళ్లి కూతురు

ఉత్తరాఖండ్‌లో మరిన్ని ప్రాంతాలు..!
ఆ రాష్ట్రంలోని పలు పట్టణాల్లో భూమి కూడా ఏటా కొంత మేరకు కుంగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జోషిమఠ్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఏటా 2.5 అంగుళాల మేరకు భూమిలోకి దిగిపోతున్నట్లు దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ గుర్తించింది. జులై 2020 నుంచి మార్చి 2022 వరకు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి.. ఇక్కడి లోయ ప్రదేశం మొత్తం మెల్లగా కుంగిపోతున్నట్లు కనుగొంది. జోషిమఠ్‌లో పరిస్థితికి ఎన్‌టీపీసీ ప్రాజెక్టు కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

పర్వతాలతో నిండిన రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌ లాంటి పరిస్థితే.. మరికొన్ని కీలక నగరాలు, గ్రామాల్లో ఉంది. పౌరి, ఉత్తరకాశీ, బాగేశ్వర్‌, టిహరి గఢవాల్‌, రుద్రప్రయాగ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. జోషిమఠ్‌ పరిస్థితి చూసి ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.

ఇస్రో విడుదల చేసిన జోషీమఠ్ ఉపగ్రహ చిత్రం​
  • టిహరి గఢవాల్‌: టిహరి జిల్లాలోని అటలి గ్రామం నుంచి రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ వెళుతుంది. ఇది నరేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇళ్లు పగుళ్లిచ్చాయి. ఇక్కడ టన్నెల్‌ పనుల కోసం పేలుళ్లు చేపట్టడం కూడా సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
  • పౌరి: ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న శ్రీనగర్‌లోని హెడల్‌ వీధి, ఆశిష్‌ విహార్‌, నర్సరీ రోడ్‌లో ఈ పరిస్థితి నెలకొంది. రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ కోసం చేపట్టే పేలుళ్లే దీనికి కారణమని చెబుతున్నారు. పేలుళ్లను ఆపి సాధారణంగా పనులు చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
  • బాగేశ్వర్‌: ఇక్కడ కోప్‌కోట్‌ వద్ద కర్‌బగ్డ్‌ గ్రామంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ గ్రామంపై నిర్మించిన హైడ్రోపవర్‌ ప్రాజెక్టు టన్నెల్‌కు రంధ్రాలు పడి నీరు లీకవుతోంది. దీంతో ఈ గ్రామస్థులు జలప్రళయం ఎప్పుడొస్తుందో అని భయపడుతున్నారు. ఈ గ్రామం సమీపంలోనే రేవతి నది ప్రవహిస్తోంది.
  • ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సమీపంలోని మస్తాది, బట్వాడీ గ్రామాల్లో తరచూ కొండచరియలు విరిగి పడుతున్నాయి. మస్తాది గ్రామంలోని ఇళ్లు మెల్లగా కుంగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 1991, 1995, 1996ల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికీ తరచూ పర్వతాలపై నుంచి రాళ్లు పడుతుంటాయి. ఇక్కడ భూభాగంలో సర్వేలు నిర్వహిస్తామని జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి దేవేంద్ర పట్వాల్‌ పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయితే గానీ గ్రామస్థులకు పునరావాసం లభించదు.
  • రుద్రప్రయాగ్‌: రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ సొరంగ నిర్మాణంతో ఇక్కడి మరోడ గ్రామంలో చాలా ఇళ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈ కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా గ్రామస్థులను తరలించకపోతే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
  • ఇవీ చదవండి:
  • జైలు నుంచి విడుదలైన గర్భిణీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి మృతి
  • పట్టాలు తప్పిన రైలు.. ప్రయాణికులంతా లక్కీగా..
Last Updated :Jan 13, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.