ETV Bharat / bharat

దసరా బొనాంజా.. వారికి 78 రోజుల బోనస్​.. DA 4% పెంపు.. పేదలకు రేషన్​ ఫ్రీ

author img

By

Published : Sep 28, 2022, 5:29 PM IST

Updated : Sep 28, 2022, 5:49 PM IST

central government will give 78 days bonus to railway employees and  extended free ration scheme by 3 months
central government will give 78 days bonus to railway employees and extended free ration scheme by 3 months

పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్‌లో మొదలైన ఈ పథకాన్ని డిసెంబర్‌ 31 వరకు కొనసాగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మరోవైపు, రైల్వే ఉద్యోగులకు కూడా కేంద్రం.. దసరా బొనాంజా అందించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్​గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Free Ration Extended: పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్‌ పథకాన్ని మరో 3నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.44,700 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి పేదలకు ఊరట కల్పించనుంది. దాంతోపాటు త్వరలో జరిగే గుజరాత్‌ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

80 కోట్ల మంది పేదలకు..
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ పథకం సెప్టెంబరు 30న ముగియనుండడం వల్ల డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు కేంద్రం 2020 ఏప్రిల్‌ లోప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను ప్రారంభించింది.

రైల్వే ఉద్యోగులకు దసరా బొనాంజా..
Indian Railway bonus news: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా బొనాంజా అందించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్​గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద ఈ ప్రయోజనాన్ని అందించనుంది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ బెనిఫిట్ లభిస్తుంది. 11.56 లక్షల మంది ఉద్యోగులకు ఊరట కలుగనుంది. బోనస్ ప్రకటన నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల మేర భారం పడనుంది.

దిల్లీ, ముంబయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి..
Railway Stations Development: దిల్లీ, ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌, అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్లను రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రోజుకు 50 లక్షల మంది ప్రయాణించే 199 రైల్వే స్టేషన్లను తొలిదశలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 47 రైల్వేస్టేషన్లకు సంబంధించి టెండర్లు పూర్తికాగా 32 రైల్వే స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. దిల్లీ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను మూడున్నరేళ్లు, ముంబయి, అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్ల పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు.

నాలుగు శాతం డీఏ పెంపు..
Employees DA Hike: మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ఇచ్చింది. కరవుభత్యం-డీఏ నాలుగు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 41.85 లక్షల మంది ఉద్యోగులు, 69.76లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. పెంచిన డీఏను జులై ఒకటో తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ఖజానాపై ఈ ఏడాది రూ.21,421కోట్ల భారం పడనుంది.

ఇవీ చదవండి: 'క్రిమినల్' నేతలకు చెక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం?.. కేంద్రానికి నోటీసులు

తొలి దేశీయ పిస్తోల్.. సైన్యం కోసం అసాల్ట్ రైఫిల్.. యువకుడి ఇండియన్ వెపన్స్!

Last Updated :Sep 28, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.