ETV Bharat / bharat

Road Accident at Kadapa: కడప జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

author img

By

Published : May 15, 2023, 7:09 AM IST

Updated : May 15, 2023, 1:43 PM IST

Fatal road accident in YSR district
కడప జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

07:02 May 15

చిత్రావతి బ్రిడ్జి వద్ద ప్రమాదం

కడప జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

Road Accident in YSR District: తిరుమల శ్రీవారిని దర్శించుకుని... ఆనందంగా ఇంటిదారి పట్టిన కుటుంబసభ్యుల్ని... లారీ మృత్యురూపంలో కబళించింది. మరికాసేపట్లో స్వస్థలం చేరుకోవాల్సిన కుటుంబాన్ని ఊహించని ప్రమాదం పెనువిషాదంలో ముంచేసింది. వైఎస్సార్ జిల్లా కొండాపరం వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ.. తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో... ఏడుగురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా... అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘోర ప్రమాదంతో.. తాడిపత్రి-బళ్లారి ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా... మిగతా వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా అనంతపుం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు చెందిన బంధువులుగా గుర్తించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ కుటుంబం, బళ్లారిలోని మరో కుటుంబం కలిసి తిరుమల శ్రీవారిని దర్శంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. 15 మంది కుటుంబీకులు కలిసి తాడిపత్రి నుంచి తుఫాన్‌ వాహనంలో ఆదివారం తిరుమల వెళ్లారు. శ్రీవారని దర్శనం అయ్యాక ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. తిరుగు ప్రయాణమయ్యారు. మరికాసేపట్లో.. తాడిపత్రి చేరుకుంటామనగా... ఎదురుగా వచ్చిన ఓ లారీ వేగంగా తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. వైస్సార్‌ జిల్లా కొండాపురం మండలం చిత్రావరి వంతెన వద్ద ఈ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఈ ఘోరప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రికి మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉండగా జరిగిన ఈ ప్రమాదం.. ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.

లారీ ఢీకొట్టిన ఘటనలో … తూఫాన్‌ వాహనంలోని ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో తాడిపత్రి లింగాల మండలం తాడిరెడ్డిపల్లెకు చెందిన వాహన డ్రైవర్‌ సుధాకర్‌ రెడ్డి, బళ్లారికి చెందిన కాటసాని సుధ, ఆమె కుమారుడు నిఖిల్‌కుమార్‌ రెడ్డి, సోదరి లక్ష్మీదేవి ఉన్నారు. అలాగే తాడిపత్రికి చెందిన సుభద్ర, సునీల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా మైలవరానికి చెందిన సుమలత.. ప్రమాదంలో మృతిచెందారు. మృతులు కాటసాని సుధ, లక్ష్మీదేవి, సుభద్ర.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.

డ్రైవర్ మినహా అందరూ కుటుంబసభ్యులే. ఇలా ప్రమాదంలో కుటుంబం ఛిన్నాభిన్నం కావడం.. బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది. మృతదేహాలను శవపరీక్ష కోసం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరో ఏడుగురు.. తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మొదట సమీపంలోని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం... అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో మేఘన, శిల్ప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మిగతా ఐదుగురి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. వేగంగా ఢీకొట్టడంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. తూఫాన్‌ వాహనంలోనే ఏడు మృతదేహాలు ఇరుక్కుపోవడంతో.. పోలీసులు స్థానికుల సహాయంతో వెలికితీశారు. మృతులు, క్షతగాత్రులంతా కుటుంబసభ్యులే కావడంతో... తాడిపత్రి, బళ్లారి నుంచి ఆసుపత్రికి వచ్చిన బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :May 15, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.