ETV Bharat / bharat

'వాటిని ఉచితాలని సామాన్యులను అవమానించొద్దు'.. ప్రధానిపై దిల్లీ సీఎం ఫైర్​

author img

By

Published : Oct 23, 2022, 6:11 PM IST

arvind kejriwal
దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

సామాన్యులు, పేదలకు కల్పించే వసతులను ఉచితాలు అని పేర్కొంటూ.. వారిని అవమాన పరచొద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై విమర్శలూ చేసుకుంటున్నాయి. నేపథ్యంలో ధరల పెరుగుదలతో బాధపడుతోన్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అటువంటి వాటిని ‘ఉచితాలు’ అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు. ఉచితాల పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు గిమ్మిక్కులకు పాల్పడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు బదులుగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విధంగా స్పందించారు.

'ధరల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు విద్య, వైద్యం, ఔషధాలు, కరెంటు ఉచితంగా ఎందుకు పొందకూడదు..? రాజకీయ నాయకులు ఎన్నో వసతులు ఉచితంగా పొందుతున్నారు. చాలా మంది ధనికులకు బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తున్నాయి. ఉచితాలు అని పదే పదే చెప్పి సామాన్య పౌరులను అవమానించొద్దు' అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో పీఎంఏవై లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించిన సందర్భంగా మాట్లాడిన మోదీ.. గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావో వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ గిమ్మిక్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల ఆలోచనను ప్రస్తావించారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్నుచెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.