ETV Bharat / bharat

రూ.13 వేల కోట్లతో సైన్యానికి కొత్త శక్తి

author img

By

Published : Sep 29, 2021, 10:32 PM IST

indian army latest news
భారత ఆర్మీ

రూ.13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్​వేర్​ సేకరణ ప్రతిపాదనలకు భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్​హెచ్​ మార్క్-3 హెలికాప్టర్లను రూ.3850 కోట్లతో కొనుగోలు చేయనుంది.

భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ.13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్ సేకరణ ప్రతిపాదనలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్​హెచ్​ మార్క్-3 హెలికాప్టర్లతో పాటు మిలిటరీ ప్లాట్‌ఫామ్స్, హార్డ్‌వేర్ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం జరిగిన.. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) సమావేశంలో వీటి సేకరణకు ఆమోదం తెలిపారు.

హెలికాప్టర్ల సేకరణకు 3,850 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుండగా.. మరో రూ.4,962కోట్లతో రాకెట్ మందుగండు సామాగ్రిని కొనుగోలు చేయనున్నారు. మొత్తం 13,165 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపనుండగా.. వీటిలో దేశీయ సంస్థల నుంచి రూ.11,486 కోట్ల విలువైన మిలిటరీ సామాగ్రి, ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

118 అర్జున ట్యాంకులు

ఆరు రోజుల క్రితం.. 118 ఎమ్​బీటీ(మెయిన్​ బ్యాటిల్​ ట్యాంక్స్​) అర్జున ట్యాంకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ(defence news india). దీని విలువ రూ.7,523కోట్లు.

చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్​ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్​కే-1ఏ కోసం ఆర్డర్లు ఇచ్చింది రక్షణ శాఖ. ఇందులో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ఎమ్​కే-1 వేరియంట్​తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉండనున్నాయి. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు ఈ యుద్ధ ట్యాంకుల్లో ఉంది.

ఇదీ చూడండి: 'లష్కరే ట్రైనింగ్​ తీసుకున్నా.. రూ. 20 వేలు ఇచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.