ETV Bharat / bharat

Defamation Petition on Pawan: పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్

author img

By

Published : Jul 24, 2023, 8:46 PM IST

Updated : Jul 25, 2023, 6:20 AM IST

Pawan
Pawan

criminal defamation petition has been filed against Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలైంది. వాలంటీర్లపై పవన్​ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా ఆవేదనకు గురి చేశాయంటూ ఓ మహిళా వాలంటీర్ విజయవాడ సిటీ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు.

criminal defamation petition has been filed against Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్‌పై విజయవాడ సిటీ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలైంది.శాంతినగర్‌కు చెందిన బగ్గా రంగవల్లి అనే మహిళా వాలంటీర్‌.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలు చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు.. తమను మానసికంగా ఆవేదనకు గురి చేశాయని, ఎటువంటి ఆధారాలు లేకుండానే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

పవన్ వారాహి విజయ యాత్ర.. జనసేనాని గత కొన్ని రోజుల క్రితం వారాహి విజయ యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పవన్ కల్యాణ్.. వివిధ వర్గాల ప్రజలు, వీర మహిళలు, రైతులు, దివ్యాంగులు, యువతతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పవన్ కల్యా‌ణ్‌కు వినతిపత్రాలు అందజేశారు. జనసేన పార్టీ తరఫున ప్రతి సమస్యను పరిష్కరించేందుకే తాను ప్రయత్నిస్తానంటూ పవన్ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొంటూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై, వాటంటీర్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు.

ఏలూరు సభలో పవన్ ధ్వజం.. వారాహి విజయ యాత్ర రెండో విడతలో భాగంగా జులై 10వ తేదీన ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో సుమారు 30 వేల మంది అదృశ్యమైతే.. అందులో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని జనసేనాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని.. కేంద్ర నిఘా వర్గాలే హెచ్చరించాయని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అందుకు నిదర్శం.. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 30 వేల మంది యువతులు అదృశ్యం కావడమేనని వ్యాఖ్యానించారు.

నష్ట పరిహారం ఇప్పించండి.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు..తమను మానసిక ఆవేదనకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం రోజున శాంతినగర్‌కు చెందిన బగ్గా రంగవల్లి అనే మహిళా వాలంటీర్‌.. పవన్‌ కల్యాణ్‌పై విజయవాడ సివిల్‌ కోర్టులో పవన్‌పై డిఫమేషన్‌ కేసు వేశారు. దీంతో వాలంటీర్‌ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఐపీసీ సెక్షన్‌ 500 (పరువునష్టం కలిగించినందుకు శిక్ష), 504, 505 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 357 ప్రకారం.. పరిహారం ఇప్పించాలని కోరారు. తన ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాదులు ఎం.విఠల్‌రావు, ఓ.గవాస్కర్‌ ప్రైవేటు ఫిర్యాదును న్యాయస్థానంలో దాఖలు చేశారు.

పవన్ కల్యాణ్‌ను చట్టపరంగా శిక్షించాలి.. పిటిషనర్ బగ్గా రంగవల్లి మీడియాతో మాట్లాడుతూ..''జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాము. ఎందుకంటే ఆయన (పవన్) వాలంటీర్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం.. నన్ను బాగా బాధించాయి. వాలంటీర్లపై ఆయన తప్పుడు ఆరోపణలు చేశారు. మహిళల ట్రాఫికింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నా భర్త చనిపోయిన తర్వాత నేను నా పిల్లలతో జీవిస్తున్నాను. ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. నన్ను చుట్టుపక్కల వారు పలు రకాల ప్రశ్నలు వేశారు. మహిళల ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై (వాలంటీర్ల) పవన్ కల్యాణ్ నిందలు వేసి, తప్పు చేశారు. ఆయనను (పవన్) చట్టపరంగా శిక్షించాలి అని న్యాయస్థానాన్ని కోరుతున్నాను'' అని మహిళా వాలంటీర్ డిమాండ్‌ చేశారు.

Last Updated :Jul 25, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.